Monday, December 14, 2015

నా ఐరోపా యాత్ర - 30 (ముగింపు)

నిన్న రాత్రి వచ్చిన పీడకల తలుచుకుంటూ ఈ రోజు పడుకోకుండా ఉండలేము. ఎంత మంచి కల వచ్చినా అందులోనే ఉండిపోయి నిద్ర లేవకుండా ఉండలేము. మనిషి గమనమైనా అంతేఎక్కడా దేనికోసం మనం ఆగలేము. మనకోసం ఏదీ ఆగదు. వుయ్ జస్ట్ మూవ్ ఆన్ అంతే. దాదాపు 14నెలల  యూరోప్ వాసాన్ని అనుభవాలని మూటగట్టుకుని మరో మజిలీ కోసం బయలుదేరాల్సి వచ్చింది. వచ్చే ముందు రోజు అక్కడున్న ఇండియన్స్ అంతా మాకు వీడ్కోలు పలకటానికి మా ఇంటికి వచ్చారు. మేము గడిపిన ఆ రోజులన్నీ నెమరు వేసుకుని ఉల్లాసంగా గడిపాం. ఎక్కడికైనా టూర్ ప్లాన్ చెయ్యాలంటే నేనే ముందు ఉండేవాడిని. భార్గవి అక్కడ 3 నెలలే ఉన్నా అందరికీ చాలా దగ్గర అయ్యింది. ఇప్పటికీ మాకు వారితో ఆ సాన్నిహిత్యం కొనసాగుతోంది.
మాకు బాగా దగ్గర అయిన శశి అయితే మేము వచ్చే రోజు చాలా ఎమోషనల్ అయ్యాడు. మార్చిన్ దంపతులు మింజు జేర్జ్ నుండి 400 కిలోమీటర్లు మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు సాగనంపటానికి వచ్చారు. మేము బోర్డింగ్ లోకి వెళ్తుంటే మార్చిన్ కాషా పరుగున వచ్చి మమ్మల్ని వాటేసుకుని ఏడ్చేసారు. జీవితకాలానికి సరిపడిన సంతోషాన్ని అనుభవాలని ఇచ్చిన పోలాండ్ కి వీడ్కోలు పలుకుతూ మే 20, 2013 న పోలాండ్ రాజధాని వార్సా నుండి మధ్యాహ్నం 2.45 నిమిషాలకి దుబాయ్ వెళ్ళే విమానం ఎక్కాం. అప్పటినుండి ఈరోజు వరకు దుబాయ్ లోనే నివాసం. ఇక్కడికొచ్చాక ఉద్యోగ భాధ్యతలు పెరగటంతో నేను యూరప్ నుండి వచ్చేసిన సంవత్సరాలకి కాని ఈ రచనని పూర్తీ చెయ్యలేకపోయాను. నేను అసలు రచయితనే కాదు. నాకు సంప్రదాయక తెలుగు సాహిత్యం అంటేనే తెలియదు. కేవలం చిన్నపటినుండి చదివిన పాఠకానుభవంతోఒక పాఠకుడిగానే ఈ నా అనుభవాలు రాశాను. చాలా చోట్ల నాకు తెలియకుండానే నేను చదివిన రచనల ప్రభావం కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఆ ప్రభావాన్ని నియంత్రించలేకపోయాను అనటం కంటే అంతకుమించి నేను రాయలేకపోయాను అనటం కరేక్టేమో. చరిత్ర గురించిన జిజ్ఞాసకొత్త ప్రదేశాలు చూడాలన్న ఉత్సాహంనాకు తెలిసింది పదిమందికి చెప్పాలన్న ఆకాంక్షే నన్ను నడిపించింది. ఒక పక్క వృత్తికి న్యాయం చేస్తూనే ఖాళీ సమయాల్లో ఈ రచనని కొనసాగించాను. 
                   ​నేను సందర్శించిన దేశాల గొప్పతనాన్ని అద్భుతాలని క్రమశిక్షణ ని అక్కడి వ్యవస్థలని వివరించేటప్పుడు" అదే మన దేశంలో అయితేనా" అంటూ పోల్చి మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం ఎక్కడా చెయ్యలేదు. నేను అక్కడి వ్యవస్థలని చూసి గొప్పగా చెప్పినట్లే ఇతర దేశాల వాళ్ళు భారతదేశం గురించి అంత కన్నా గొప్పగా రచనలు చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అనిపించుకునే ప్రతి దేశంలో ఉన్న వ్యవస్థలు సౌకర్యాలు ,అద్భుతాలు మనకీ ఉన్నాయి. కాకపొతే అవి చివరి వ్యక్తి వరకు చేరటంలోనే వైఫల్యం చెందుతున్నాం. ఇన్ని దేశాలు చూసిన తర్వాత నాకనిపించింది ఏమిటంటే మన దేశంలో కేవలం రెండు వ్యవస్థలు సక్రమంగా పని చేస్తే ప్రపంచంలో మరే దేశం మనతో పోటీ పడలేదు. ఒకటి ట్రాఫిక్ రెండు పరిశుభ్రత. ఈ రెండూ కూడా ప్రభుత్వం ప్రజలు కలిసి పూనుకోవాల్సిన విషయాలుస్వచ్ఛ భారత్ పిలుపుతో ఇప్పటికే ఒక వ్యవస్థ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇది కనుక ఇలాగే కొనసాగితే త్వరలోనే స్వచ్చ భారతాన్ని చూడగలం. ట్రాఫిక్ పట్ల డ్రైవింగ్ లైసెన్సుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే క్రమశిక్షణతో వెళ్ళే ట్రాఫిక్ వల్ల 50కోట్ల ప్రజల విలువైన సమయం ట్రాఫిక్ జామ్ ల వల్ల రోడ్ల మీద వృధా కాకుండా ఉంటుంది. లక్షలాది ప్రాణాలు రోడ్ల ఆకలికి ఆహుతి కాకుండా ఉంటాయి. అలాగే ప్రజలు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకుంటే మన అభివృద్ధి వేగానికి ఇక ఆకాశమే హద్దు. 
                     నేను మొదటిసారి దేశం దాటి దుబాయ్ వచ్చినప్పుడు అక్కడి రాచరిక వ్యవస్థ వల్ల జరిగిన అభివృద్ధి చూశాక ఇండియాలో ప్రజాస్వామ్యం వల్లే అభివృద్ధి జరగటం లేదనే అభిప్రాయం ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి కొన్ని దేశాల నియంతలని చూశాక ఆ అభిప్రాయం తప్పని అనుకున్నాను. మరికొన్నాళ్లకి అత్యధిక జనాభావైశాల్యం వల్ల మన దేశం త్వరగా అభివృద్ధి చెందటం లేదనే అభిప్రాయానికి వచ్చాను. చైనా సాధించిన ప్రగతి చూశాక ఆ అభిప్రాయం కూడా తప్పని అనుకున్నాను. నేను చూసిన దేశాల అభివృద్దిలో ప్రభుత్వ భాగస్వామ్యం కంటే ప్రజల భాగస్వామ్యమే ఎక్కువ. ప్రభుత్వం అంటే వాళ్లకి భయం కాదుతమ దేశం అంటే భాధ్యత. అర్ధరాత్రి గంటలకి నిర్మానుష్యంగా ఉన్న ఒక చిన్న రోడ్డులో రెడ్ సిగ్నల్ పడినప్పుడుమిగతా మూడు దిక్కులనుండి వాహనాలు రావు అని తెలిసినా ఒక పోలిష్ జాతీయుడు 90 సెకండ్ల పాటు ఆ సిగ్నల్ దగ్గరే నిరీక్షించటం నేను పక్కనుండి చూశాను. అదే మనం అయితే ఒక్క సెకండ్ కూడా ఉండకుండా సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతాం. రోడ్డు మీద చాక్లెట్ తిని ఆ కాగితం పారేయటానికి డస్ట్ బిన్ కోసం ఫర్లాంగు దూరం నడిచివెళ్ళిన వ్యక్తుల్ని చూసాను. విచిత్రం ఏంటంటే ఇలాంటి క్రమశిక్షణ మన దేశం నుండి ఆయా దేశాలలో స్థిరపడిన ప్రతి భారతీయుడుకి ఉంటుంది. అది ఆ ప్రభుత్వం అంటే భయం కాదుపక్కవాడు చులకనగా చూస్తారేమో అని భయం. మన దేశంలో లోపించింది అదే. ప్రభుత్వాలు చట్టాలు చెయ్యగలవు తప్ప వాటిని ప్రతివారు పాటిస్తున్నారా అని సమీక్షించలేవు. చట్టాలని గౌరవించటం వాటిని పాటించటం ప్రజల భాధ్యత.  
            ప్రభుత్వ పనితీరు మారాలని ప్రజలువ్యవస్థ మారాలని మేధావులుమనలో మార్పు రావాలని సామాజిక ఉద్యమ కారులుఒకరినొకరు విమర్శించుకుంటూ కాలం గడిపే కంటే ముందు మనం చెయ్యగలిగింది చేస్తే మిగతావన్నీ కలిసి వస్తాయి.
నా ఈ రచనలో ఎక్కడైనా తప్పులు కనిపించినాఅపరిపక్వమైన భావాలు అనిపించినా ఆ తప్పు నా వయసుదే కాని నాది కాదు. ఏమో ఇంకో పదేళ్ళు గడిచాక నేను రాసిన ఈ  పుస్తకం చదువుతుంటే నాక్కూడా అలాగే అనిపించవచ్చు.నా ఈ పుస్తకం కొంతమందికైనా విజ్ఞానాన్ని అందిస్తే అదే పదివేలు.నా తోలి ముద్రిత రచనని సహృదయం తో ఆదరిస్తారని ఆశిస్తూ... 

Tuesday, November 24, 2015

నా ఐరోపా యాత్ర - 29 ( చెక్ రిపబ్లిక్ )

హైదరాబాద్ లో ఎర్రగడ్డ గోకుల్ ధియేటర్ ఎదురుగా రోడ్డులోకి వెళితే జెక్ కాలనీ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది. అసలు జెక్ కాలనీ వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా సిటీలో కలిసిపోయింది కాని ఒకప్పుడు ఇది సిటీ శివారు ప్రాంతం. అశోక్ లేలాండ్ , ఆల్విన్ , ఆస్బెస్టాస్ లాంటి ఎన్నో పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉండేవి. దానికంటే ముందు నిజాం కాలంలో ఒక మందుగుండు ఫాక్టరీ ఇక్కడ ఉండేది. ఆ ఫాక్టరీ నిర్మాణ నిమిత్తం జెకోస్లోవేకియా దేశం నుండి ఇంజినీర్లని ఇక్కడికి పిలిపించారు. పిస్తోళ్ల తయారీకి చెకోస్లోవేకియా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే తుపాకులు ప్రపంచం నలుమూలలకీ ఎగుమతి అవుతాయి. బహుశా అందుకే నిజాం నవాబు వారిని ఇక్కడికి పిలిపించి ఉండవచ్చు. ఆ ఫాక్టరీ నడిచినంత కాలం ఆ దేశం నుండి వచ్చిన ఇంజినీర్ల కోసం 50 బంగ్లాలు నిర్మించి ఒక కాలనీగా ఏర్పాటు చేసారు. విశాలమైన రోడ్లు , పార్కులతో కాలనీ ని అందంగా తీర్చిదిద్దారు. కాల క్రమేణా ఆ ఫాక్టరీ మూతబడటంతో ఆ దేశస్థులంతా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. చాలా కాలం వరకు ఆ బంగ్లాలు అలాగే ఉన్నాయి. కాలక్రమేణా అవన్నీ కూల్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు.ఆ జెక్ కాలనీ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదీ మనకి జెక్ రిపబ్లిక్ కి ఉన్న అనుభంధం.

 మే 6 వ తేదీన మా పర్యటన ముగించుకు వచ్చాక మళ్ళీ మే 11 వ తేదీన వీకెండ్ కావటంతో చెక్ రిపబ్లిక్ వెళదామని నిర్ణయించుకున్నాం. మార్చిన్ , కాషా కూడా ఆ దేశాన్ని చూడలేదు. ఒకప్పుడు ఈ దేశం పేరు చెకోస్లోవేకియా.1918 లో ఆస్ట్రియన్ హంగరీ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొంది చెకోస్లోవేకియా గా అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల చేతుల్లో ఉంది. యుద్ధానంతరం సోవియట్ యూనియన్ తో కలిసి కొనసాగింది 1989 లో సోవియట్ యూనియన్ పతనం తరువాత స్వతంతరంగా అవతరించి 1993 లో శాంతియుతంగా రెండు దేశాలుగా విడిపోయింది. భూబాగంతో పాటు పేరుని కూడా సమానంగా పంచుకుని చెకోస్లోవేకియా నుండి చెక్ రిపబ్లిక్ , స్లోవేకియా అనే రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. మేము ఇప్పుడు వెళ్ళబోతోంది అక్కడికే. మేమున్న మింజు జేర్జ్ నుండి ప్రాగ్ 360 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా వెళితే 4 గంటల ప్రయాణం. ఒక్కరోజులోనే వెళ్లి వద్దామని అనుకున్నాం. చెక్ కరెన్సీ పేరు క్రోనా. మన డబ్బుల్లో ఒక క్రోనా కి 2.50 రూపాయలు వస్తాయి. అదే ఒక యూరో కి 27 క్రోనాలు వస్తాయి.ఆరోజు ఉదయం త్వరగా బయలుదేరినా సగం దూరం వెళ్ళేటప్పటికి వర్షం మొదలైంది. వేరే ఇతర దేశాల వాహనాలు చెక్ రిపబ్లిక్ లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి. దారిలో ఉండే అన్ని పెట్రోల్ బంక్స్ లో ఇవి ఉంటాయి.

