Saturday, September 22, 2012

ముందుచూపు



కవి , తత్వవేత్త తమ కాలం కంటే ముందు ఉంటారనేది నిర్వివాదాంశం. మిగతా వాళ్ళంతా ఆ రెండూ కాదు కాబట్టి గతించిన కాలంలో జరిగిన మార్పుల్నిమాత్రం విశ్లేషిస్తూ ఉంటారు. ఇది ఒకరకంగా అలాంటి విశ్లేషణ. ఒక్క 20 సంవత్సరాలు వెనక్కి వెళదాం. గ్రామంలో గత ఇరవై సంవత్సరాల్లో మనం ఊహించనివి, భవిష్యత్తులో ఇలా కూడా అవుతుంది అని ఎవరూ ఏ మాత్రం అంచనా వెయ్యని కొన్ని సంఘటనలు, మార్పులు తలచుకుంటే నిజంగా ఆశ్చర్యమే. ఇది మన గ్రామానికే పరిమితం అని కాదు నా ఉద్దేశం. ఇది మన వెబ్ సైట్ కాబట్టి మన వరకు మాట్లాడుకుందాం. ఘంటసాలలో మంచినీళ్ళు కొనుక్కుని తాగుతారని అసలు మనం ఊహించి కూడా ఉండము. పెద్దవాడైనా, పేద వాడైనా ఊరి చివర చేతి పంపు నీళ్ళే తాగేవాళ్లు. కాకపొతే ఉన్నవాళ్ళకి పాలేర్లు, లేని వాళ్ళు సొంతంగానూ కావిళ్ళతో నీళ్ళు చేరవేసుకునే వాళ్ళు. Bisleri Water బాటిల్స్ ని ఎప్పుడో తప్ప గ్రామంలో చూడటం అరుదు. మరి ఇప్పుడు? అందరికీ సురక్షిత మంచినీరు, లీటర్ రూపాయికి అమ్మినా, పది రూపాయలకి అమ్మినా అందరం కొనుక్కునే తాగుతున్నాం. సిటీలలో అద్దె ఇళ్ళలో స్థలం లేక కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. గ్రామంలో పశువుల దొడ్లు, విశాలమైన వాకిళ్ళు, వీధిలో షామియానాలలో భోజనాలతోనే ఆ తంతు ముగిసిపోయేది. మరిప్పుడు? చిన్నపాటి కార్యక్రమాలకి కూడా కళ్యాణ మండపమే వినియోగిస్తున్నాం. ఇంటిలో పెళ్ళనేది మానేసి చాలాకాలం అయ్యింది. ఒకరో ఇద్దరో బఫే డిన్నర్ కూడా పెట్టినట్లు గుర్తు. అందరూ బఫే పెట్టే రాజులు కూడా త్వరలోనే ఉన్నాయి. ఇంట్లో ఫంక్షన్లకి మామయ్యలు బాబాయిలు వడ్డన చేయటం మానేసి చాలా కాలమే అయ్యింది. మన ఊర్లో   కళ్యాణ మండపమా ? అని ఆశ్చర్యం,అసహనం వ్యక్తం చేసిన వాళ్లే చక్కగా దానిని వాడుకుంటున్నారు. గ్రామంలో కళ్యాణ మండపం కొందరు వ్యక్తుల ముందు చూపుకి, సంకల్పానికి, విరాళాలిచ్చి ప్రోత్సహించిన వితరణ శీలుర దాతృత్వానికి ప్రతీక. 
 
