Saturday, October 27, 2012

ఆఖరి హత్య



1988 - 89 ప్రాంతాల్లో మా ఇంట్లో ఒక ఫోటో ఉండేది,తర్వాత చూస్తే మరికొందరి ఇళ్ళకి వెళ్ళినపుడు కూడా ఆ ఫోటో కనిపించేది.ఎప్పుడైనా గుడికి వెళ్ళినపుడు గుడి ముందున్న  ఒక స్మారక స్తూపం లోనూ మళ్లీ అదే ఫోటో, అప్పుడు నాకు అయిదేళ్ళు. చాలా కాలం ఆ ఫోటో నన్ను వెంటాడింది.ఆయనెవరో నాకు తెలీదు ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు కూడా. కానీ ఆ ఫోటో మాత్రం ఇప్పటికీ ఉరిలో ఎక్కడోచోట నాకు కనిపిస్తూనే ఉంటుంది.కొంచెం ఊహ తెలిసాక ఎవరో ఒక పెద్దాయన్ని అడిగాను ఆయనెవరు అని, సమాధానం తెలిసింది. కానీ అది ఇప్పుడు అప్రస్తుతం.
 
                                            గొర్రెపాటి వెంకట రత్నం (బుజ్జి)         స్మారక స్తూపం 
 
వెంకట సుబ్బయ్య గారు బౌద్ధ యుగం తో మొదలుపెట్టి,గాంధీ యుగం జమిందారియుగం,సాంఘిక చరిత్ర తో
1966 లో ఘంటసాల చరిత్ర  గ్రంధాన్ని ముగించారు.మరి ఆ తరువాత ఆ గ్రంధాన్ని కొనసాగించాల్సి వస్తే దాన్ని మొదలుపెట్టాల్సింది రాజకీయ చరిత్ర నుంచే ,కానీ 1966 తరువాత ఉరిలో జరిగింది రాజకీయ చరిత్ర మాత్రమే కాదు రక్త చరిత్ర కూడా. 70 వ దశకం నుంచి 1987 వరకు గ్రామం కక్షల తో నూ హత్య ల తోనూ పార్టీ తగాదాలతో నూ అట్టుడికి పోయింది. ఆ పరంపర కి ముగింపు ఈ ఆఖరి హత్య. 30.12.1987 న జరిగిన ఈ ఉదంతం గ్రామం లో అన్నీ కక్షలకి ముగింపు పలికింది.1 జనవరి 1988 న ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే మన ఊరు మాత్రం పోలీసు పహారా లో బిక్కు బిక్కు మంటూ గడిపింది.
ఆ చరిత్రకి ఇప్పుడు జీవిత చరమాంకం లో ఉన్న కొంతమంది కారకులు,మరికొందరు సాక్షులు. కానీ ఆ కక్షలు కార్పణ్యాలు ఇప్పుడు లేవు ఆ మూర్ఖత్వపు పట్టుదలలు లేవు.మనుషుల ఆలోచనల్లోనూ మానసిక పరిణతి లోనూ ఎంతో మార్పు.కానీ గతాన్ని తలుచుకున్నపుడల్లా ఒక్కసారి ఉలిక్కి పడతారు.అప్పటికి ఇప్పటికి ఉరిలో ఎంత తేడా? అప్పట్లో ప్రతి కేసులోనూ ప్రతి గొడవ లోనూ ఉన్న కొంతమంది ఇప్పుడు గడిపే జీవితం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు,మనవడు,మనవరాళ్ళు,వాళ్ళ ముచ్చట్లు, కనీసం పక్కవాడి గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా వారు గడిపే సాధు జీవితం చూస్తుంటే అసలు ఈయనేనా అప్పుడలా ఉండేవాడు అనిపిస్తుంది.అలా అని ఆ గొడవలకి హత్యలకి నేనేమి ప్రత్యక్ష సాక్షి ని కాదు.ఈ వయసులో అవన్నీ ప్రస్తావించి వివాదాల్ని కొని తెచ్చుకోవటం నాకూ ఇష్టం లేదు.కానీ వెబ్ సైట్ రూపకల్పన సమయం లో నేను కలిసిన ఎంతో మంది పెద్దల దగ్గర నేను తెలుసుకున్న విషయాలు ఎంతో ఆసక్తికరం గా ఉండేవి.అవన్నీ ఎప్పటికైనా వెబ్ సైట్ ద్వారా కానీ  గ్రంధ రూపం లో కానీ  తీసుకురావాలి అనిపించేది.కానీ నేను చూడని విషయాలు,ఎవరో చెప్పిన విషయాలు,నేను రాయటం సముచితం కాదు అనిపించింది.కానీ అప్పటి ఘటనలలో అకారణం గా నిందలు పడిన వ్యక్తుల్నీ కలిసాను,మేమే చేసాం అని ఒప్పుకున్న వ్యక్తుల్ని కూడా కలిసాను.
ఈ ఉపోద్గాతమంతా ఎందుకంటే ఈ మధ్య నే ఘంటసాల చరిత్ర గ్రంధాన్ని పునర్ముద్రించిన విషయం మీకు విదితమే.ఆ ప్రయత్నం లో నేను ఉన్నపుడు చాలామంది పెద్దలు ఆ పుస్తకం 1966 దాకా మాత్రమే ఉంది. ఈ 45 ఏళ్ల చరిత్ర ని కూడా దానికి అనుసంధానించి ఒకే పుస్తకం గా చేస్తే బాగుంటుంది అని. నిజమే మరి బావుంటుంది కూడా. కానీ రాసే వాళ్లేరి? ఒకవేళ రాయాలనుకున్నా ఏమి రాయాలి ? ఈ 45 ఏళ్ల లో జరిగిన అన్నీ ఘటనలకి సాక్షులైన వారు పెదవి విప్పితే,రాసిన అంశాలకి బాధ్యత వహిస్తే ఎప్పటికైనా రెండవ భాగం తీసుకురావాలని ఆశ. అదే కనుక జరిగితే ఆ పుస్తకం పేరు
 