మేము వెళుతున్న దారిలోనే స్కోడా కార్ల ఫాక్టరీ కనిపించింది. మనం వాడే స్కోడా కార్లకి పుట్టినిల్లు ఈ దేశమే. దారిలో ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ మధ్యలో ఆగి అక్కడి పొలాలు , ఇళ్ళ మధ్య ఫొటోస్ తీసుకుంటూ వెళుతున్నాం. మధ్యలో ఒక చోట చిన్న రైల్వే క్రాసింగ్ వచ్చింది. అది ఆ దేశపు లోకల్ ట్రైన్ అనుకుంటా , మన ఊటీ లో తిరిగే చిన్న ట్రైన్ లా ఉంది. దాదాపు 4 గంటల 30 నిమిషాలు ప్రయాణించాక ప్రాగ్ చేరుకున్నాం. 1100 ఏళ్ల ఈ పురాతన పట్టణాన్ని స్థానికులు ప్రాహా అంటారు. జనాభా పదమూడు లక్షలు. ఇది చెక్ దేశంలోని అతిపెద్ద నగరం. మొదటి ప్రపంచ యుద్ధానంతరం చెకోస్లోవేకియాకి రాజధాని అయింది. స్లోవక్, చెక్ అధికారిక భాషలు. స్లోవక్ చెక్‌భాషలోని ఓ మాండలీకం. నలభై శాతం మంది దాన్నే మాట్లాడతారు.అసలు ఇక్కడ నిరుద్యోగమే లేదట. ముందు మా కార్ ని ఒక చోట భూగర్భంలో పార్క్ చేసేసాం.పార్కింగ్ ఖరీదు 180 క్రోనాలు.అక్కడికి దూరంగా ప్రాగ్ కేజిల్ కనిపిస్తోంది. దీని పేరు హ్రాడ్‌కని. పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించుకున్న వెయ్యి సంవత్సరాల ఈ కోట యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.

ప్రాగ్ మధ్యలో వ్లటావ నది ప్రవహిస్తుంది.ఆ నదికి రెండు వైపులా నగరం ఉంది. మేము ఆ ప్రాగ్ కాజిల్ కి ఇవతలి ఒడ్డున ఉన్నాం. దానిని చేరుకోవాలంటే వ్లటావ నదిని దాటాలి.చెక్ రిపబ్లిక్‌లో ఉత్తరం వైపు నుంచి ప్రవహించే అతి పొడవైన నది వ్లటావా. ఇది నాలుగు వందల ముప్ఫై కిలోమీటర్లు ప్రయాణించాక, మెల్‌నిక్ అనేచోట ఎల్బీ నదిలో కలుస్తుంది. వ్లటావా నది మీద 31 వంతెనలున్నాయి. వాటిలో అతి పురాతనమైనది చార్లెస్ బ్రిడ్జి. మేము ఛార్లెస్ బ్రిడ్జి మీదుగానే వ్లటావా ని దాటి అవతలకి వెళ్ళాలి. బొహీమియన్ శాండ్‌స్టోన్‌తో పూర్తయిన దీన్ని మొదట్లో స్టోన్‌బ్రిడ్జి లేదా ప్రాగ్ బ్రిడ్జి అనేవారు. పాతరోజుల్లో గుడ్డు సొనని సున్నంలో కలిపి దీన్ని నిర్మించారు. 1870 నించి మాత్రమే దీన్ని చార్లెస్ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. బ్రిడ్జి ఫెన్సింగ్ రాడ్లకి వేసిన వందలకొద్దీ తాళాలు చూసి నవ్వుకున్నాం. పారిస్ లో సీన్ నది ఒడ్డున కూడా ఇలాంటి తాళాలు చూసాం. వీటిని ‘లాక్స్ ఆఫ్ లవ్’ అంటారు. ప్రేమికులు ఇక్కడ తాళాలు వేస్తే వారి ప్రేమ సఫలీకృతం అవుతుందనే ఇక్కడివాళ్ళు నమ్ముతారు.1621 లో నరికిన మనుషుల తలలని ఈ బ్రిడ్జి మీద ఉంచి, చెక్ తిరుగుబాటుదారులు ప్రాగ్ కేజిల్‌కి రాకుండా ఆనాటి రాజు భయభ్రాంతులకి గురిచేశాడు. 1648లో స్వీడిష్ సైన్యం దాడి చేసినప్పుడు, ఈ బ్రిడ్జి మీద యుద్ధం చేయగా కొంత దెబ్బతింది. పూర్వం సైనికులు దీనిమీద నించి శత్రుసైన్యం వస్తోందేమోనని కాపలా కాసేవారు. ఎందుకంటే కోటలోకి ఈ బ్రిడ్జి మీద నించే వెళ్లాలి.ఇప్పుడు మేము కూడా ఈ బ్రిడ్జి మీదుగానే కోట లోకి వెళుతున్నాం.

ప్రాగ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు మాత్రం బావున్నాయి. ట్రాము , బస్సులతోపాటు వ్లటావ నదిలో బోట్లు కూడా ఉన్నాయి. బ్రిడ్జి దాటి అవతలకి చేరుకున్నాక కొంత ఎత్తైన ప్రాంతంలోకి వెళ్లి ఎదురుగా ఉన్న ఓ గేటులోంచి లోపలకు నడిచాం. ఆ గేటుకి అటూ ఇటూ నీలం యూనిఫామ్‌లో ఇద్దరు గార్డులు అటెన్షన్‌లో నిలబడి ఉన్నారు. గంటకోసారి ఇక్కడ జరిగే చేంజ్ ఆఫ్ గార్డ్స్ సెరమనీని పర్యాటకులు ఉత్సాహంగా గమనిస్తారు. ఆ గేట్ దాటి లోపలకి వెళ్తే ఎదురుగా పెద్ద కోర్ట్ యార్డ్. మధ్యలో ఓచోట ఆనాటి బావి. దాన్ని ఐరన్ మెష్‌తో మూసేశారు. దాని ఎదురుగా స్త్రీల ప్రాచీన మోనాస్ట్రీ, కుడివైపు 12వ శతాబ్దంలో నిర్మించిన రోమనెస్క్యూ ప్యాలెస్, ఎడమవైపు సెయింట్ వైటస్ కెథడ్రిల్ ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇక్కడే నివసిస్తున్నాడు. ప్రాగ్ లో అధ్యక్షుడు లేకపోతే ఆ భవనం పై జెండా ఉండదట.

అలాగే నడుచుకుంటూ వెనుక భాగాన ఉన్న సెయింట్ వైటస్ కెథడ్రిల్లోకి నడిచాం. అసలు ఎంత పెద్ద నిర్మాణం అది. మాకు తల ఎత్తి చూస్తే అసలు ఏమీ కనపడట్లా.దీని నిర్మాణం పూర్తవడానికి ఆరు వందల యేళ్లు పట్టిందట. 1344 లో చార్లెస్ IV దీని నిర్మాణాన్ని చేపట్టాడు. పదో శతాబ్దానికి చెందిన రొటుండా అనే భవంతిని పడగొట్టి, ఆ స్థలంలో ఈ కెథడ్రిల్ కట్టారు.  ఇది చెకోస్లోవేకియాలోని అతిపెద్ద చర్చి. దీన్ని గోథే ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. చెక్ రాజుల పట్టాభిషేకాలన్నీ ఇక్కడే జరిగాయి. సెయింట్ వెన్‌సెస్‌లాస్ మృతదేహాన్ని ఖననం చేశారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. చెక్‌ని పాలించిన చార్లెస్ IV, ఆయన నలుగురు భార్యలు ఇక్కడే సమాధి చేయబడ్డారు. నవంబర్ 1344లో దీన్ని తెరిచారు. ఇది రాజుల పట్టాభిషేకానికి, సమాధులకి, రాజవంశీయుల ఆభరణాలని దాచడానికి ప్రధానంగా ఉద్దేశించబడింది.బొహీమియన్ రాజులు పట్టాభిషేక సమయంలో ఉపయోగించిన బంగారు ఆభరణాలు భద్రపరిచిన క్రౌన్ చాంబర్‌ ఇందులోనే ఉంది . ఆ గది తలుపులు తెరవడానికి ఎనిమిది తాళం చెవులు అవసరం అవుతాయి. చెక్ అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ మొదలైన ఎనిమిదిమంది దగ్గర ఈ తాళం చెవులు ఉంటాయి. వారంతా వస్తే కాని ఆ తలుపు తెరిచేందుకు వీలుపడదు.

కోట వెనక భాగంలోంచి కిందకి దిగి ఓ చిన్న సందులోకి వెళ్లాం. దాన్ని గోల్డెన్ లేన్ అంటారు. 15వ శతాబ్దానికి చెందిన ఈ లేన్‌ని చూడటానికి పర్యాటకులు వస్తూండటంతో దాని యజమానులు తమ ఇళ్లు అపూర్వమైనవని గ్రహించి, వాటిని ఫర్నిచర్‌తో, రంగులతో అలంకరించి, కొన్ని నాణాలని తీసుకుని పర్యాటకులకు తమ ఇళ్లని చూపించసాగారు.1953లో చెకోస్లోవేకియా అధ్యక్షుడి కార్యాలయం, గోల్డెన్ లేన్‌లోని ఇళ్లన్నిటినీ కొనేసింది.
కొంతదూరం వెళ్లాక ఓ ఇరుకైన సందు ఉంది , అది ప్రపంచంలోని అతి చిన్న పాదచారుల సందు. ఒకళ్లు వెళ్తే ఇంకొకరు రాలేనంత చిన్న సందు కాబట్టి అక్కడ ట్రాఫిక్ లైట్లని అమర్చారు. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మాత్రమే వెళ్లాలి. లేదంటే మనిషి ఎదురొస్తాడు.మేము వెళ్ళగానే రెడ్ లైట్ ఉండటంతో కాసేపు ఆగాము. అక్కడి నుండి మళ్ళీ చార్లెస్ బ్రిడ్జి మీదుగా  నడుస్తూ టౌన్‌హాల్ స్క్వేర్‌కి చేరుకున్నాం. టౌన్‌హాల్ టవర్‌కి దక్షిణ గోడ దగ్గర 1410లో అమర్చిన ఓర్లోజ్ (ఆస్ట్రొనామికల్ గడియారం) ఉంది. ప్రపంచంలో ఉన్న అలాంటి మూడు గడియారాల్లో ప్రస్తుతం పనిచేసేది ఇదొక్కటే. టవర్ పైన ఉన్న ఈ డయల్ ఆకాశంలోని సూర్యచంద్రుల పొజిషన్‌ని, ఇతర ఖగోళ వివరాలని తెలియజేస్తుంది. కింద ఉన్న క్యాలెండర్ డయల్ నెలని చూపిస్తుంది. 14వ శతాబ్దంలో ప్రాగ్‌ని భూమికి కేంద్రంగా విశ్వసించేవారు. ఆ గడియారం మన సాలార్‌జంగ్ మ్యూజియమ్‌లో బొమ్మ బయటికి వచ్చి గంటలు కొట్టే లాంటి గడియారమే. ప్రాగ్ అంతా మరో పారిస్ లా అనిపించింది. కాకపొతే పారిస్ రాచరికంతో పాటు కొంత ఆధునిక ప్రపంచం కూడా కనిపిస్తుంది. ప్రాగ్ లో అన్నీ పాత వాసనలే ఉన్నాయి. మేము ఇవన్నీ తిరుగుతూ అసలు సమయం కూడా చూసుకోలేదు అప్పటికే సాయంత్రం 8 గంటలు అయ్యింది.అక్కడే కె ఎఫ్ సి లో డిన్నర్ కానిచ్చ్చేసి మళ్ళీ పోలాండ్ వైపు పయనమయ్యాం.