మాతరం ఊహ తెలిసే నాటికి దిగువ మధ్య తరగతి కుటుంబాలకి మరుగు దొడ్లు ఏర్పడ్డాయి. మన తండ్రుల కాలంలో కూడా కాలకృత్యాలకి బయటికే వెళ్ళే వాళ్ళట. ఇది ఒక భూస్వామి స్వయంగా నాతో చెప్పిన మాట. నా చిన్నతనంలో స్నానాల దొడ్లు ఇంటి బయట ఉండేవి. మెల్ల మెల్లగా అందరికి మరుగు దొడ్లు ఏర్పాటు కావటం నా చిన్నతనం నుంచి నేను గమనించిన ఒక అంశం. కానీ మన ఊర్లో ఆటాచ్డ బాత్రూంతో బెడ్రూములు కడతారని ఎప్పుడూ అనుకోలా. ఇక AC ల విషయం,, ఉషా ఫాన్ అంటే పెద్ద గొప్ప ఒకప్పుడు. కరెంట్ ఉన్నా ఒక్క గదిలోనే ఫాన్ ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న డాబాల్లో కూడా AC లు, గదికి ఒక ఫాన్. ఇంకొక ముఖ్యమైన అంశం టెలిఫోన్ సౌకర్యం. 1962 లో ఊరికి ఫోన్ సౌకర్యం వస్తే 1995 దాకా మన గ్రామంలో ఉన్న ఫోన్ల సంఖ్య వంద కూడా లేదు. అమెరికాలో ఉన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి తమ ఇంటికి ఫర్లాంగు దూరంలో ఫోన్ ఉన్న వాళ్ళింటికి ఫోన్ చేసి తమ వాళ్ళని పిలవమని, వాళ్ళు వచ్చాక మళ్లీ కాల్ చేసి మాట్లాడటం నాకు గుర్తుంది. ఇది ఎప్పుడో 80 లలో అనుకునేరు సుమా, 1997 లో. ఇక ఆ తర్వాత నుంచి ల్యాండ్ ఫోన్ల వరద ప్రారంభం అయ్యింది. ఇక సెల్ ఫోన్ విప్లవం, ఈ మార్పుని నేను గ్రామంలో దగ్గరగా చూడలేదు. ఎందుకంటే అప్పటికే హైదరాబాదు వెళ్ళిపోవటం వల్ల ప్రత్యక్షంగా ఆ మార్పుని గమనించలేదు. కానీ సెలవలకి వెళ్ళినప్పుడల్లా దశల వారీగా ఆ మార్పుల్ని చూసేవాడిని. మొదట కాస్త డబ్బున్న వాళ్ళు, తెల్లటి సిల్కు ఖద్దరు చొక్కాల్లో 500 రూపాయల నోటు మాత్రం కనిపించేలా పెట్టే  షోకిల్లా రాయుళ్ళు దానితో పాటు సెల్ ఫోన్ కూడా పెట్టటం ప్రారంభించారు. మాది వ్యవసాయ కుటుంబం, ట్రాక్టర్లు కిరాయికి తిప్పే బిజినెస్ కావటంతో నా చిన్నతనంలో తెల్లారేటప్పటికి మా ఇంటి చుట్టూ ఒక పదిమంది వచ్చి ఉండేవాళ్ళు. తమ పొలాలు దున్ని పెట్టాలనో లేక ఇసుక తోలి పెట్టాలనో. లాండ్ ఫోన్స్ వచ్చాక ఆ ఫ్లో కొంత తగ్గింది. ఇప్పుడు అయితే ఒక్కళ్ళు కూడా రావట్లా. అన్నీ ఫోన్లలోనే. మెల్లగా ట్రాక్టర్ ఓనర్లు, వాళ్లతోపాటే డ్రైవర్లు, కొన్నాళ్ళకి ముఠా మేస్త్రీలు, ఇప్పుడు ముఠా కూలీలు అందరికీ సెల్. కూలి బేరం కుదరకపోతే క్షణాల్లో అందరికీ సమాచారం వెళ్ళిపోతుంది లొకేషన్ చేంజ్ అని (వేరే పొలానికి). సెల్ ఫోన్ల పుణ్యమా అని ఒక మంచి మాత్రం జరిగింది. మనం అణాలు, బేడలు వినటమే తప్ప చూడలేదు వాడలేదు. కనీసం మాటల్లో కూడా మనం అని ఉండము. మన ముందు వాళ్ళతోనే అవి అంతరించిపోయాయి. సెల్ ఫోన్ కాల్ చార్జీల వల్ల కనుమరుగైపోయిన పైసలు వాడుకలో లేకపోయినా, మాటల్లో వాడుతున్నారు, సెకను కి పైసా అని అరపైసా అని. నేను అయిదు పైసల నాణెం చూసాను, ఖర్చు పెట్టాను కూడా. ఇపుడు బిక్షగాళ్ళకి రూపాయి వేస్తేనే అదోలా చూస్తున్నారు. ఇంతకుముందు పావలాకి ఏమొస్తది అంటే సమాధానం ఉండేది కాదు. ఇప్పుడు ధైర్యంగా చెప్పచ్చు 25 నిమిషాలు టాక్ టైం వస్తుంది అని. ఇక జలధీశ్వరాలయంలో షష్టి లాంటి పండుగలకి తప్ప మామూలు రోజుల్లో నర మానవుడు కూడా ఆ గుడిలో కనిపించేవాడు కాదు. ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం నుంచి రోజూ వచ్చే జనం. రేపో మాపో దర్శనానికి టికెట్ పెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రోజుని కూడా మనం తప్పకుండా చూస్తామని నా గట్టి నమ్మకం. ఇది కూడా కొందరు వ్యక్తుల ముందు చూపుకి నిదర్శనం. దీనికి కూడా పెదవి విరుపులు, అసహనాలు యధాతధం.
ఈ మార్పులన్నీ జరుగుతున్నపుడు మనం గమనించలేదు, ఇలా కూడా అవుతుంది అని ఊహించలేదు. ఒక వేళ ఎవరన్నా ఊహించి చెప్పినా ఇదంతా అయ్యే పనులు కావులే అని పెదవి విరిచిన వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు. మనం పెదవి విరవటానికి కారణం బహుశా సమాజంలో జరుగుతున్న మార్పుల్ని తెలుసుకుని వాటిని అందిపుచ్చుకోలేకపోవటం కావచ్చు. దానికి సమాచార లోపమూ ఒక కారణం .కానీ అవన్నీ జరిగాయి. ఇప్పటి దాకా జరిగిన వాటికి మనం విశ్లేషకులుగానే మిగిలిపోదామా? లేక ఇకనుంచైనా ఆ ముందుచూపుతో అవసరాలని, అవకాశాలని అందిపుచ్చుకుందామా? ఇప్పుడు సమాచార లోపం లేదు, ప్రపంచం లో ఎక్కడ ఏ మార్పు జరిగినా క్షణాల్లో మారుమూల గ్రామాలకి సైతం తెలిసిపోతోంది. ఈ మధ్య టీవిలో ఒక వార్త ని చూసాను,విజయవాడలో స్వర్గపురి అని నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన స్మశానం అని. (వీడియో  దృశ్యాలు ఇక్కడ చూడండి.) కానీ ఈ అంశాన్ని రెండు సంవత్సరాలకి ముందే ఆలోచించిన కొంతమంది దార్శనికులు మన గ్రామంలోనూ దానికి శ్రీకారం చుట్టారు. షరా మాములుగానే ఆ ఇదంతా అవుతుందా,అవసరమా అనే పెదవి విరుపులు కూడా అయిపోయాయి. కానీ ఆల్రెడి సమాజం లో మార్పు మొదలైంది, ఇంకా మనం దానిని అందిపుచ్చుకోలేకపోతే ఈ మార్పు కూడా విశ్లేషణల కోవలోకే వెళ్ళిపోతుంది. మనల్ని మనం దార్శనికులుగా నిరూపించుకోవటానికి తక్షణం మన ముందు ఉన్న అంశం ఇది. గుడికి వందలు పెట్టి టికెట్ కొనుక్కుని దర్శనానికి వెళ్ళే మనం స్మశానానికి కూడా టికెట్ పెట్టుకుని వెళ్ళే రోజులు వచ్చేసాయి. కానీ అవి పెద్ద పెద్ద సిటీ లలోనే కావచ్చు. కానీ మనమే నిర్మించుకునే ఈ స్వర్గపురి ఆ సౌకర్యాలని పేద గొప్ప తేడా లేకుండా అందరికీ ఉచితంగానే అందించే ప్రయత్నంలోనే ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకున్న చాలామంది స్పందించటం ఎంతో ఆనందించదగ్గ విషయం. కానీ ఈ బృహత్తర ప్రణాళికకి చాలా మంది పెద్దల పెద్ద మనసులు కావాలి. లేదంటే ఇంకో పదేళ్ళ తరువాత ఇది కూడా పైన విశ్లేషించుకున్న మార్పుల చెంతన మన ప్రమేయం లేకుండానే జరిగిన మార్పుగా మిగిలిపోతుంది. ముందుచూపుతో ఎవరు దీనికి కారకులు అవుతారో, ఎవరు కేవలం సాక్షులుగా మిగిలిపోతారో కాలమే నిర్ణయిస్తుంది.