ఘంటసాల చరిత్ర - కొన్ని నిజాలు

Sunday, October 21, 2012

చేయూత లేని చేనేత



మాకు దగ్గరి బంధువులంతా కొత్తపల్లి, కొడాలి, గుండుపాలెం ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు. తరచుగా మా ఇంటికి రాకపోకలు ఉండేవి. వచ్చేటపుడు వారి స్నేహితులనో లేక బంధువులని కూడా తోడుగా తీసుకొచ్చేవాళ్ళు. అలా మా ఇంటికి వచ్చిన బంధువులంతా పొద్దునే వచ్చి కుశల ప్రశ్నలు, మంచి చెడ్డా మాట్లాడుకున్నాక సాయంకాలానికి నేత చీరలకోసం పద్మశాలీల దుకాణానికో లేక కొంతమంది నేత కార్మికుల ఇళ్ళకి చీరలు కొనటానికి వెళ్ళేవాళ్ళు. వాళ్లకి తోడుగా మా అమ్మ , తనకి తోడుగా నేను వారివెంట వెళ్ళిన జ్ఞాపకాలున్నాయి. అప్పుడు చాలా చిన్నతనం,ఆ చీరల నుంచి వచ్చే గంజి వాసన భలే ఉండేది. వాళ్ళు చీరలు చూస్తుంటే  నేను ఆ బేరాలు వింటూ ఉండేవాడిని. ఆ బేరాలు తెగేవి కాదు ముడి పడేవి కాదు. ఘంటసాల పురాతన గ్రామంగా ఎంత పేరు ఉందో,చేనేత వస్త్రాలకి అంతే పేరు ఉంది.
 