Saturday, November 21, 2015

నా ఐరోపా యాత్ర - 28 (నెదర్లాండ్స్)

ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు మాత్రమే కాదు, స్వలింగ సంపర్కులకి సంభందించిన ఏదో ముఖ్యమైన రోజు. అక్కడున్న మీటింగ్ పాయింట్ దగ్గర మగవాళ్ళంతా చేరి ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు. కొంతమంది బిగ్గరగా ఏదో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే భార్గవి భయపడింది. మాక్సిం చిన్న వాడు కావటంతో మార్చిన్ దంపతులు కూడా అటు వైపు చూడకుండా తీసుకొచ్చేసారు. నాకు దీని గురించి తెలియటంతో పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిగా " గే " వివాహాలని చట్టబద్దం చేసిన దేశం నెదర్లాండ్స్. ఏప్రిల్ 1, 2001 న దీనికి సంభందించిన చట్టాన్ని ఆమోదించారు. కాబట్టి ఇలాంటి దృశ్యాలు ఇక్కడ కనబడటం చాలా కామన్. తరువాత అమ్ స్టర్ డాం లో మేము నడిచిన దారిలో పింక్ పాయింట్ పేరుతో చాలా షెల్టర్స్ కనిపించాయి. లెస్బియన్లు , గే లు కలుసుకునే ప్రదేశాలు అవి.
మనకి నచ్చని పనులని , మన సంస్కృతి కి విరుద్ధమైన పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే ఛీ ఛీ అనటం భావ్యం కాదు. మనం చేసే పనులు మనకి నచ్చినట్లే , అవతలవాళ్ళకి తాము చేసే పనులు వాళ్ళకీ నచ్చుతాయి. మన సంస్కృతి మనకెంత గొప్పదో, అవతలి వాళ్ళకి వాళ్ళ సంస్కృతి అంతే గొప్పది. ప్రతి మనిషిలోను కొన్ని విపరీతమైన భావాలు ఉంటాయి.వాటి మీద కామెంట్ చేసే హక్కు మనకి లేదని నేను భావిస్తాను.మనం చెయ్యని , చెయ్యలేని కొన్ని పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే విమర్శించే సంస్కృతి మంచిది కాదు. ఆడవాళ్ళు జీన్స్ వేసుకుంటేనే నోళ్ళు నొక్కుకునే సంప్రదాయం నుండే మనం ఇంకా బయట పడలేదు. ఇక ఇలాంటి వాటిని మన దేశంలో చట్ట బద్దం చేసినా ప్రజలు ఆమోదించాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో.అక్కడికి దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అప్పటికే సమయం 9 గంటలు అయింది , అప్పుడప్పుడే చీకటి పడుతోంది. మేము ఆ ఇండియన్ రెస్టారెంట్ లోనే డిన్నర్ చేసేసి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగ్మొండ్ అనే ప్రాంతానికి బయలుదేరాం. నేను కావాలనే అక్కడ హోటల్ బుక్ చేశాను. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఒడ్డున పొలాలు, గుర్రపుశాలల మధ్యలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. అమ్ స్టర్ డాం నుండి 45 నిమిషాలు ప్రయాణించాక ఎగ్మొండ్ ప్రాంతానికి చేరుకున్నాం.అప్పటికే చీకటి పడింది. ఆ ప్రాంతం మొత్తం ఫార్మ్ హౌస్ లు గుర్రపు శాలలు ఉన్నాయి. అదొక చిన్న పల్లెటూరులా ఉంది. మేము విడిది చేసిన హోటల్ పేరు " స్టే ఓకే ". మేము వెళ్ళే సరికి కౌంటర్ లో ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. ఇంటర్నెట్ లో బుక్ చేసిన పేపర్ చూపించగానే మాకు రూం కీస్ ఇచ్చాడు. కింద లాంజ్ లో రెస్టారెంట్ , బార్ ఉన్నాయి. రూం కి వెళ్లి ఫ్రెష్ అయిన తరువాత నేను మార్చిన్ కిందకి వచ్చాము. ఆ కుర్రవాడిని అడిగాను నువ్వు ఇక్కడ ఎన్నిరోజులనుండి పని చేస్తున్నావ్ అని. తానొక కాలేజి స్టూడెంట్ అని పగలు కాలేజికి వెళుతూ రాత్రి వేళ ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్పాడు. నెలకి 600 యూరోలు జీతం వస్తుంది , దానితో నా చదువు , ఖర్చులు వెళ్ళిపోతాయి అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆహ్లాదకరమైన ప్రకృతి మమ్మల్ని కనువిందు చేసింది. మాతో పాటు హోటల్ లో ఉన్న టూరిస్టులు ,పిల్లలు అందరూ బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆడుతున్నారు. కొంతమంది జాకీలు గుర్రాలతో ఆ ప్రాంతంలో తిరుగుతుండటంతో పిల్లలంతా ఆ గుర్రాలతో ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా కాసేపు వాళ్ళని చూస్తూ కాలం గడిపాం. తరువాత మాక్సిం తో కలిసి మేము కూడా ఒక ఫోటో దిగాం.
అప్పటికి ఉదయం 10. 30 నిమిషాలు అయ్యింది. మార్చిన్ ఒకసారి అట్లాంటిక్ సముద్రం చూద్దాం అన్నాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళాం. అసలు ఆ నీళ్ళలో కాళ్ళు పెడితే గడ్డ కట్టేలా ఉన్నాయి. నేను చచ్చినా దిగను అని చెప్పా. మాక్సిం సముద్రం చూడగానే ఒకటే ఉత్సాహంతో పరుగులు పెడుతుంటే వాడితోపాటు భార్గవి ,మార్చిన్ ,కాషా కూడా కాసేపు ఆ నీళ్ళలో ఆడుకున్నారు. ఎంతసేపటికీ వాళ్ళు కదలకపోవటంతో నేనే తొందరపెట్టి తులిప్ తోటలకి వెళ్దాం అని అక్కడినుండి బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చాను.


15వ శతాబ్దంలో అభివృద్ధి చేసిన కూకెన్‌హఫ్ ఫ్లవర్ గార్డెన్ (Keukenhof) ప్రపంచంలో అతిగొప్ప ఉద్యానవనం. దీనినే ‘‘గార్డెన్ ఆఫ్ యూరోప్’’ అంటారు. దాదాపు 79 ఎకరాల విస్తీర్ణంలో  ఎటూ చూసినా పచ్చదనం, దానిమీద రంగురంగుల తులిప్ పుష్పాలు కనువిందు చేస్తాయి. దీన్ని చూసేందుకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ మూడు నెలల్లో సందర్శకులతో తులిప్ గార్డెన్స్ కళ కళ లాడుతాయి. మేము బస చేసిన ఎగ్మొండ్ నుండి కూకెన్‌హఫ్ 60 కిలోమీటర్లు. మేము అక్కడికి చేరేటప్పటికి మధ్యాహ్నం 1 అయింది. కార్ పార్కింగ్ దొరకటానికే చాలా సమయం పట్టింది. గార్డెన్ లోకి ఎంట్రీ టికెట్ 16 యూరోలు. ప్రతి సంవత్సరం నవంబర్లో నెదర్లాండ్స్ రాజు ఈ గార్డెన్ లో తోలి మొక్కని నాటటం ద్వారా ఈ గార్డెన్స్ ని ప్రారంభిస్తారు.3 నెలలలో మొక్క పెరిగి పూవులు పూసాక దీని జీవిత కాలం మూడు నెలలు మాత్రమే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ తోటలు ఉంటాయి.
మేము మే 5 న ఇక్కడికి వెళ్ళాము. మే 16 కల్లా ఈ గార్డెన్ మూతబడిపోతుంది.టికెట్ తీసుకుని లోపలి వెళ్ళగానే రకరకాల తులిప్ పూలు మాకు స్వాగతం పలికాయి. అసలు ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో కూడా చెప్పలేము. అక్కడ మాకు చాలామంది ఇండియన్స్ , అందునా తెలుగు వారు కనిపించారు. సాఫ్ట్ వేర్  ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చిన మన కుర్రాళ్ళతో పాటు తెలుగు జంటలు బానే కనిపించాయి. 
మేము గార్డెన్ అంతా 2 గంటల పాటు తిరిగాము కాని మనం సినిమాల్లో చూసినట్లు పెద్ద పెద్ద తోటలు మాత్రం కనపడట్లా. ఒక్కో రంగు పువ్వులు 100 గజాల స్థలంలో పెంచబడి అలా ఆ గార్డెన్ అంతా దాదాపు 500 రకాల పుష్పాలు కనిపించాయి. తులిప్ గురించిన విశేషాలు , వాటికి సంభందించిన సాంకేతిక విశేషాల గురించి మ్యూజియం కూడా లోపల ఉంది.అంతా తిరిగాం కాని ఆ పెద్ద పెద్ద తోటలు చూడలేకపోయామే అనుకుంటూ అసంతృప్తిగా బయటకి వచ్చి కార్ లో మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఈసారి గార్డెన్ వెనుక నుండి కార్ వెళుతోంది. ఒక్కసారిగా కొన్ని వందల ఎకరాల్లో ఉన్న తులిప్ తోటలు కనిపించాయి. అచ్చం మన సినిమాల్లో పాటల్లో కనిపించినట్లే ఉన్నాయి. ఒక్కసారిగా అందరం మళ్లీ వెళ్దాం అని గట్టిగా అరవగానే మార్చిన్ కార్ వెనక్కి పోనిచ్చాడు. అయితే ఆ పొలాలకి దగ్గరగా కార్ పార్కింగ్ లేదు. దాదాపు కిలోమీటర్ ముందు పార్క్ చేసి నడుచుకుంటూ ఆ తోటల దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎంట్రీ టికెట్ కూడా లేదు , అందరూ ఆ తోటల మధ్యలోకి వెళ్లి ఫోటో లు వీడియోస్ తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట వెడ్డింగ్ డ్రెస్ లోనే ఆ తోటల్లో ఫోటో షూట్ చేసుకుంటున్నారు. 

ఇంతకుముందు మ్యూజియం సందర్శించిన అనుభవాల దృష్ట్యా భార్గవి , కాషా నాతో పాటు ఎక్కడికోచ్చినా మ్యూజియంకి మాత్రం రాము అని చెప్పేయటంతో అమ్ స్టర్ డాంలో  కొన్ని మ్యూజియాలు చూద్దామనుకుని కూడా ఆ ఆలోచన విరమించుకున్నాను. కాకపొతే అన్నే ఫ్రాంక్ మ్యూజియంకి మాత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. నేను ఒక్కడినే వెళ్లి చూసి రావాలని, తామంతా బయటే ఉంటామనే ఒప్పందంతో ఆ తోటల మధ్యకాసేపు గడిపి అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడటానికి మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఒక పక్క సమయం అయిపోతుందేమో అనే ఆందోళనతో నా మనసు అంతా కంగారుగా ఉంది. ఎందుకంటే నా వరకు నాకు అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడకపోతే నా యాత్రకి పరిపూర్ణత లేదు. అంతలా నన్ను కదిలించింది ఆ డైరీ అఫ్ యంగ్ గర్ల్ కధ. 

నా అదృష్టం కొద్దీ మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఎంట్రీ ఉంది. కాషా, భార్గవి , మాక్సిం కార్ లోనే ఉంటామన్నారు. మార్చిన్, నేను కలిసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. లోపల ఫోటోలు నిషేధం. ఆశ్విత్జ్ కాంప్ లో లానే ఇక్కడ కూడా అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సన్నటి ఇరుకు మెట్ల గుండా ఆ ఇంటి పైభాగానికి చేరుకున్నాం. మన ఇళ్ళలో అటక మాదిరిగానే ఆ ఇంటి పై అంతస్తులో చెక్కతో కట్టిన అటక మీద అన్నే ఫ్రాంక్ కుటుంబం 25 నెలలు గడిపింది. యుద్ధం ముగియటానికి కేవలం మూడు నెలల ముందే ఒక ఆగంతకుడు నాజీలకి సమాచారం ఇవ్వటంతో ఒక రాత్రి పూట నాజీలు దాడి చేసి అన్నే ఫ్రాంక్ కుటుంబాన్ని కాన్సంట్రేషన్ కాంపుకి తరలించారు.యుద్ధం ముగిసేలోపే అన్నేఫ్రాంక్ తండ్రి తప్ప కుటుంబం అంతా మరణించారు. 1980 వరకు అన్నే ఫ్రాంక్ తండ్రి బతికే ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రభుత్వం ఈ ఇంటిని మ్యూజియం గా మార్చి అన్నే ఫ్రాంక్ వస్తువులని , ఆ అరలని అలాగే ఉంచి పరిరక్షిస్తోంది. లోపల అన్నే రాసిన డైరీ , అన్నే తో పాటు కాంపులో కొన్నాళ్ళు గడిపిన తన మిత్రుల జ్ఞాపకాలతో కూడిన వీడియో చూడవచ్చు. ఆ ఇంటికి బయట కొద్ది దూరంలోనే అన్నేఫ్రాంక్ విగ్రహం ఉంది.హౌస్ అంతా చూశాక బరువెక్కిన హృదయంతో బయటకి వచ్చాం. 

అక్కడినుండి  IAMSTERDAM అనే అక్షరాలతో కూడిన ఒక బోర్డ్ ఉన్న చోటుకి వెళ్ళాం. సందర్శకులంతా అమ్ స్టర్ డాం ని సందర్శించిన గుర్తుగా అక్కడ ఫోటో దిగుతారు. మేము కూడా అక్కడికి వెళ్లి ఫోటో తీసుకున్నాం.అప్పటికి సమయం సాయంత్రం 9.30 నిమిషాలు అయ్యింది. 

చీకటి అప్పుడప్పుడే పడుతోంది. మేము మింజు జేర్జ్ కి వెళ్ళాలంటే అక్కడినుండి 800 కిలోమీటర్లు ప్రయాణించాలి. తొందరపడకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ మే 6 వ తేది ఉదయానికి పోలాండ్ చేరుకున్నాం. 
వచ్చేవారం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. 