Thursday, September 20, 2012

సత్ర విచిత్రం


నేను ఇరవై ఏళ్ళు ఊర్లో పెరిగినా ఇప్పటికీ ఒక్కసారి కూడా చూడని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.దూరపు కొండలు నునుపు అని, ఎక్కడెక్కడో ఉండే చారిత్రక ప్రదేశాలని చూడటానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళతాం. కానీ మనం పుట్టిన ఊరులో ఉన్న చారిత్రక ప్రదేశాలని మాత్రం విస్మరిస్తూ ఉంటాం.చిన్నపట్నుంచి కొన్ని వేల సార్లు సత్రం సెంటర్ అనే పదాన్ని ఉపయోగించి ఉంటాం. కానీ నేను ఖచ్చితం గా చెప్పగలను,ఈ కధనం చదువుతున్న వాళ్ళలో నూటికి తొంభైమంది సత్రం మాత్రం చూసి ఉండరు.
  అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనుకోండి. కానీ ఎందుకో ఆ సత్రం ఎలా ఉంటుందో లోపల  చూడాలనే కుతూహలంతో ఆ మధ్య ఊరు వెళ్ళినప్పుడు మందుల షాపు వాసు గారిని అడిగాను. అడిగిందే తడవుగా అయన నాతో పాటు బయలుదేరి ఆ సత్రం లోపలి ఆవరణని, విశేషాల్ని, భవిష్యత్తు కార్యాచరణని వివరించారు. ఎన్నో సార్లు ఆ సత్రం ముందు నుంచి నడిచినా ఒక్కసారిగా లోపల చూసేటప్పటికి ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళిన అనుభూతి. ఏమిటో చెప్పకుండా ఆ ఫోటో చూపిస్తే మాత్రం మన ఊరు వాళ్ళు ఒక్కళ్ళు కూడా అది మన ఊర్లో బిల్డింగ్ అని అనుకోరు.
1928 లో మన గ్రామానికి వచ్చే యాత్రికుల నివాసం కోసం చుండూరి నాగభూషణం గారు ఈ సత్రాన్ని కట్టించారు. అప్పట్లో దీనికి అయినా ఖర్చు 6000 రూపాయలు. దీనికి ఉపయోగించిన  కారురాయి ఇప్పుడు ఎక్కడా దొరకదు. అందుకే ఇన్నేళ్ళయినా ఆ నిర్మాణం చెక్కు చెదరలేదు. తదనంతర కాలం లో నాగభూషణం గారి కుమారుడు చుండూరి వెంకటరెడ్డి గారు సున్నం వేయించి మరమ్మత్తులు చేయించారు. ప్రస్తుతం వీరి వారసులు ఎవరూ లేరు. అందుకీ ఈ సత్రాన్ని గ్రామంలో వైశ్య సంఘానికి అప్పగించారు. వారి ఆధ్వర్యం లోనే ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఏదైనా చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి,ఆధ్యాత్మిక ప్రవచన భోధనా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి దీనిని ఉపయోగిస్తున్నారు. గ్రామంలో పాత భవనాలన్నీ ఇటీవల కొత్త అందాల్ని సంతరించుకుంటున్న తరుణంలో త్వరలో సత్రం కూడా తన రూపుని మార్చుకోబోతుంది.
  దీని గురించి పూర్తి వివరాలని ఇక్కడ వ్యాఖ్యానించలేను కానీ, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో కళ్యాణ మండపం గ్రామ నడిబొడ్డున తలెత్తుకు చూస్తుందని మాత్రం చెప్పగలను. ఆ తరువాత ఈ పాత నిర్మాణాన్ని చూసే అవకాశం ఈ తరానికి ఉండకపోవచ్చు. అందుకే ఆ సత్ర చిత్రాలు ముందుగానే పదిలపరచబడ్డాయి.