 
బీద గొప్ప తారతమ్యాలు లేకుండా అన్నీ తరగతుల వాళ్ళు మన ఊరి చీరలంటే నాణ్యత కలవిగా భావించేవాళ్ళు. స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న పలువురు పెద్దలకి పంచెలు నేసి ఇచ్చిన ఘనత మన వాళ్ళ సొంతం. ఆ రోజుల్లో తరచూ పార్టీ కార్యక్రమాల కోసం, కవితా గోష్టుల కోసం వచ్చే అతిధులందరూ మన గ్రామంలో ఖద్దరుని, నేత చీరలని కొనుగోలు చెయ్యకుండా వారి ప్రయాణం ముగిసేది కాదంటే అతిశయోక్తి కాదేమో. చేనేత మాత్రమే కాకుండా పౌరోహిత్యంలోనూ జ్యోతిష శాస్త్రంలోనూ ప్రావీణ్యత కలవారు కూడా ఈ సామాజిక వర్గం లో ఉన్నారు. మా పక్కింటికి ప్రతి నెల వెంకటేశ్వరరావు అనే ఆయన TVS 50 మీద చీరల మూటల్ని పెట్టుకుని వచ్చేవారు. మా వీధి వాళ్ళంతా ఆ రోజున ఆ యింట్లో చేరే వాళ్ళు. పాపం అయన ఓపికకి మాత్రం మెచ్చుకోవాలి, ఆయన్ని కొట్టటం ఒకటే తక్కువేమో. ఒక్కోసారి ఆ బేరాలు వింటుంటే అదో గొడవలాగా వినిపించేది. కానీ ఇటీవల వారి ఇళ్ళకి,ఆ వీధులకి వెళ్ళినపుడు ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న డాబాలు మాత్రం వెలిశాయి. ఒకప్పుడు మన గ్రామం లో 400 మగ్గాలు ఉండేవట. షష్టి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం మగ్గానికి పావలా చొప్పున విరాళాలు ఇచ్చేవారు పద్మసాలీలు. మన గ్రామంలో ఇప్పుడు అత్యధిక జనాభా వీరిదే. వీరి మద్దతు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవటం ఎవరి వల్లా కాదు. 1935 లో చేనేత సహకార సంఘాలు ఏర్పడ్డాక జిల్లా లోనే అత్యధిక ఉత్పత్తిని సాధించిన సంఘంగా రికార్డులలో నిలిచిన సంఘం మన గ్రామానిదే. అందె జలధిలింగం ప్రెసిడెంట్ గా తుమ్మలచర్ల వెంకట సుబ్బయ్య సెక్రటరీ గా ఏర్పడ్డ శ్రీ విజయలక్ష్మీ చేనేత సహకార సంఘం ఎక్కువ కాలం సాగలేదు. అంతర్గత విభేదాలతో కొద్దికాలానికే ఇది మూతబడింది. దాని నుంచి బయటకి వచ్చి కొందరు పెట్టిన భారతీ రంగా చేనేత సంఘం కూడా కొద్ది కాలానికే అంతరించింది. తరువాత మళ్లీ చేనేతల వెతలు మొదలు అయ్యాయి. సంపాదన కరువు అవ్వటంతో ఆకలి తో అలమటించే చేనేత కార్మికులకి గంజి కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఇదంతా చూసిన కొందరు ఔత్సాహికులు మళ్లీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్లి అడగటంతో మొదట ఆయన తీవ్రంగా మందలించారు. అంతర్గత కలహాలు లేకుండా ఐకమత్యంతో పని చేసుకుంటాం మాకు 'జ్ఞానోదయం' అయ్యింది అని వారు చెప్పటంతో, వారు చెప్పిన ఆ మాట తోనే 'జ్ఞానోదయ' చేనేత సంఘం పేరిట 1952 లో మరొక సంఘాన్ని ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో శ్రీనివాస వీవర్స్ సొసైటీ , పూర్వపు పేరుతో విజయలక్ష్మీ వీవర్స్ సొసైటీ ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇవే మన గ్రామంలో ఉన్న చేనేత సంఘాలు.
 
 
భావనా రుషి వీరి ఆరాధ్య దైవం, పద్మసాలీలకి యజ్ఞోపవీతం ధారణ గావించిన సంఘ సంస్కర్త ఈయనే. జలధీశ్వరాలయానికి దక్షిణ భాగంలో ఉన్న ఈ రుషి ఆలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఈ సామాజిక వర్గం నుంచే గత కొద్దికాలం వరకు అందె జగదీశ్ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసారు. ఆయన కాలం లోనే పంచాయితీ సంత మార్కెట్ ఏర్పాటు అయ్యింది. అన్ని చేతి వృతులు అంతరిస్తునట్లుగానే క్రమ క్రమంగా మన గ్రామంలో ఇది కూడా అంతరిస్తోంది. ఈ తరం వారెవ్వరూ దీనిని ఉపాధి మార్గం గా ఎంచుకోవటం లేదు. కానీ ఇంకా దీని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు మన గ్రామం లో ఎక్కువమందే ఉన్నారు. కాబట్టి మరికొన్నాళ్ళు మన చేనేత వైభవం వెలుగొందుతుంది. కానీ ఆ చేనేత వెలుగు కి మన చేయూత కావాలి....
 