Friday, November 20, 2015

నా ఐరోపా యాత్ర - 27 (నెదర్లాండ్స్)

బ్రస్సెల్స్ నుండి నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాం కి 250 కిలోమీటర్లు. సరిగా మధ్యాహ్నం 1.30 గంటలకి ఆటామియం నుండి బయలుదేరాం. దాదాపు గంటన్నర ప్రయాణించాక గూగుల్ మాప్స్ లో చూస్తే బెల్జియం - నెదర్లాండ్స్ బోర్డర్ అని కనిపించింది. హైవే మీద ఉన్న మెక్ డొనాల్డ్స్ దగ్గర లంచ్ కోసం కార్ ఆపాడు మార్చిన్. గంట తరువాత మా ప్రయాణం మళ్ళీ ప్రారంభమైంది.

క్రీ.పూ. 53లో జూలియస్ సీజర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలన చేశాడు. దాదాపు నాలుగు శతాబ్దాలు రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. క్రమంగా ఫ్రాంక్ రాజులు రోమన్‌లను పారద్రోలి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. క్రమక్రమంగా వివిధ రాజులు పాలిస్తూ వచ్చారు. 6వ శతాబ్దంలో ఫ్రిసియన్ రాజులు పాలించారు. తిరిగి 10వ శతాబ్దంలో రోమన్‌లు ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించారు. కాని వీరి పాలనలో ఐకమత్యం లేక స్థానికంగా చిన్న చిన్న డచ్చివారి ప్రైవేటు సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. 13వ శతాబ్దంలో ఇండోనేయల్, ఫ్రెంచి రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 17వ శతాబ్దంలో డచ్చి పాలకులు మొత్తం నెదర్లాండ్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీరి పరిపాలనను గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. 17, 18 శతాబ్దాలలో బటావియన్ రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించింది. 19వ శతాబ్దంలో ఇంగ్లండ్, జర్మనీలు పరిపాలించాయి. క్రీ.శ.1581లోనే స్పెయిన్ నుండి స్వతంత్రదేశంగా ప్రకటింపబడినా, 1954లో స్వతంత్ర దేశంగా ఏర్పాటయింది.ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. ఒక చదరపు కిలోమీటరుకు 404 మంది నివసిస్తున్నారు. ప్రజలు డచ్చి భాషను మాట్లాడుతారు ఇక్కడి ప్రజలు వాళ్ళ స్వంత భాషతో పాటు జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లిష్ వంటి విదేశీ భాషలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడి ప్రజలంతా క్రైస్తవులు, వీరిలో క్యాథలిక్కులు అధికం. జనాభాలో అధికశాతం ప్రజలు దేవుణ్ణి నమ్మరు. దేశంలో బౌద్ధులు, హిందువులు ముస్లిముల జనాభా కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉంది.

నెదర్లాండ్స్ లో ప్రవేశించగానే మనకి కనిపించేవి విండ్ మిల్లులు. అంటే పెద్ద ఫాన్ ని ఒక టవర్ కి పైన బిగించి అది గాలికి తిరుగుతున్నపుడు ఆ శక్తి తో కింద పిండి మర నడిపిస్తారు. పూర్వ కాలంలో రొట్టెలు తయారు చేయటానికి పిండిని ఇలాగే తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా చోట్ల ఇలాంటి గాలి మరలు కనిపిస్తాయి. నెదర్లాండ్స్ సంస్కృతి ని కూడా ఇవి తెలియచేస్తుండటంతో కొన్ని పాత మిల్లులని అలాగే ఉంచేశారు. భార్గవి , కాషా నెదర్లాండ్స్ లో ఉండే తులిప్ తోటల ని చూడబోతున్నామనే ఉత్సాహంతో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళకి సహజంగానే పూలంటే ఇష్టం అందునా తులిప్ అందాలని వెండితెరమీద చూసిన తరువాత ఒక్కసారైనా ఆ తోటల్లో విహరించాలని అందరికీ ఉంటుంది. కాని నా మనసంతా అన్నే ఫ్రాంక్ హౌస్ చుట్టూనే తిరుగుతోంది. నన్ను ఈ యాత్ర చేయటానికి , ఈ పుస్తకం రాయటానికి ప్రేరేపించిన రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన రోజు ( మే 4, 1945) రోజే నా ఐరోపా యాత్ర చివరి మజిలీ చేరుకోవటం , అన్నిటి కంటే ఆఖరున నన్ను అత్యంత ప్రభావితం చేసిన అన్నే ఫ్రాంక్ హౌస్ సందర్శించటం అక్కడే మా యాత్రకి ఆఖరి రోజు కావటం అంతా యాదృచ్చికం. రెండవ ప్రపంచ యుద్ధంలో కాన్సంట్రేషన్ కాంపుల్లో చంపబడ్డ లక్షలాది యూదులు , చిన్నారులలో అన్నే ఫ్రాంక్ అనే చిన్నారి కధ మాత్రమే ప్రపంచానికి తెలిసింది.1939 -1945 మధ్య కాలం లో జరిగిన మానవ హననంలో లక్షలాది యూదు చిన్నారుల జీవితాలు నాజీల దౌష్ట్యం కారణంగా చిద్రమై పోయాయి. ఎన్నో చిన్ని గుండెలు వారి ఇనప బూట్ల పాదాల కింద నలిగిపోయాయి. 1929 జూన్ 12 న జర్మనీలో Frankfurt లో  జన్మించింది అన్నే ఫ్రాంక్ . వారిది యూదు కుటుంబం . తండ్రి బిజినెస్ మాన్, అందమైన కుటుంబం, 1935 లో నియంత హిట్లర్ అధికారం లోకి వచ్చాడు.1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది .జర్మనీ లో యూదులకి రక్షణ లేదని అర్ధమైన వెంటనే అన్నే ఫ్రాంక్ తండ్రి తమ కుటుంబాన్ని హాలండ్ కి మార్చాడు. తన వ్యాపారాన్ని తోటి జర్మన్ మిత్రులకి అప్పగించాడు. యూదులు ఎక్కడున్నా వేటాడి చంపించాడు హిట్లర్ .1942 లో అన్నే కుటుంబం రహస్య స్తావరాలలో దాక్కోవాల్సిన గతి పట్టింది .తల్లి అన్నే , సోదరి లకు కొందరు ఆశ్రయం ఇచ్చి దాచారు .ఒక అపార్ట్మెంట్ లో పై భాగంలో ఉన్న చిన్న అరల్లో 25 నెలలు జీవితాన్ని గడిపింది.ఈ విషయాన్ని అన్నే secret annex అన్నది .1942 జూన్ పన్నెండు న ఆమె పుట్టిన రోజున ఎవరో ఒక డైరీని కానుక గా ఇచ్చారామెకు .దానినే తన స్నేహితుని గా భావించి దిన చర్య రాయటం ప్రారంభించింది .అలా ఆ రెండు సంవత్సరాల్లో ఆమె రాసిన తన దినచర్య , తాను గడిపిన ఆ రెండేళ్ళ రహస్య జీవితం గురించి రాసిన విశేషాలు ఎ డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ గా పేరుగాంచింది. కాని దురదృష్టవశాత్తు ఎవరో వీళ్ళ గురించి సమాచారం ఇవ్వటంతో నాజీలు 1944 సెప్టెంబర్ 3 న దాడి చేసి కుటుంబం మొత్తాన్ని పోలాండ్ కు గొడ్లను తోలుకు వెళ్లి నట్లు తోలుకు వెళ్ళారు . ఆడవాళ్ళను ,పిల్లల్ని బట్టలు ఊడ దీయించి వర్షం లో నిలబెట్టారు. అన్నే ఫ్రాంక్ తండ్రిని మాత్రం వేరే కాంపుకి తరలించారు. అన్నే ఫ్రాంక్ అక్క మరియు తల్లి తన కళ్ళముందే బెల్షన్ కాంపులో చనిపోయారు. కొన్ని రోజులకి 16 వ ఏడు రాకుండానే అన్నే ఫ్రాంక్ టైఫాయిడ్ సోకి 1945 మార్చ్ లో అదే కాంప్ లో మరణించింది.

యుద్ధ సమయం లో ఎవరైనా డైరీలు రాసుకొని ఉంటె యుద్ధం పూర్తీ అయిన తర్వాత వాటిని ప్రచురిస్తామని 1944లో రేడియో లో ప్రకటన వచ్చింది . 1945 లో యుద్ధం ముగిశాక బ్రిటిష్ వాళ్ళు అందర్నీ వదిలేశారు. అయితే వేరే కాంప్ లో ఉన్న అన్నే ఫ్రాంక్ తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అన్నే రాసిన డైరీ దొరికింది .దానిని ఆయన 1947 లో కొద్దిగా మార్చి ప్రింట్ చేస్తే 25 మిలియన్ల  అమ్ముడయాయి ఎందరో నాజీ నిర్బంధాన్నిగురించి, వారు చేసిన దారుణాలను గురించి డైరీలు రాసినా అన్నే ఫ్రాంక్ డైరీ కున్న ప్రాధాన్యత దేనికీ రాలేదు . దాదాపు అరవై భాషల్లోకి అనువాదం పొందింది . బైబిల్ తర్వాతా అన్నే డైరీకి అంతగిరాకీ  వచ్చింది .దక్షిణాఫ్రికా స్వాతంత్ర ఉద్యమ నేత ,అధ్యక్షుడు నెల్సన్ మండేలాజైలు లో ఉండగా  అన్నే ఫ్రాంక్ డైరీని తానూ చదివానని ఏంతో  ప్రభావితం చేసిందని తోటి ఖైదీలకు కూడా చదివి వినిపించానని రాశాడు. ఈ పుస్తకమ్మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. నటాలీ పోర్ట్‌మన్ అనే అమెరికన్ నటి 1997లో ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ పుస్తకం ఆధారంగా నిర్మించిన బ్రాడ్‌వే చిత్రంలో అన్నే ఫ్రాంక్ పాత్ర పోషించింది. నటాలీ పోర్ట్‌మన్ కూడా రెండవప్రపంచ యుద్ధం తరువాత ఇజ్రాయిల్ వెళ్లి స్థిరపడ్డ యూదు కుటుంబానికి చెందిన యువతి. ఈ డైరీ కి ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ భార్య ముందు మాట రాసింది.అన్నే ఫ్రాంక్ తండ్రి  81 వ ఏట 1980 లో చని పోయాడు .అన్నే పేర ఒక ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారా ఎన్నో ప్రజోపకారమైన పనులు చేస్తున్నారు . ఆమె ఇంటిని స్మ్రుతి చిహ్నం గా మార్చారు . ప్రతి ఏటా కనీసం ఆరు లక్షల మంది దాన్ని సందర్శిస్తారు . అన్నే నివసించిన అరలు , ఆమె తాలూకు వస్తువులు , డైరీ ఒరిజినల్ ప్రతి , అన్నే ఫ్రాంక్ చిన్న వీడియో క్లిప్ ఈ ఇంట్లో చూడవచ్చు. ఇప్పుడు నేను చూడాలని అనుకున్నది అన్నే ఫ్రాంక్ మ్యూజియంగా పిలవబడుతున్న ఈ సీక్రెట్ అనెక్స్ అనే హౌస్. మార్చిన్ కి ఈ కధంతా తెలుసు , ఇలాంటి కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయారు కాని అన్నే ఫ్రాంక్ తండ్రి ధనవంతుడవ్వటం వల్ల ఇంతటి ప్రాచుర్యం వచ్చిందంటాడు మార్చిన్. ఇలా నా ఆలోచనలు అన్నే ఫ్రాంక్ చుట్టూ తిరుగుతుండగానే మేము అమ్ స్టర్ డాం లోకి ప్రవేశించాం. ఆరోజు బాగా చలిగా ఉంది అక్కడ. మేము బయలుదేరినప్పుడు బ్రస్సెల్స్ లో అంత చలిగా లేదు. మేము నేరుగా అన్నే ఫ్రాంక్ హౌస్ దగ్గరికి వెళ్ళాం, కాని అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు అవ్వటంతో ప్రవేశం నిలిపివేశారు. ఎలాగు మేము బస చేసేది ఆ రాత్రికి నెదర్లాండ్స్ లోనే. రేపు చూద్దాంలే అని సిటీ చూడటానికి కాలి నడకన బయలుదేరాం. 
అమ్ స్టర్ డాం ఇంచుమించు వెనిస్ లాగే అనిపించింది. అమ్ స్టాల్ అనే నది ఈ నగరం గుండా ప్రవహిస్తోంది. ఈ నది కెనాల్ లోనే బోటులో సందర్సకులంతా విహారానికి వెళుతున్నారు. ఒకరకంగా ఇది Venice of north europe అనవచ్చు. ఓపెన్ బోట్స్ తో పాటు హౌస్ బోట్స్ కూడా ఈ కెనాల్స్ లో ప్రయాణికులని చేరవేస్తున్నాయి. మాకు కార్ల కంటే ఎక్కువగా సైకిళ్ళు కనిపించాయి.ఎక్కువమంది సైకిల్లనే వాడుతున్నారు. సైకిళ్ళు అద్దెకిచ్చే షాపులు ఎక్కువగానే ఉన్నాయి. గంటకి అద్దె 5 యూరోలు అని రాసి ఉంది ఒకచోట. అలా మేము నడుస్తుండగానే జనాలంతా ఒకే వైపు వడి వడిగా పరుగులు పెట్టటం కనిపించింది. ఏమి జరుగుతోందో అని మేము కూడా అటు వైపు వెళ్ళాం. తీరా చూస్తే అది అమ్ స్టర్ డాం నగర కూడలి. అతి పెద్దదైన రాజ భవనాలు , టుస్సాడ్ మ్యూజియం మధ్యలో ఈ సిటీ కూడలి ఉంది. 15 నిమిషాల్లో దాదాపు 10000 మంది పోగయ్యారు. మాకు అప్పుడు కాని అర్ధం కాలేదు, బ్రస్సెల్స్ లో మేము చూసిన యుద్ధం ముగిసిన రోజు వేడుకలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అందరి మొహాల్లో విషాదం. కొంతమందైతే ఏడుస్తూ ఉన్నారు. పోలీసులు అంతా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాసేపటికి నెదర్లాండ్స్ రాజు తన సతీమణితో కలిసి ఆ కూడలి లో ఉన్న ఒక స్థూపం దగ్గరికి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన యూదులకి సైనికులకి అశ్రు నయనాలతో నివాళి అర్పించారు. వారి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు అందరూ మౌనం పాటించారు. 10000 మంది ఓపెన్ ఏరియా లో ఉన్నా సూది పడినా విన్పించే నిశ్శబ్దం ఆవరించింది. మేము కూడా వారితోపాటు అక్కడే నిలబడి నివాళి అర్పించాము.
అప్పటికి సమయం సాయంత్రం 8 గంటలు అయ్యింది. ఇంకా చీకటి పడలేదు సూర్యుడు అప్పుడే అస్తమించే దశలో ఉన్నాడు. మేము అక్కడినుండి మళ్ళీ నడుచుకుంటూ మా కార్ పార్కింగ్ దగ్గరికి వస్తున్నాం. అమ్ స్టర్ డాం లో చెప్పుకోవాల్సింది కాఫీ షాప్స్. నాకు వాటి వెనుక కధ తెలియదు , మార్చిన్ నవ్వుతూ అడిగాడు కాఫీ తాగుదామా అని. ప్రతి కాఫీ షాపులోనూ విపరీతంగా జనాలు ఉన్నారు. సిగరెట్ పొగ, కాఫీ వాసనలతో ఆ షాపులన్నీ సందడిగా ఉన్నాయి. నన్ను మార్చిన్ ఒక షాప్ లోకి తీసికెళ్ళాడు. అక్కడ ఒక ఆకు బొమ్మ వేసి Its Legal Here అని రాసి ఉంది. దానితోపాటు గాజు సీసాల్లో రకరకాల ఎండిన ఆకులు ఉన్నాయి. వాటితో తయారు చేసే రకరకాల కాఫీ మెనూ ఉంది అక్కడ. మార్చిన్ ఎందుకు నన్ను కాఫీ తాగుతావా అని అడిగాడో అర్ధం అయ్యింది. అవన్నీ మన గంజాయి తరహా రకరకాల ఆకులు. ఆ కాఫీ తాగితే ఒకరకమైన నషా వస్తుంది. అక్కడ ఇదంతా కామన్ మరియు ప్రభుత్వ పరంగా అనుమతి కూడా ఉంది. అన్నిటితో పాటు నేను గమనించిన మరో ఆసక్తి కరమైన అంశం, అక్కడ అన్ని షాపుల్లో మన వినాయకుడి ఫోటోలు ఉన్నాయి. మార్చిన్ కి కూడా ఆ ఫోటో తెలియదు అప్పుడు నేను ఆవర్ ఇండియన్ గాడ్ అని చెప్పాను. అవి ఎందుకు పెట్టారో అడగాలని రెండు మూడు షాపుల్లోకి వెళ్లాను కాని అక్కడ వాతావరణం చూసి ధైర్యం చాలలేదు.
అలా చూసుకుంటూ ముందుకి రాగానే ఒక మీటింగ్ పాయింట్ కనపడింది. 200 మందికి పైగా అబ్బాయిలంతా అక్కడ ఉన్నారు. కొంతమంది అక్కడ నదిలో దీపాలు వదులుతున్నారు. ఏం జరుగుతోందో చూద్దామని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎదురైన దృశ్యం చూసి భార్గవి నా చేతిని గట్టిగా పట్టుకుని ఛీ ఛీ అంటూ వెనక్కి తిరిగింది. మార్చిన్, కాషా కూడా ఏమైంది అంటూ వచ్చి వాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూసి మాక్సిం కళ్ళు మూసేసి వెనక్కి తీసుకొచ్చేసారు. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ ? 