Wednesday, September 19, 2012

నేడే చూడండి.,,ప్రతి రోజూ మూడు ఆటలు


  నేడే చూడండి.. మీ అభిమాన ధియేటర్ రాజ్యలక్ష్మి డీలక్స్ లో ప్రతి రోజూ మూడు ఆటలు..ఆ మైక్ వినిపిస్తే  చెవులు రిక్కిరించుకుని వినేవాళ్ళు అందరూ..రిక్షా వస్తుంటే  పోస్టర్ అంటిస్తుంటే పిల్లలంతా గుమిగూడి పోస్టర్ ని తదేకం గా గమనించే వాళ్ళు.ఇక ఆ రిక్షా రాక  ,ఆ మైక్ వినిపించక రెండేళ్ళు అయ్యింది.బహుశా ఇక వినిపించక పోవచ్చు..ఆ రిక్షా కనిపించక పోవచ్చు. నాకు ఊహ తెలిసాక నాకు గుర్తున్న సినిమా బాలభారతం 1989 లో అనుకుంటా.నేల టికెట్ నుంచి బాల్కనీ దాకా అన్నీ క్లాసుల్లో ను కూర్చుని సినిమా చూసిన రోజులున్నై.పండగ వస్తే కిక్కిరిసి పోయిన హాలు లో స్టూలు మీద కూర్చుని చూసిన రోజులు ఉన్నాయి.చుట్టు పక్కల ఎక్కడా ఇంత శుభ్రం గా ఉండే హాల్ లేదని అనుకోవటం జ్ఞాపకం.టిక్కెట్స్ ఇచ్చే చంద్రశేఖర్,ఎప్పుడూ హాల్లోనే ఉండే బాపినీడు, మిరపకాయ బజ్జీలు వేసే కాంటీన్ ,అందరినీ కోపం గా కసిరే సాయిబు.సాయంత్రం కాగానే ఫెళ ఫెళ లాడే ఇస్త్రి బట్టలతో వచ్చే పెద్దమనుషులు,ఊర్లో విషయాలనుంచి పార్లమెంట్ లో సమస్యల దాకా చర్చలు.ఇటీవల ఆ ధియేటర్ ని చూసినప్పుడు నన్ను ముప్పిరిగొన్న జ్ఞాపకాలు.

 పెరిగిపొతున్న టెలివిజన్ ఛానెల్స్,చదువుల కోసం పిల్లలు, వారి వెనకే తల్లి తండ్రులు,గృహిణులెవ్వరు థియేటర్ వైపు కన్నెత్తి అయినా చూడని పరిస్ఠితి. ఫలితం..! ఒకప్పుడు చుట్టుపక్కల 20 గ్రామాలకి వెండి తెర వినొదాన్ని పంచిన రాజ్యలక్ష్మి థియేటర్ ఇప్పుడు సినిమాలు చూసేవాళ్ళు లేక కనీసం వచ్చిన వాళ్లకొసం సినిమా ప్రదర్శించినా కరెంట్ డబ్బులు కూడా రాని దుస్థితి లో మూతబడింది.ఒకప్పుడు సినిమా హాల్ రోడ్ అంటే ఎప్పుడూ సందడే. ఊరంతా పడుకున్నా 2nd Show అయ్యేవరకు ఆ రోడ్ మాత్రం సందడి గానే ఉండేది.ఇప్పుడు కనీసం ఆ రోడ్డు వైపు కన్నెత్తి అయినా చూసే వాళ్లు లేక చూపరుల హృదయాల్ని బరువెక్కిస్తూ రాజ్యలక్ష్మి డీలక్స్  గత వైభవానికి మూగ సాక్ష్యం గా నిలిచింది.ఈనాటికి సరిగ్గా పాతికేళ్ల క్రితం 1986 లో మన ఊరి అల్లుడైన శ్రీ పరంధామయ్య గారు తన సతీమణి  పేరు తో ఈ థియేటర్ ని కట్టారు. స్వాతిముత్యం ఈ థియేటర్ లో ప్రదర్శించబడిన తొలి సినిమా.ఆరోగ్య కారణాల రీత్యా 1998 లో చల్లపల్లి వాసులకి అమ్మివేయటం జరిగింది.అప్పటినుంచి ఈనాటి వరకు  థియేటర్ వారి ఆధీనం లోనే ఉంది. పెరిగిపోతున్న టాక్స్ లు,ఉన్నత వర్గాల గృహిణులెవ్వరూ సినిమాకి రాకపోవటం,యువత అందరూ చదువుల కై పట్టణాల కి వలస వెళ్ళటం,మారుతున్న జీవన ప్రమాణాలు,వేగవంతం అయిన రవాణా సౌకర్యాలు,మరియు రిలీజ్ సినిమాలన్ని చల్లపల్లి రావటం వల్ల ఎక్కువమంది మన ఊరికి ఆ సినిమా వచ్చే లోపే చూడటం తదితర కారణాల వల్ల నిర్వహణ కష్టతరమై విధి లేని పరిస్థితి.అలా అని మనమేదో సినిమాలు చూసి ఈ ధియేటర్ ని ఉద్ధరించమని నా ఉద్దేశం కాదు.కాల ప్రవాహం లో కనుమరుగవుతున్న ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలని మళ్లీ నెమరువేసుకోవటానికే ఈ కధనం.