Thursday, October 4, 2012

పెద్దలకి మాత్రమే



ఆ మధ్య పెద్దలారా మన్నించండి కాలమ్ రాసాక చాలా మంది నన్ను అభినందించారు. పెద్దల పట్ల మనం చూపిస్తున్న నిరాదరణకి అద్దం పట్టినట్లుంది అని. కానీ నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి అంశానికి రెండవ పార్శ్వం కూడా ఉంటుంది. కమల్ హాసన్ నటించిన విరుమాండి (తెలుగు లో పోతురాజు) సినిమా చూడండి, ఒకే కధని హీరో చెప్తున్నపుడు ఒకలాగా, విలన్ చెప్తున్నపుడు మరోలా ఉంటుంది. ఎవరికి వారికి తమ కోణం లో చూస్తే తాము చేసేది కరెక్ట్ గానే కనిపిస్తుంది.
 భిన్న దృక్పధాల నుంచి చూస్తున్నపుడు ఒకే అంశంలో భిన్నకోణాలు ఆవిష్కృతమవుతాయి. ఎంత సేపూ పెద్దలని నిర్లక్ష్యం చేస్తున్న పిల్లల గురించే మాట్లాడతాం. నేను కూడా ఈ తరం వాడినే, అందరిలాగే వీకెండ్ సరదాలు, సినిమాలు, షికార్లు, మార్కెట్ లో న్యూ ట్రెండ్స్, వీటన్నిటికి ఏమీ అతీతుడిని కాదు. ప్రస్తుతం యువతరం అనుసరిస్తున్న ఈ ట్రెండ్స్ ని విమర్శిస్తూ తమ చాదస్తంతోనో లేక కాలానుగుణం గా వచ్చే మార్పులని ఆహ్వానించలేక ఈ తరం పద్ధతుల్లో ఇమడలేక పిల్లల మనస్తత్వాలని అర్ధం చేసుకోకుండా వారి చేత నిరాదరణ కి గురవుతున్న పెద్దలూ ఉన్నారు. మా అత్తగారికి చాదస్తం మరీ ఎక్కువండీ అంటూ ఓ కోడలు వాపోతుంది. మా తాత కి నేను జీన్స్ వేస్తేనే నచ్చదురా,మా రోజుల్లో అయితేనా అంటూ మొదలెడతాడు అని స్నేహితుడి దగ్గర చెప్తుంటాడు ఓ కాలేజి స్టూడెంట్. ఇది ఈ తరం వాళ్ళ వెర్షన్. అందుకే పెద్దలు మారాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ముందు మీ పాత కళ్ళజోడు మార్చేయండి. దానితో పాటు కుటుంబాన్ని లోకాన్ని చూసే దృక్కోణాన్ని మార్చుకోండి.ఒక తరం లో పంచెకట్టు ఫాషన్, మీ తరం వచ్చేటప్పటికి బెల్ బాటం, మా తరానికి వచ్చేటప్పటికి జీన్స్ ఫాషన్. ఒకప్పుడు కోరమీసం యువతరాన్ని ఊపేస్తే ఇప్పుడు పిల్లి గడ్డం ఈ తరాన్ని ఏలేస్తోంది. మా రోజుల్లో అయితేనా  అంటూ మొదలుపెడితే ఇప్పుడు వినే ఓపిక ఎవరికీ లేదు. ఎందుకంటే మీ రోజులు మీవే, మావి కాదు. నలభై ఏళ్ల క్రితం బెల్ బాటం, కోరమీసం తో మీరు ఫాషన్ సముద్రాన్ని ఈదినట్లే. ఇప్పటి తరం చిరుగుల జీన్స్ ట్రెండ్ లో కొట్టుకుపోతోంది. వళ్ళంతా టాటూలు వేయించు కొచ్చిన మనవరాలని సంప్రదాయాల పేరు తో బెదరగొట్ట కండి.