Saturday, October 31, 2015

నా ఐరోపా యాత్ర - 26 (బెల్జియం )

లక్సెంబర్గ్ నుండి బ్రస్సెల్స్ 240 కిలోమీటర్లు. మేము బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. నేరుగా ప్రయాణించి సాయంత్రం 6 గంటలకల్లా బ్రస్సెల్స్ చేరుకున్నాం. ముందు రోజు రాత్రి కూడా నిద్ర లేకపోవటంతో నేరుగా హోటల్ కి చేరుకొని ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నాం. మరుసటి రోజు ఉదయం మే 4 వ తేది 2013 మా అదృష్టమో లేక యాద్రుచ్చికమో తెలియదు కాని ఆ రోజున మేము బ్రస్సెల్స్ లో ఉండగలిగాం. హిట్లర్ పాలనకి రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నరమేధానికి చరమ గీతం పాడిన రోజు అది. 1945 మే 4 న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే 4 న సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది.ఈ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితి నెలకొల్పబడింది. మరోవంక, ఈ యుద్ధం కారణంగానే  ఐరోపా దేశాలన్నీ ఏకీకరణ దిశగా అడుగులు పడటం మొదలయింది. అటువంటి చారిత్రాత్మక రోజున ఐరోపా రాజకీయ రాజధాని అయిన బ్రస్సెల్స్ లో ఉండటం మా అదృష్టమనే చెప్పాలి.
ఐరోపా రాజకీయ రాజధాని అని ఎందుకన్నానంటే యూరోపియన్ సమాఖ్య పార్లమెంట్ భవనం బ్రస్సెల్స్ లోనే ఉంది. ఐరోపా సభ్య దేశాల నుండి ఎన్నికైన ప్రతినిధులంతా ఇక్కడి పార్లమెంట్ భవనంలోనే సమావేశమవుతారు.ఐరోపా సమాఖ్య తీసుకునే పలు కీలకమైన నిర్ణయాలకి ఓటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఈ సమాఖ్య రూప కల్పనలో కీలకంగా వ్యవహరించిన 5 దేశాల్లో బెల్జియం ఒకటి. అందుకే ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించారు. 1952 లో ఇక్కడ తొలి సమావేశం జరిగింది. కొత్త దేశాలు ఈ యూనియన్ లో చేరాలన్నా, ఏదైనా సంక్షోభంలో ఉన్న దేశాలని ఆదుకోవాలన్నా ఈ పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. మేము మాములుగానే ఆ పార్లమెంట్ చూద్దామని ఉదయం 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళాం. ఆరోజు అంతా అక్కడ సందడిగా ఉంది జనాలంతా పార్లమెంట్ ముందు క్యూ లో నిలబడ్డారు. అప్పుడే మాకు మే 4 అనే విషయం గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రజలందరినీ పార్లమెంట్ చూడటానికి అనుమతిస్తారు. అంతే కాదు నేరుగా పార్లమెంట్ సమావేశాలు జరిగే హాల్ లోకి వెళ్లి కూర్చోవచ్చు. పార్లమెంట్ పని తీరు , ఓటింగ్ జరిగే ప్రక్రియ అంతా అక్కడ చూడవచ్చు. నేను మాక్ ఓటింగ్ జరిగే చోటుకి వెళ్లి అసలు ఆ విధానం ఎలా ఉంటుందో అని చూసి నేను కూడా ఓటింగ్ లో పాల్గొన్నాను. పార్లమెంట్ హలో కూర్చొని మాక్ పార్లమెంట్ లో మాట్లాడటం మరిచిపోలేని అనుభవం.




హాల్ బయట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండవ ప్రపంచ యుద్ధం తాలూకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. యుద్ధం ముగిసిన దగ్గరనుండి ఐరోపా సమాఖ్య ఏర్పాటు వరకు జరిగిన వివిధ ఘట్టాలని ఫోటోల రూపంలో వలయాకారపు ఓపెన్ ఆడిటోరియం లో చుట్టూ ఉంచారు. సందర్శకులందరికీ గుర్తుగా వారి ఫోటోని ప్రింట్ చేసి షర్ట్స్ ఉచితంగా ఇస్తున్నారు. సావనీర్లు, ఫోటోలకైతే లెక్కే లేదు. మేము కూడా ఆ పార్లమెంట్ సందర్శించినట్లు గా వారి నుండి ఒక అధికారిక ఫోటో తీసుకున్నాం. సందర్శకులంతా అక్కడ ఒక పచ్చటి పలక పై తమ సందర్శనకి గుర్తుగా సంతకాలు చేస్తున్నారు. మేము కూడా మా పేర్లు రాసి ఇండియా అని రాసాము. దాదాపు 4 గంటల సమయం అక్కడే గడిపి అక్కడినుండి సిటీ చూద్దామని బయటకి వచ్చాము. బెల్జియం లో ఎక్కువశాతం మంది కాథలిక్కులు అయినా అన్ని మతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. 2007 లో బౌద్ధులు తమ మతాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెల్జియంలో ఐదు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. అక్కడక్కడా మసీదులు కూడా కనిపించాయి, కాకపొతే మిగతా దేశాల్లో కనిపించే ఆకృతిలో కాకుండా ఒక బిల్డింగ్ లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో బురఖాని నిషేదించిన మొట్ట మొదటి యూరప్‌ దేశంగా బెల్జియం నిలిచింది. 2010 లో బ్రస్సెల్స్‌ ఫెడరల్‌ పార్లమెంటు దేశీయ వ్యవహారాల కమిటీ పాక్షికంగా, లేదా సంపూర్ణంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాని ధరించకుండా నిషేధం విధిస్తూ శాసనంద్వారా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మేము వెళుతుండగా St. Michael and St. Gudula Cathedral కనిపించింది. ఇది అత్యంత పురాతనమైన ఎత్తైన చర్చి. 11 వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభిస్తే 1519 నాటికి గాని పూర్తి కాలేదు.కారు లోనుండే ఆ చర్చి ఫోటో తీసుకున్నాను.

అక్కడినుండి నేరుగా ఆటామియం దగ్గరికి వెళ్ళాము. 1958 లో ఒక ఎగ్జిబిషన్ నిమిత్తం దీనిని నిర్మించారు. బ్రస్సెల్స్ ఎక్స్ పో భవనం ముందు కొద్ది దూరంలో ఇది ఉంది. దీని ఎత్తు 335 అడుగులు, బెల్జియం లో ఇది వింతైన నిర్మాణం. పైకి వెళ్ళటానికి మెట్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియం. పైకి వెళ్ళాలంటే టికెట్ ఉంది.

దీనికి పక్కనే మినీ యూరోప్ మ్యూజియం కూడా ఉంది. ఒక్కో దేశం నుండి ఒక్కో నిర్మాణాన్ని తీసుకుని వాటి మినీ రూపాలని ఇక్కడ నిర్మించారు. యురోపియన్ సమాఖ్యలో ఉన్న అన్ని దేశాల ఐకానిక్ భవనాలన్నీ మినియెచర్ రూపంలో ఇక్కడ చూడవచ్చు. బ్రస్సెల్స్ వెళ్తే మాత్రం చాక్లెట్ వాఫ్ఫెల్ తినకుండా మాత్రం రావద్దు. ఇక్కడ ఈ ఐటెం చాలా ఫేమస్ ఆటామియం పక్కనే చిన్న వాన్ లో వాఫెల్ అమ్ముతుంటే అక్కడే తిన్నాం. అప్పటికే హోటల్ చెక్ అవుట్ చెయ్యటంతో అక్కడినుండి నేరుగా నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాంకి బయలుదేరాం. 

Thursday, October 29, 2015

నా ఐరోపా యాత్ర - 25 (లక్సెంబర్గ్)

పారిస్ నుండి నేరుగా బెల్జియం వెళ్దామని అనుకున్నాం. అలా వెళితే కేవలం 4 గంటల్లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరుకోవచ్చు. కాని ఈలోపు మార్చిన్ మరో ఆలోచన చేశాడు నేరుగా బెల్జియం వెళ్లి ఏమి చేస్తాం అర్దరాత్రి పూట అని కారుని లక్సెంబర్గ్ వైపు పోనిచ్చాడు. అలా మా ప్లాన్ లో లేకుండానే మరో దేశం వెళ్ళాము. వెర్సైల్స్ నుండి లక్సెంబర్గ్  430 కిలోమీటర్లు దూరం. అప్పటికి సమయం రాత్రి 9 గంటలు అవుతోంది.అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఈ వాతావరణంలో గొప్పతనమో లేక రోడ్ల మహత్యమో కాని ఎంత దూరం ప్రయాణం చేసినా అలసట ఉండేది కాదు. మార్చిన్ అయితే ఏకధాటిగా 600 కిలోమీటర్లు డ్రైవ్ చేసినా అసలు అలిసిపోయేవాడు కాదు. మేము లక్సెంబర్గ్ చేరుకునేటప్పటికి ఉదయం 8 గంటలు అయ్యింది. పెద్దగా జన సంచారం లేదు.