Saturday, September 15, 2012

తొలిసారి అమెరికా వెళ్ళిన వ్యక్తి


 శ్రీ వేమూరి వెంకట నరసింహారావు గారు


                                                           ఇపుడైతే మన గ్రామంలో యువకులంతా అమెరికా వెళ్లటం సర్వసాధారణ విషయమే కాని,అసలు తొట్ట తొలిసారిగా మన గ్రామం నుంచి అమెరికా వెళ్లిన వ్యక్తి శ్రీ వేమూరి నరసింహారావు గారు.ఎప్పుడూ విన్నట్లు లేదు కదూ,మనం మరిచిపోతున్న పాత తరం చరిత్ర మరియు వ్యక్తుల్లో శ్రీ వేమూరి వెంకట నరసింహారావు గారు ఒకరు.ఘంటసాలలో ఆంగ్లవిద్య లో తొలి పట్టబద్రుడు (First graduate in English medium)ఈయనే.ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ గా 1950మరియు 1960 దశకాల్లో పత్రికారంగానికి ఎనలేని సేవ చేశారు.
    1956 లో భూస్వామ్య సంస్కరణల ఆవశ్యకత ను గురించి ఆంధ్రప్రభలో రాసిన వ్యాసం ఎంతో మందిని ఆలోచింపచేసింది.అదే పత్రికలో ఆర్ధిక విజ్ఞానం గురించి 1957లో రాసిన వ్యాసం ఆయన కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.అందులో ఆయన చర్చించిన విషయాలు విమర్శకులను సైతం మెప్పించాయి.
  "గౌరీశంకర్అనే కలం పేరుతో ఈయన రాసిన "శిఖరాలు"అనే శీర్షిక సుమారు 5సంవత్సరాలపాటు తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురితమై పాఠకుల మన్ననలు పొందింది.ఎటువంటి క్లిష్టమైన విషయమైనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల నేర్పు నరసింహారావు  గారి సొంతం.                    
1950దశకంలో ఆంధ్రపత్రికా ప్రతినిధుల తరపున ఆయన తొలిసారిగా అమెరికాలో పర్యటించారు.ఆ విధంగా మనగ్రామం నుండి తొలిసారి అమెరికా వెళ్ళిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న నరసింహారావు గారి గురించి ఈతరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
                        శ్రీ వేమూరి సుబ్రమణ్యేశ్వరరావు మరియు అందరికి తెలుగు అధ్యాపకుడిగా సుపరిచితులైన శ్రీ వేమూరి విశ్వేశ్వరరావు ఈయన కుమారులు.