బావుందమ్మా ఇది లేటెస్ట్ దా అని ముద్దుగా ఆశ్చర్యపొండి. ఒకప్పటి ఉద్యోగాలు వేరు వాటికి అవసరమైన వేషధారణా వేరు. వాటితో పోల్చుకుని అప్పట్లాగా ఉండటం ఇప్పుడు కుదరదు. అంతెందుకు ఒకప్పుడు మీరు తీసుకున్న నెల జీతం మీ అబ్బాయి ఒక గంట కి సంపాదిస్తున్నాడు. మరి మీలాగా అదే జీతానికి పని చెయ్యమని మీరు చెప్పగలరా? కోడలు కాఫీ ఇవ్వటం లేదని చిన్నబుచ్చుకోవటం  ఎందుకు,మీరే వేడిగా కోడలికి ఒక టీ ఇవ్వండి. మీ తరం లో ఒత్తిడి అనే పదమే ఉండేది కాదు .కానీ ఇప్పుడలా కాదు.భార్య భర్తలిద్దరూ పరిగెత్తాల్సిన పరిస్తితి.ఆ పరుగు లో తమను తామే మరిచిపోతున్నారు. వారికి ఇంటికి రాగానే కావాల్సిన ఉపశమనం అందించాల్సింది మీరే. బాల్యం లా,యవ్వనంలా,వృద్ధాప్యామూ ఒక దశ. ఆనందం గా ఆస్వాదించండి.మనసారా జీవించండి. ఇంతకాలం పరిగెత్తి అలసిపోయారు ఇక విశ్రాంతి తీసుకోండి. మీ పిల్లలు, మనవళ్ళు,మనవరాళ్ళకి వారి భాధ్యతని మాత్రమే గుర్తుచెయ్యండి. భాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం రెండూ వృధానే. మీ జ్ఞాపకాలు మీవే, వాటిని పదిలపరచుకోండి.ఈ తరం అలవాట్లని జీవన విధానాన్ని ప్రశ్నించకండి.ఓ సినిమా లో హీరో అంటాడు పాతికేళ్ళ కుర్రాడంటే నాలాగే ఉంటాడు అమ్మా నాన్న కి చెప్పకుండా సినిమాలకి వెళ్తాడు.ఫ్రెండ్స్ తో  షికార్లకి వెళతాడు.వాడలా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్లు లేదంటే ఎవరైనా డాక్టర్ కి చూపించాలి అని. మీ తరం లో ఏదన్నా పెళ్లి సంబంధం వస్తే అసలు మా అబ్బాయికి వక్కపొడి అలవాటు కూడా లేదండి అని చెప్పుంటారు. కానీ ఇప్పుడు అలా చెప్పండి ఒక్క అమ్మాయి అయినా మీ అబ్బాయిని చేసుకుంటుందేమో. మరీ పప్పు సుద్దలా ఉన్నాడే అనుకుంటారు. అలాగే అసలు మా అమ్మాయి వంచిన తల ఎత్తదు అని చెప్పినా చేసుకోటానికి అబ్బాయిలేవరూ సిద్ధంగా లేరు. కాలం తో పాటు వచ్చిన మార్పులకనుగుణం గా ప్రతి మనిషి తమను తాము మలుచుకోవాలి మార్చుకోవాలి. లేదంటే ఈ పోటి ప్రపంచం లో ముందుకు వెళ్ళటం కష్టం అనే విషయాన్ని గ్రహించండి.  మీ ముందు తరం వాళ్ళు చెయ్యలేని ఎన్నో అద్భుతాలని మీరు సృష్టించారు. అలాగే మీరు సాధించలేని ఎన్నో ఆవిష్కరణల్ని ఈ తరం ఇప్పటికే సాధించింది. కుటుంబ పరిస్తితుల కారణంగా వృద్ధాశ్రమాల్లో గడపాల్సి వస్తే క్రుంగిపోకండి. కొత్త స్నేహితుల్ని కొత్త వాతావరణాన్ని ఆస్వాదించండి. సవాలక్ష మజిలీల్లో ఇది ఒకటి అనుకోండి. ఆశావాదం జీవితం మీద సరికొత్త ఆశల్ని కల్పిస్తుంది....