యూరోపియన్ యూనియన్ ఆవిర్భావానికి , ఏకీకృత వీసా విధాన ఒప్పందం జరిగింది ఈ దేశంలోనే. 1985 జూన్ 14 న బెల్జియం, లక్సెంబర్గ్ , ఫ్రాన్స్ , నెదర్లాండ్స్, పశ్చిమ జర్మనీ (అప్పటికి తూర్పు జర్మనీ వేరుగా ఉండేది 1990 లోనే బెర్లిన్ గోడని కూల్చటం ద్వారా జర్మనీ ఏకం అయ్యింది) దేశాలు లక్సెంబర్గ్ లో ఉన్న Schengen అనే పట్టణంలో మొదటిసారి యూరోపియన్ యూనియన్ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఒక దేశానికి మరో దేశానికి మధ్య సరిహద్దుల్ని తీసివేసి ఒకే వీసా తో ఈ 5 దేశాలు వెళ్ళగలిగే సౌకర్యాన్ని కల్పించాయి. తరువాత దశల వారీ గా మరో 23 దేశాలు ఇందులో భాగస్వాములయ్యి ప్రస్తుతం 28 దేశాలు ఈ ఒప్పందం కిందకి వచ్చాయి. ఈ ఒప్పందం Schengen అనే పట్టణంలో జరిగింది కాబట్టి యూరోప్ వీసా ని Schengen వీసా అంటారు.ఇప్పుడు మేము ఉన్నది ఆ Schengen ఉన్న దేశంలోనే. రాత్రి పెద్దగా ఏమీ తినకపోవటంతో ఆకలి దంచేస్తోంది.కార్ పార్క్ చేసిన వెంటనే ఎదురుగా మెక్ డొనాల్డ్స్ కనిపించటంతో ప్రాణం లేచి వచ్చింది.

ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మెక్ డొనాల్డ్స్ లో మాత్రం ఒకే రుచిలో ఒకే ధరలో ఆహరం దొరుకుతుంది. మేము తిరిగిన 10 రోజుల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, అన్నీ ఎక్కువ సార్లు మెక్ డొనాల్డ్స్ లోనే తిన్నాం. ప్రపంచ వ్యాప్తంగా 33000 అవుట్ లెట్స్ ఉన్న అతి పెద్ద చైన్ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్. యూరప్ హైవేల మీద ప్రతి 20 కిలోమీటర్లకి ఒక మెక్ డొనాల్డ్స్ కనిపిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేసి బయటకి రాగానే పక్కన షాపులో అద్దాలలో నుండి ఒక హాండ్ బాగ్ కనిపించింది. భార్గవికి అది బాగా నచ్చటంతో లోపలి వెళ్లి 25 యూరోలు పెట్టి అది కొనుక్కుంది.అప్పటిదాకా ఏది కొనుక్కోమని చెప్పినా యూరోని ఇండియా డబ్బుల్లో లెక్క వేసేసుకుని బాబోయ్ నాకొద్దు అంటూ వచ్చేసేది. మొత్తమ్మీద లక్సెంబర్గ్ లో ఒక హ్యాండ్ బాగ్ కొనుక్కుంది. అక్కడినుండి సిటీ మొత్తం కారులోనే తిరుగుతూ చూశాము. 

లక్సెంబర్గ్ ఐరోపాలో 8 వ తక్కువ జనాభా కలిగిన దేశం.మొత్తం జనాభా 5 లక్షలు. దీని ముఖ్య నగరం కూడా లక్సెంబర్గ్. ఇటీవలే ఈ దేశ ప్రధాని తన సహచరుడుని వివాహమాడాడు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఒక దేశాధ్యక్షుడు చేసుకున్న" గే " వివాహంగా ఇది పేరు పొందింది.2014 లో యునైటెడ్ నేషన్స్ సర్వే  ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక  తలసరి ఆదాయం కలిగి అత్యధిక GDP తో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడింది. ప్రపంచంలో ఉన్న బహుళ జాతి కంపెనీలు అన్నీ ఇక్కడొక ఆఫీసుని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టాక్స్ విధానాలన్నీ చాలా సరళీకృతం గా ఉంటాయి. మీరు తెచ్చే డబ్బులకి లెక్కలు అవసరంలేదు. మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ ని తెల్ల డబ్బుగా మార్చుకోవాలంటే ఇక్కడొక కంపెనీ ని తెరిచి దాని ద్వారా విదేశీ పెట్టుబడి కింద మన దేశంలోని కంపెనీలకి తరలించవచ్చు. మారిషస్ , సైప్రస్ ,లక్సెంబర్గ్ ఇంకొన్ని దేశాల్లో ఈ సౌకర్యం ఉంది. ఇక్కడ పెట్టె కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలుగా పిలుస్తారు. కేవలం డబ్బుని దాచుకోవటానికి , ఇతర దేశాల్లో ఉన్న తమ కంపెనీలు ఉత్పత్తుల అమ్మకాల పై సేల్స్ టాక్స్ ఎగ్గొట్టటానికి బిల్లులన్నీలక్సెంబర్గ్ ఆఫీసునుండి తయారు చేస్తారు.ఈ కామర్స్ వచ్చాక ఈ ప్రక్రియ మరింతగా విస్తరించింది. మీరు కొన్ని వెబ్ సైట్లలో కొనే ఉత్పత్తులు మీకు తెలీకుండానే లక్సెంబర్గ్ నుండి బిల్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తే ఆ విషయం అవగతమవుతుంది. లక్సెంబర్గ్ లో మూడు లుక్సంబర్గిష్, ఫ్రెంచ్ మరియు జర్మన్ అధికార భాషలు. లౌకిక దేశం అయినప్పటికీ లక్సెంబర్గ్ ప్రధాన మతం రోమన్ కాథలిక్. లక్సెంబర్గ్ సిటీ చూశాక అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాన్ డెన్ (Vianden) అనే నగరానికి వెళ్లాం. అక్కడ 11 వ శతాబ్దంలో నిర్మించిన పాలెస్ ఒకటి ఉంది దీనిని Vianden castle అంటారు.కొండ మీద నిర్మించబడిన ఈ పాలస్ కింద లోయలు కొండలు కనిపిస్తాయి.చాలామంది అక్కడినుండి కిందికి లోయలోకి ట్రెక్కింగ్ కి వెళుతున్నారు. మేము పాలస్ బయటనుండే చూశాము. 

ఈ పట్టణ జనాభా కేవలం 1800.నగర వైశాల్యం 9 చదరపు కిలోమీటర్లు. మొత్తం రెండు వీధుల్లోనే ఇళ్ళన్నీ ఉన్నాయి. లక్సెంబర్గ్ లో అత్యధికులు దర్శించే పర్యాటక ప్రాంతం ఇదే. లోయలోనుండి కొండపైకి ఛైర్ రోప్ వే ఉంది. దాంట్లో పైకి వెళ్లి కాసేపు ఆ కొండ మీద గడిపి మళ్ళీ మన ఇష్టం వచ్చినప్పుడు కిందకి రావచ్చు. టికెట్ 5 యూరోలు. మేము అందరం ఆ చైర్ కార్ ఎక్కాం.సగం దూరం వెళ్ళాక కింద చూస్తే పెద్ద లోయ , ఒక్కసారిగా భయం వేసింది. కొండమీద నుండి దేశం మొత్తం కనిపించింది.కాసేపు అక్కడే గడిపాక కిందకి వచ్చేశాం. అప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది.పొద్దున్న తిన్న బ్రేక్ ఫాస్ట్ అరిగిపోయి అప్పటికి అరగంట అయిపొయింది. మళ్ళీ మెక్ డొనాల్డ్స్ జిందాబాద్ అంటూ లంచ్ కానిచ్చేసి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్  వైపు కారుని పోనిచ్చాడు మార్చిన్. 



Sunday, October 25, 2015

నా ఐరోపా యాత్ర - 24 (పారిస్)

ముందు రోజు రాత్రి బాగా ఆలస్యమవటం, ప్రయాణ బడలిక తీరకపోవటంతో మరుసటి రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా నిద్ర లేచాం. ఆరోజు నేను చూడాలనుకున్న గుయ్ మెట్ మ్యూజియం కి వెళ్లి అదయ్యాక రాత్రికి బెల్జియం వెళ్ళాలని అనుకున్నాం. అసలు నేను అనుకున్నమ్యూజియం అదో కాదో అనే సందేహంతో పాటు మా ఊరి శిల్పాలు అక్కడ ఉన్నాయో లేదో అనే సందేహం మరొకటి. రామాయణం లో పిడకల వేట లాగా ఈ శిల్పాల గొడవేంటి అనుకుంటున్నారా ? వీటి కధ దాదాపు 90 ఏళ్ల క్రితం జరిగింది.


1923 లో మా ఘంటసాల గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతుండగా పాలరాతి శిల్పాలు బయట పడ్డాయి. అప్పట్లో ప్రజలకు అవగాహన లేక దొరికిన ఇలాంటి శిల్పాలన్ని అక్కడక్కడా గుట్టలుగా వేసి పెట్టేవాళ్ళు. కొంతమంది వాటిని బట్టలు ఉతుక్కునే బండలుగా వాడేవారు. 1927 లో పారిస్ నుంచి వచ్చిన డూబ్రి యెల్ అనే చరిత్ర పరిశోధన కారుడు ఆ శిల్పాలన్ని సేకరించి పారిస్ లో గుయ్ మెట్ మ్యూజియంకి తరలించాడు. ఈ మ్యూజియంలో పలు ఆసియా దేశాలలో దొరికిన వేల ఏళ్ల నాటి శిల్పాలు,వంట పాత్రలు, అలనాటి వస్త్రాలు, చైనా , కంబోడియా దేశాల్లో దొరికిన ఎన్నో అపురూప శిల్పాలు భద్రపరిచారు. నేను మా ఊరి చరిత్రని పరిరక్షించే వెబ్సైట్ రూపకల్పనలో చేసిన పరిశోధనలో మూడేళ్ళ క్రితం ఈ విషయం గురించి విన్నాను. 1966 లో ప్రచురితమైన "ఘంటసాల చరిత్ర" అనే మా గ్రామ చరిత్ర పుస్తకంలో అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన ముందుమాటలో ఈ విషయాన్ని ఉటంకించారు. కేవలం ఈ శిల్పాలు చూడటానికే ఆయన పారిస్ వెళ్ళినట్లుగా చెప్పారు. ఆ తరువాత ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరూ వెళ్లి చూడలేదు కూడా. నేను కూడా పారిస్ వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు.ఆ సమాచారం రాసేటప్పుడు కూడా అదొక విషయం లాగే అనుకున్నాను తప్ప ఎప్పుడూ వెళ్లి చూస్తా అనుకోలేదు.
ఇక మే 1 వ తేదిన ఎంతో ఉత్సాహంగా హోటల్ నుంచి బయలుదేరి పది గంటలకల్లా మ్యూజియంకి చేరుకున్నాం. మెట్రో స్టేషన్ పేరు లేనా. ఈ స్టేషన్లో దిగితే కింద నుంచి పైకి రాగానే కన్పించే మొదటి బిల్డింగ్ ఇదే. దీనికి ఎదురుగా రాయల్ ప్యాలస్ ఉంటుంది.  కాని ఆ రోజు మేడే అనే సంగతి అక్కడికెళ్ళాక గుర్తు వచ్చింది. ఆరోజు సెలవు దినం కావటంతో లోపలికి అనుమతి లేదు. మా షెడ్యుల్ ప్రకారం ఆరోజు రాత్రికే పారిస్ నుండి బయలుదేరాలి. కాని అంతదూరం వెళ్లి మన ఊరు శిల్పాలని చూడకుండా రావటానికి మనసొప్పలేదు. నేను దిగాలు పడటం చూసి నా శ్రీమతి మరియు మార్చిన్ దంపతులు ఇంకో రోజు ఉండి నీ కోరిక ప్రకారం ఈ మ్యూజియం చూశాకే వెళదాం అన్నారు. అప్పటికప్పుడు ఆరోజు అందుబాటులో ఉన్న హోటల్ బుక్ చేశాం. ఇక ఆరోజుకి మిగతా ప్రదేశాలు చూసి మరుసటి రోజుకి మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకున్నాం. పారిస్ లాండ్ మార్క్ అయిన Arc de Triompe దీనికి పక్కనే నడిచే దూరంలోనే ఉంది. 
Arc de Triompe అనేది ఒక స్థూపం. ఫ్రెంచ్ విప్లవంలో అసువులు బాసిన వ్యక్తుల స్మృతి చిహ్నంగా 1806 లో దీని నిర్మాణాన్ని ప్రారంభించి 1836 లో నెపోలియన్ హయాంలో పూర్తి చేశారు. ఆ విప్లవంలో చనిపోయిన వారి పేర్లు దీని గోడలపై చెక్కారు. పారిస్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈఫిల్ టవర్ తో పాటు ఇక్కడ ఫోటో దిగకుండా మాత్రం రారు. దీనిలోపల మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఒక సైనికుడి సమాధి ఉంది. ఇతని వివరాలు అక్కడ లేవు. ఈ కట్టడం రోడ్డు మధ్యలో ఉంది. దీనికి చుట్టూ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. మేము అక్కడికి చేరుకొని కాసేపు ఫోటోలు తీసుకున్నాం. ఆ రాత్రికి మేము బుక్ చేసుకున్న హోటల్ అక్కడికి 40 కిలోమీటర్లు ఉండటంతో 6 గంటలకల్లా బయలుదేరి హోటల్ కి వెళ్ళిపోయాం.  

మరుసటి రోజు మే 2 న పొద్దునే పదిగంటల కల్లా లేనా స్టేషన్ చేరుకున్నాం. మ్యూజియమ్  ప్రవేశ రుసుము  8 యూరోలు. టికెట్ తీసుకుని ముందుకు వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇండియా, కంబోడియా దేశాల శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక ఫ్లోర్ లో రెండు దేశాల చొప్పున మొత్తం నాలుగు అంతస్తుల్లో వివిధ ఆసియా దేశాలలో వర్ధిల్లిన బౌద్ధం, హిందూ మతాల అవశేషాలు, వేల ఏళ్ల నాటి నాగరికత కి గుర్తులైన రాతి పాత్రలు, పలు దేవతల విగ్రహాలు, శిధిల శిల్పాలు ప్రజల సందర్శనార్ధం  ఉంచారు. గుయ్ మెట్ అనేది ఒక ప్రత్యేకమైన మ్యూజియం, కేవలం ఆసియాకి సంభందించిన అవశేషాలని మాత్రమే అక్కడ చూడవచ్చు. ప్రతి శిల్పం దగ్గరా అది దొరికిన ప్రదేశం, సేకరించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి. ఆత్రుతగా ఘంటసాల అనే పేరు కోసం వెతికాను. అమరావతి పేరు ముందు కనిపించింది. నాకంటే ముందే నా శ్రీమతి ఘంటసాల పేరు ఉన్న రెండు శిల్పాలని గుర్తించింది. అవి చూడగానే నా సంతోషం అలవి కానిది. సేకరించిన వ్యక్తి పేరు, సంవత్సరం యధాతధంగా ఉన్నాయి.హెడ్ ఫోన్స్ సాయంతో ఆ శిల్ప వృత్తాంతాన్ని వినవచ్చు. ఆ రెండు శిల్పాల్ని ఫోటో తీసుకుని మిగతా శిల్పాలు చూస్తుండగా అవన్నీ అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ ప్రాంతాల్లో దొరికినవే. కొద్దిగా ముందుకి వెళితే మధ్య ప్రదేశ్, తమిళనాడు,కేరళ ప్రాంతపు అవశేషాలు కనిపిస్తాయి. కొద్దిగా పక్కకి తిరిగితే ఘంటసాల గ్రామం పేరుతో మరో శిల్పం కనిపించింది. మొత్తం మూడు శిల్పాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. చాలా సేపు అక్కడే గడిపి అన్నీ ఫోటోలు వీడియో తీసుకున్నాను. 


ఒకరకంగా ఆ శిల్పాలు అక్కడ ఉండటమే కరెక్ట్ అనిపించింది. దేశ విదేశాలనుంచి వచ్చే లక్షల మంది యాత్రికులు ఆ మ్యూజియాన్ని సందర్శిస్తారు. వారంతా మా గ్రామాన్ని గురించి తెలుసుకుంటారు కదా అని ఒకింత గర్వంగా కూడా అనిపించింది. శంఖంలో పోస్తేనే ఏదైనా తీర్ధం అవుతుంది. మా గ్రామానికి సంభందించిన మరిన్ని శిల్పాలు మద్రాస్ మ్యూజియం లో కూడా ఉన్నాయి. ఎక్కడి ఘంటసాల, ఎక్కడి పారిస్ ? 90 ఏళ్ల క్రితం తరలించిన మా ఊరి శిల్పాలని చూడగలగటం నిజంగా అదృష్టమనే అనుకోవాలి. అవి చూసి బయటకి వచ్చాక గుండెలనిండా నింపుకున్న సంతోషం, ఉప్పొంగిన హృదయంతో నేను ఆకలి కూడా మర్చిపోయాను. మార్చిన్ ఇక తిందామా అనటంతో భోజనం సమయం అయ్యిందని గుర్తొచ్చింది. పక్కనే ఉన్న హోటల్ లో భోజనం చేసి అక్కడినుండి లౌవ్ర్ మ్యూజియం వెళ్దాం అనగానే ముగ్గురూ నన్ను తినేసేలా చూశారు. ఇప్పటిదాకా చూసిన మ్యూజియంలు చాలలేదా అంటూ విసుక్కున్నారు. నిజమే మరి నాకు ఉన్న ఆసక్తి వాళ్ళకి ఉండాలిగా. ఇప్పటికీ భార్గవి కి నాతో ఎక్కడికన్నా రావాలంటే అదే భయం. మ్యూజియంకి వెళ్ళను అంటేనే ఎక్కడికైనా వస్తాను అంటుంది. అందుకే నేను బిజినెస్ ట్రిప్ లు వెళ్ళినపుడు ఇలాంటివన్నీ కవర్ చేస్తుంటా. మేమిద్దరం వెళితే కేవలం హాలిడే స్పాట్స్ మాత్రమే. లౌవ్ర్ మ్యూజియం లోనే డావిన్సి గీసిన మోనాలిసా చిత్రం ఉంది నాకేమో అది చూడాలని కోరిక. మిగతా వాళ్ళెవరికి ఓపిక లేదు. సరే కనీసం బయట నుండి అయినా ఆ మ్యూజియం చూద్దాం అని ఒప్పించి అక్కడికి తీసికెళ్ళాను. అక్కడికెళ్ళాక ఒక బెంచి చూసుకుని, ఈ బొమ్మలూ, చిత్రాలూ, శిల్పాలూ ఏం చూసుకుంటారో చూసుకుని ఇక్కడికే రండి..నా వల్ల కాదు అని భార్గవి అక్కడే కూర్చుంది.తనతో పాటు కాషా , మాక్సిం కూడా కూలబడ్డారు. మార్చిన్ కొంచెం ఇలాంటివంటే ఆసక్తి ఉన్నవాడే, మేమిద్దరం కలిసి ఆ ఆవరణలో కాసేపు తిరిగి ఫోటోలు తీసుకున్నాము. ఇది ప్రపంచంలో మూడో అతి పెద్ద మ్యూజియం. తిండి నిద్ర లేకుండా ఒక్కొక్క మాస్టర్ పీస్ ను  మూడంటే మూడు సెకన్లు చూస్తూ వెళితే ఆ మొత్తం  మ్యూజియం చూడటానికి మూడు నెలలు పడుతుందంట. 
నేను తరువాత బిజినెస్ ట్రిప్ లో మళ్ళీ పారిస్ వెళ్ళినపుడు ఈ మ్యూజియం కి వెళ్లి చూసి వచ్చాను.అప్పుడు తీసుకున్నదే ఈ మోనాలిసా ఫోటో. 

పారిస్ కి సంభందించిన మరో ముఖ్య విషయం, ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.  లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని,  తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా  ఎదిగాడు బ్రెయిలీ.  పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై  చాలా చాలా కృషిచేసాడు. 
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.  ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది.  అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా  తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు.  బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని  పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే. 
ఫ్రెంచ్ చక్రవర్తుల పాలస్ లూ, ఫ్రెంచ్ విప్లవాల, వారి యుద్దాల, విజయాల స్మారక చిహ్నాలు, చర్చిలూ, మ్యూజియం లూ, చివరకి సీన్ నది మీద కట్టిన ప్రతి బ్రిడ్జీ, వందలాది ఏళ్ల చరిత్ర ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుండగా.. గాలేరియాలూ, గట్రా మనం అడుగు పెడితేనే మాసిపోతాయన్నట్టు ఉన్నాయి. భార్గవి అక్కడ ఏదైనా కొందాం అని కొన్ని షాపుల్లోకి వెళ్లి ధరలు చూసి మాట్లాడకుండా బయటకి వచ్చి ఇక నడవండి అంది.పర్లేదు నచ్చింది కొనుక్కోమన్నా వినలేదు. 

ఇక ఆఖరున  వేర్సైల్స్ రాజ భవనం చూడటానికి బయల్దేరాం. ఆరు తరాల ఫ్రెంచ్ చక్రవర్తులు నివసించిన ఆ పాలస్ కోసం పారిస్ నగర శివార్లలో ఉన్న వేర్సైల్స్ నగరానికి వెళ్లాం. అప్పటికే సమయం మించిపోయింది. చీకటి పడుతుండటంతో 6 గంటలకల్లా ప్రవేశం నిలిపివేశారు. కానీ బయట నుండి ఆ రాజ భవనం, వేల ఎకరాల్లో ఉద్యానవనాలూ, బంగారు తాపడాలతో జిగేల్ మంటున్న పాలస్ చూస్తే మతిపోయింది. అసలు దీనిలో నివసించిన వాళ్ళు వారి జీవిత కాలం మొత్తంలో అయినా ఈ పాలస్ మొత్తం చూసి ఉండరని నా గట్టి నమ్మకం. ఆ పాలస్ చుట్టూ ఉన్న రోడ్ మీద మేము కార్ లో తిరగటానికే 30 నిమిషాలు పట్టింది. అక్కడినుండి పారిస్ నగరం వదిలి మా కారు బెల్జియం వైపు సాగిపోతోంది. కానీ నాకు మాత్రం పారిస్ మనస్సులో ఉండిపోయింది. ఎంత అందమైన నగరం, ఏమి కట్టడాలు, గాలరీలు, చర్చిలు, రాజ భవనాలు, వాళ్ల రోడ్ సైడ్ కఫెలూ, మెట్రో లో ప్రయాణాలూ,  ఫాషనబుల్ బట్టల్లో నానా జాతుల వారు, కట్టడాలూ కళ్లల్లో మెదులుతూ ఉండగానే..అనిపించింది పారిస్ మొత్తం చూడటానికి ఒక మనిషి జీవిత కాలం సరిపోదని. 

Friday, October 23, 2015

నా ఐరోపా యాత్ర - 23 (పారిస్)

జూరిచ్ నుండి పారిస్ 600 కిలోమీటర్లు. భార్గవి, కాషా వెనుక సీట్లో కునికి పాట్లు పడుతున్నారు. మాక్సిమ్ అప్పటికే నిద్రపోయాడు. నేను మార్చిన్ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మధ్యలో 2 టోల్ గేట్స్ వచ్చాయి. మన దగ్గర లాగా మనుషులెవరూ అక్కడ లేరు. మనం అవసరమైన చిల్లర వేస్తే ఎలక్ట్రానిక్ గేటు తెరుచుకుంటుంది. సరిపడినంత చిల్లర లేకపోవటంతో నేను క్రెడిట్ కార్డులోనే పే చేసాను. నాకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కాసేపటి తరువాత కారు ఒక విశాలమైన పెట్రోల్ బంక్ ఆవరణలో ఆగింది. మార్చిన్ కి కూడా నిద్ర రావటంతో 4 గంటల తరువాత ఆ పెట్రోల్ స్టేషన్లో ఆపాడు. 2 గంటలు తను కూడా నిద్రపోయి మళ్లీ ఫ్రెష్ అయ్యాక ప్రయాణం మొదలు పెట్టాడు. అప్పటికే తెల తెల వారుతోంది. మరో 2 గంటల తరువాత మరో దగ్గర బ్రేక్ ఫాస్ట్ కోసం కార్ ఆపాడు మార్చిన్. యూరప్ లో పెట్రోల్ బంకులన్నీ అన్ని సౌకర్యాలతో ఉంటాయి. మరీ ముఖ్యంగా దేశాల మధ్య ఉండే హైవే రోడ్లపైన ఉండే పెట్రోల్ బంకుల్లో హోటల్,వాష్ రూమ్స్ మరియు రెస్ట్ రూమ్ ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని బయలు దేరాము. అక్కడికి ఫ్రాన్సు బోర్డర్ ఇంకో 100 కిలోమీటర్లు ఉంది. పారిస్... ఐరోపా సాంస్కృతిక రాజధాని.. కళాకారుల కలల నగరం.. ఫాషన్ ప్రపంచ రాజధాని కూడా కదా .. ఎన్ని నవలల్లో చదివాం.. ఎన్ని రకాలు గా ఊహించుకున్నాం..మూడు రోజులు పారిస్ లో ఉంటామనగానే ఒక రకమైన ఉద్విగ్నత.. పారిస్ నగరమనగానే అందరికీ ఈఫిల్ టవర్ చూడాలని ఉంటుంది. కాని నేను చూడాలనుకున్నది మాత్రం గుయ్ మెట్ అనే మ్యూజియం.నేను జన్మించిన ఘంటసాల గ్రామానికి చెందిన అపురూప బౌద్ధ శిల్ప సంపద 100 ఏళ్ల క్రితం పారిస్ లో ఉన్న గుయ్ మెట్ అనే మ్యూజియం కి తరలించబడింది. ఘంటసాల చరిత్రలో ఆ మ్యూజియం పేరు తప్ప మరే ఇతర వివరాలు లేవు. నేను పోలాండ్ రాగానే ఎప్పటికైనా పారిస్ వెళ్లి ఆ శిల్పాలు చూడాలి అనుకున్నాను. అందుకే బయలుదేరేముందు గూగుల్ లో ఆ మ్యూజియం వివరాలు అన్నీ వెతికి సేకరించి పెట్టుకున్నాను. నేనిలా ఆలోచనల్లో ఉండగానే పారిస్ నగరం మాకు కనిపించ సాగింది. మరి కొద్ది దూరం వెళ్ళగానే దూరంగా ఈఫిల్ టవర్  పై భాగం కనిపించసాగింది. అది చూడగానే మాక్సిం ఐఫ్లా అంటూ ఉత్సాహంతో అరిచాడు. స్కూల్ లో మా స్నేహితులందరికీ అందరికీ చెప్తాను నేను ఐఫ్లా టవర్ చూసా అని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. (పోలిష్ భాషలో ఈఫిల్ టవర్ ని ఐఫ్లా టవర్ అంటారు) నేను ముందుగానే హోటల్ బుక్ చేసి ఉండటంతో నేరుగా హోటల్ కి వెళ్ళిపోయాం. పారిస్ లో పెద్ద సమస్య పార్కింగ్, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది.మా హోటల్ కి దగ్గరలో ఒక ప్రైవేటు పార్కింగ్ ఉంది. రోజుకి 24 యూరోలు పార్కింగ్ ఫీజు.పార్కింగ్ మొత్తం భూమి లోపలే ఉంటుంది. అక్కడే కార్ పార్క్ చేసేసి హోటల్ కి వెళ్లి అందరం ఫ్రెష్ అయ్యాం. హోటల్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. పారిస్ నగరం భూమి పైన ఎంత ఉందో అంత కు అంత భూగర్భం లో ఉంది. ఎక్కడినుంచి ఎక్కడికైనా భూగర్భంలో ఉన్న మెట్రో రైలులో కొద్ది నిమిషాల్లోనే చేరుకోవచ్చు. పారిస్ అంతా రాజప్రాసాదాలు, మ్యూజియంలు, సీల్ నదిపై ఎక్కడికక్కడ నిర్మించిన బ్రిడ్జిల మయం. ప్రతి మెట్రో స్టేషన్లో సిటీ మాప్ తో పాటు చూడాల్సిన ప్రదేశాల వివరాలు,వాటిని చేరుకోవటానికి అవసరమైన మెట్రో రైలు, బస్సు, టూరిస్ట్ గైడ్ ల వివరాలు ఉంటాయి.చరిత్రను భద్రపరుచుకోవటం పారిస్ దగ్గర నుంచే నేర్చుకోవాలి.సీన్ నది చుట్టూ శతాబ్దాల నాటి భవనాల అందం ఒకెత్తయితే, ఎవరి ప్రపంచంలో వారు విహరిస్తున్న మనుషులు  ఒకెత్తు.వివరాల్లోకి వెళ్లేముందు నేను చెప్పాల్సింది ఒకటుంది. జీవితంలో మీరెప్పుడైనా పారిస్ వెళ్ళా లనుకుంటే మాత్రం పెళ్ళయాక భార్యతో వెళ్ళండి.లేదా పిల్లలు పుట్టాక వాళ్లకి ఒక 10 ఏళ్ళు వచ్చాక ఇద్దరూ  వెళ్ళండి. బ్రహ్మచారిగా నో లేక కేవలం మీ మిత్రులతో కలిసి మాత్రం పారిస్ వెళ్ళటం శుద్ధ దండగ. పారిస్ ఒక రొమాంటిక్ నగరం, చరిత్ర మిగిల్చిన వందల ఏళ్ల  శిల్పాల నుండి నేటి ఆధునిక ఫాషన్ ప్రపంచం దాకా అడుగడుగునా శృంగార సౌందర్యం ఉట్టిపడుతుంది. అప్పటిదాకా మేము చూసిన యూరప్ దేశాలన్నీ చల్లగా , ప్రకృతి ఒడిలో సేదదీరుతునట్లు ఉన్నాయి. కాని పారిస్ మాత్రం వందల ఏళ్ల నాటి రాచరికపు హంగులతో ఏదో ఒక రాజ్యంలో ఉన్నట్లు ఉంది. ఏ భవనాన్ని చూసినా తక్కువలో తక్కువ 200 ఏళ్ల క్రితం కట్టినవే ఉన్నాయి. మేము హోటల్ నుండి బయటపడేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది. మెట్రో స్టేషన్లో రోజు వారీ టికెట్లు ఉంటాయి ధర 11 యూరోలు. ఆ టికెట్ తో పారిస్ మొత్తం ఎక్కడినుండి ఎక్కడికైనా మెట్రో లో ప్రయాణించవచ్చు. మార్చిన్ కి ఇవన్నీ అవగాహన ఉన్నాయి కాబట్టి మేము మెట్రో లో వెళ్ళాము. లేదంటే ఏదైనా బస్ టూర్ తీసుకోవటం మంచిది.బస్ అయితే  2 రోజులకి 36 యూరోలు టికెట్ చార్జి. ఆడియో గైడ్ ఉంటుంది , అదీ కాకుండా రోడ్ మీద వెళుతూ పారిస్ వీదులన్నీ కూడా చూడవచ్చు. మెట్రో మొత్తం భూగర్భంలో ఉంటుంది కాబట్టి దిగిన చోట మాత్రమే చూడగలం. మేమున్న ప్రాంతం నుండి మేము మొదటగా వెళ్ళింది నోటార్ డాం అనే చర్చి.
మెట్రో స్టేషన్ నుండి బయటకి వచ్చి చూస్తే ఏముంది? అకస్మాత్తుగా ఒక టైం మషీన్ లో ఎక్కి మూడు వందల ఏళ్ల క్రితం రోజుల్లోకి వెళ్లామా అని ఆశ్చర్యం వేసింది. చుట్టూ పాతకాలపు రాజరిక చిహ్నాలున్న భవనాలు. 1160 లో ఈ చర్చి నిర్మాణం మొదలైతే 1345 నాటికి పూర్తయ్యింది, దాదాపు 200 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది.ఈ మధ్య కాలంలో ఎన్నో అవాంతరాలు ఎదురై కొంతకాలం నిర్మాణం కూడా ఆగిపోయింది.  పూర్తిగా ఫ్రెంచ్ గోతిక్ శైలి లో ఉన్న ఈ చర్చ్ రోమన్ కాథలిక్ లకి  ప్రార్ధనా స్థలం. అసలు అన్నేళ్ల క్రితం ఇది ఎలా కట్టారా అనిపించింది. మొత్తం దీని ఎత్తు 300 అడుగులు మత పెద్దలు బిషప్ ల విగ్రహాలు చుట్టూ చెక్కి ఉన్నాయి. సీన్ నది ఒడ్డునే ఈ చర్చ్ ఉంది. మాకు ఫోటో తీసుకోవాలంటే 100 అడుగులు వెనక నుండి తీస్తే కాని ఆ మొత్తం బిల్డింగ్ ని కవర్ చెయ్యలేకపోయాం.


 ఇక అక్కడినుండి ఈఫిల్ టవర్ వెళ్దామని మాక్సిం మారాం చెయ్యడం మొదలు పెట్టాడు. ఆ చిన్న పిల్లవాడికి ఈ చర్చ్ లు బిల్డింగ్ లు ఏం అర్ధం అవుతాయి. వాడికి ఈఫిల్ టవర్ మాత్రమే కావాలి. ఇక అక్కడినుండి మళ్ళీ మెట్రో ఎక్కి డైరెక్ట్ గా ఈఫిల్ టవర్ స్టేషన్లో దిగాము. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది , అప్పటిదాకా సినిమాల్లో చూసిన ఈ శతాబ్దపు ఏడో వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్  అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు.అసలు విషయం మర్చిపోయా మన తెలుగు సినిమాల్లో మన్మధుడు లో చూపించినట్లు గా పారిస్ ని ఇంకెవరూ చూపించలేదేమో. మేము పారిస్ లో ఉన్నంత సేపు ఎస్కలేటర్ చూసినా సీన్ నది మీద వంతెన చూసినా బ్రహ్మి డైలాగులే గుర్తొచ్చాయి. నీళ్ళంటే పారిస్ వాళ్ళకి కూడా భయమే అందుకే వంతెనలు కట్టారు అని  నేను భార్గవి అవన్నీ చెప్పుకుని నవ్వుకుంటుంటే మార్చిన్ వాళ్ళకి అర్ధం కాలేదు. మెట్రో స్టేషన్ లోంచి బయటకి రాగానే చాలా మంది రోడ్ల మీద నుంచుని బొమ్మలమ్ముకుంటున్నారు.. ఒకర్ని ఈఫిల్ టవర్ ఎక్కడుంది? అని అడగగానే.. నవ్వి వెనక్కి చూపించాడు. ఆకాశమంత ఎత్తులో టవర్.. గుగుర్పాటు గా అనిపించింది. ఆ అనుభూతి చెందిన క్షణం ఇప్పటికీ మరిచిపోలేనిది.మన్మదుడులో మొదటి సారి ఈఫిల్ టవర్  ని ఎలా చూపించాడో మేము చూసినపుడు కూడా అలాంటి దర్శనమే జరిగింది. లవ్ సిటీ అని పారిస్ ని ఎందుకంటారో ఈఫిల్ టవర్ దగ్గర టూరిస్ట్ లని చూడగానే అనిపించింది. 20 ఏళ్ల వయసున్న జంటల దగ్గరనుండి 70 ఏళ్ల వయసున్న జంటలు ఈఫిల్ టవర్ పైకి వెళ్ళటానికి క్యూ లో నిలబడి ఉన్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఒకరి కొకరు అధరచుంబనాల తో తమ ప్రేమని వ్యక్తీకరించుకుంటున్నారు. టికెట్ కౌంటర్ పక్కనే ఈ టవర్ నిర్మాణ కర్త ఈఫిల్ విగ్రహం ఉంది. కొంతకాలం ఈఫిల్ ఈ టవర్ పై ఉన్న గదిలో నివాసం ఉండేవాడు. 
1889 లో దీనిని స్థాపించినప్పటి నుంచీ ఇరవై కోట్లు మందికి పైగా దీన్ని సందర్శించారు . వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది 2006 లో సందర్శించారు.దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది.దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.


ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు. దీనికి 2 అంతస్థులు ఉన్నాయి మొదటి అంతస్థు వరకే అయితే 11 యూరోలు టికెట్ , అదే చివరి వరకు అయితే 17 యూరోలు. మేము మొత్తం పైకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము టికెట్ తీసుకుని పైకి వెళ్ళటానికే గంట పట్టింది. ఇలా 365 రోజులు జనాలు క్యూ లో పైకి వెళుతూనే ఉంటారు. పై నుండి పారిస్ నగరం మొత్తం అద్భుతంగా కనిపించింది. నగరం మొత్తం అందులో భవనాలన్నీ ఎవరో పెయింట్ వేసిన కాన్వాస్ లా అనిపించింది. అక్కడి నుండే గుయ్ మెట్ మ్యూజియం ఎక్కడుందా అని వెతికాను. నా దగ్గరున్న మాప్ ప్రకారం చూస్తే  గుయ్ మెట్  ఈ టవర్ కి దగ్గరలోనే ఉండాలి. టవర్ కి అభిముఖంగా దగ్గరలోనే ఈ మ్యూజియం కనిపించింది. అక్కడినుండే ఒక ఫోటో తీశాను. 

అప్పటికె సమయం 6 గంటలు అవడంతో ఆరోజు మ్యూజియం కి వెళ్ళటం కుదరదు. రేపు వెళదామని మార్క్ చేసి పెట్టుకున్నాం. అక్కడి నుండి మార్చిన్ గార్ డు నార్డ్ అనే ప్రాంతానికి వెళదామా అని అడిగాడు. గార్ డు నార్డ్  అనేది సెంట్రల్ మెట్రో స్టేషన్.యూరప్ లో ఉన్న మిగతా దేశాల నుండి వచ్చే రైళ్ళు అన్నీ ఈ స్టేషన్ కే వస్తాయి. ప్రముఖ తమిళ రెస్టారెంట్ శరవణ భవన్ ఇక్కడే ఉంది. బయటి నుండి చూస్తే అక్కడ మన వాళ్ళు తప్ప మిగతా దేశాల వాళ్ళంతా మన ఫుడ్ లాగించేస్తున్నారు. మేము ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఉండగానే చీకటి పడింది. వెంటనే భార్గవి రాత్రి పూట ఈఫిల్ టవర్ బావుంటుంది కదా మళ్ళీ వెళ్దామా అంది. మా అందరి ముఖాల్లో వెలుగు , అవును కదా ఇదెలా గుర్తురాలేదు మనకి అనుకుని హోటల్ కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్లమల్లా మళ్ళీ ఈఫిల్ టవర్ కి బయలుదేరాం. విద్యుద్దీపాల కాంతుల్లో ధగ ధగ లాడే ఈఫిల్ టవర్ మేము పగలు చూసినదానికంటే ఎన్నో రెట్లు అందంగా ఉంది. అందుకేనేమో మన్మధుడు సినిమా లో త్రివిక్రమ్ రాసినట్లు ఈఫిల్ టవర్ పగలు పెర్ఫ్యూమ్ బాటిల్ లాగ రాత్రి పూట షాంపేన్ బాటిల్ లాగా కనిపిస్తుంది. నిజంగానే షాంపేన్ కిక్ లా ఉంది అలా వెలుగుతున్న ఈఫిల్ ని చూస్తుంటే. అక్కడే కాసేపు గడిపి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుని హోటల్ కి వెళ్ళిపోయాం.