Friday, September 14, 2012

"మూగ"బోయిన వైద్యం


“The greatness of a nation and its moral progress can be judged by the way its animals are treated" దేశం యొక్క గొప్పతనం, నైతిక విలువలు ఆ దేశంలో జంతువుల్ని,మూగజీవాలని పరిరక్షించే విధానాల ద్వారా తెలుస్తాయని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తి మన గ్రామం లో పశువుల ఆస్పత్రి లో కనిపిస్తుంది.మనం పట్టించుకోని చాలా ముఖ్యమైన విభాగాల్లో పశువుల ఆసుపత్రి ఒకటి. మనుషులకి నోరుంది, మన భాధని డాక్టర్ కి చెప్పుకోవటానికి ఆ భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ భాధని విని తగిన వైద్యం చేసే అవకాశం డాక్టర్లకి ఉంది.కానీ నోరు లేని మూగజీవాలకి, వాటి భాధని తమంతట తాముగా తప్ప తెలుసుకోలేని పశువైద్యులకి ఆ అవకాశం, అదృష్టం లేవు. మీలో ఎంతమందికి ఈ ఆలోచన మదిలో మెదిలి ఉంటుందో చెప్పండి? వ్యవసాయానికి, పశుపోషణకి నిలయమైన మన గ్రామంలో ఒకప్పుడు అసలు పశువుల డాక్టర్ పేరు కూడా రైతులకి తెలీదు.
చదువుకునే వాళ్లకి మాత్రం ఏదైనా సర్టిఫికేట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలంటే మాత్రం అత్యంత అలుసైన వ్యక్తిగా మాత్రం మన ఊర్లో పశువుల డాక్టర్ గుర్తొస్తాడు. కానీ కొన్ని సంవత్సరాలపాటు ఈ సాంప్రదాయాన్ని మార్చేసి, పశువుల డాక్టర్ అంటే ఇలా ఉంటాడు,ఆసుపత్రి అంటే ఇలా ఉండాలి అని, ఆసుపత్రి రూపు రేఖల్ని మార్చటంతో పాటు పశు వైద్య విధానంలో మన గ్రామంలో నవ పోకడలకి నడకలు నేర్పిన వ్యక్తి మనోరంజన్.
అప్పటివరకు గేదలకి ఏదైనా జబ్బు వస్తే ఆసుపత్రికి తీసికెళ్ళటం అలవాటు లేని సన్న, చిన్నకారు, రైతులు కూడా ఆసుపత్రి బాట పట్టారు.ప్రభుత్వం నుంచి పశుపోషణకి సబ్సిడీలు వస్తాయని చాలామంది రైతులకి తెలిసింది ఆయన వచ్చిన తర్వాతే. పాడి పరిశ్రమకి నెలవైన గ్రామంలో ఆ విభాగపు వైద్యుల వివరాలని కూడా సేకరించి పొందు పరచాలని పశువుల హాస్పిటల్ కి వెళ్ళిన నాకు, ఎదురుగా దండతో ఉన్న ఫోటో చూడగానే షాక్ కొట్టినట్లైంది. కాసేపు ఏమి అర్ధం కాక అక్కడున్న డాక్టర్ వివరాలు తీసుకుని వచ్చేసాను. మనసు ఒక పది సంవత్సరాలు వెనక్కెళ్ళింది. బక్క పల్చని శరీరం, నిండా పాతికేళ్ళు అయినా లేని ఓ యువకుడు అప్పుడే చదువు పూర్తి చేసుకుని మొట్ట మొదటి పోస్టింగ్ మన గ్రామంలోనే రావటం తో వెటర్నరీ డాక్టర్ గా మన పశువుల హాస్పిటల్ లో నియమితుడయ్యాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామంలో రైతుల్ని, పశుపోషకులని తన సేవాభావంతో ఆకట్టుకున్నాడు. అప్పట్లో బజాజ్ కాలిబర్ బైక్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. ఆ బైక్ మీదే ఊర్లో రైతులు అర్ధరాత్రి పిలిచినా అపరాత్రి పిలిచినా కాదనుకుండా వెళ్ళేవారు. ఊరిలో యువకులకి అయనంటే కొద్ది రోజుల్లోనే ఎంతో అభిమానం ఏర్పడింది. స్కూలు నుంచి కాలేజి కి వెళ్ళేవాళ్ళకి, ఏదైనా ఉద్యోగానికి అప్లయ్ చేసుకునే వాళ్ళకి, పాస్ పోర్ట్ అప్లై చెయ్యాలన్నా, ఏదైనా గెజిటెడ్ రాంక్ ఆఫీసర్ సంతకం కావాలి. వెటర్నరీ డాక్టర్ ది గెజిటెడ్ రాంక్ కావటంతో చాలామంది ఆయన్నే ఆశ్రయించేవారు.
కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు నెలకి వేలకి వేలు జీతాలు తీసుకుంటున్నా సరే ఇలాంటి సంతకాలకి పదో పరకో మాత్రం పుచ్చుకునే అలవాటు.లేదా వాళ్ళ దగ్గర ఉండే అటెండర్ కైనా ఆ తాయిలం సమర్పించాల్సిందే. ఇంత చేసినా రెండు మూడు సార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఈ అనుభవాలు నాకు చాలానే ఎదురయ్యాయి. కానీ మనోరంజన్ సంతకం చేసి మనకే ఎదురు తాయిలం ఇచ్చేవారు,ALL THE BEST అని చెప్పి. ఒక సారి ఇలాగే ఏదో అవసరం అయ్యి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాల్సి వచ్చింది. నా క్లాస్ మేట్ రెహమాన్ ఆయన దగ్గర సహాయకుడుగా పనిచేస్తుండేవాడు. వాడిని అడిగితే హాస్పిటల్ కి రమ్మని చెప్పటం తో బయలుదేరాను, దారిలోనే ఏదో పని నిమిత్తం వెళుతూ ఎదురవటంతో మళ్లీ హాస్పిటల్ కి రాగానే వెళదాంలే అనుకుంటూ వెనక్కి తిరిగాను. అప్పటికే ఆయనకి విషయం తెలిసి ఉండటంతో బైక్ ఆపి దీనికేందుకండి మళ్లీ రావటం అని రోడ్డు మీదే సంతకం చేసి హాస్పిటల్ కి వెళ్లి స్టాంప్ వెయించుకోమని సింపుల్ గా చెప్పి సాగి పోయాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత నేను చదువు రిత్యా గ్రామం నుంచి బయటకి వెళ్లి పోవటంతో ఆయన గురించి అంత ఆరా లేదు. ఏదైనా ఊరికి ట్రాన్స్ ఫర్ అయ్యి వెళ్లి పోయారేమో అనుకున్నాను తప్ప ఆ హాస్పిటల్ లోనే అయన ఫోటోని దండతో చూస్తానని అనుకోలేదు.ఆ ఆసుపత్రి వివరాలని కానీ, ఆ డాక్టర్   వివరాలు కానీ నేను వెబ్సైట్ లో పొందు పరచలేదు. తర్వాత మన గ్రామం నుంచి అదే విభాగంలో  డాక్టర్ చదివిన సోదరుడు రాకేష్ వేమూరి ఆ జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ఆ అతి సేవాభావమే అయన ప్రాణాల మీదకి  తెచ్చిందని,పశువుల్లో ఉండే ప్రాణాంతకమైన BRUCELLA అనే వైరస్ ఆయన శరీరంలో ప్రవేశించటంతో మూడుపదులు నిండకుండానే ఆ మనిషికి నూరేళ్ళు నిండిపోయాయని. రైతు గేదల్ని హాస్పిటల్ కి తీసుకు రాకపోయినా తానె స్వయంగా వెళ్లి పరిశీలించి ఆ జబ్బులకి మందుల్ని రాసిచ్చేవారు.ఈ క్రమంలో గేదల్ని పరీక్షించేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకపోవటమే ఆయన ప్రాణాల మీదకి తెచ్చింది. అప్పటికే  BRUCELLA  వైరస్  సోకిన పశువుల్ని చంపేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా మన గ్రామంలో అది అమలు కాలేదు.మనోరంజన్ శాంత స్వభావుడు కావటంతో రైతులకి ఎదురు చెప్పలేక ఆ వైరస్ సోకిన పశువులకి వైద్యం చెయ్యటంతో ఆ వైరస్ ఆయనకి కూడా ప్రభావాన్ని చూపించింది. మన గ్రామంలో ఉండగానే ఆయనకి వివాహం అయ్యింది. పెళ్లి అయిన మూడవ రోజునే తిరిగి డ్యూటీ లో జాయిన్ అవ్వటం వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత కి నిదర్శనం. చనిపోయేనాటికి ఆయనకి రెండు సంవత్సరాల పాప. ఆయన ద్వారా ప్రయోజనాలు పొందిన ఎంతో మంది రైతులు అయన చనిపోయాక హాస్పిటల్లో ఒక ఫోటో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని కానీ ,ఆయన జ్ఞాపకాల్ని కానీ పట్టించుకున్న నాధుడు లేదు. మన గ్రామం కాకపోయినా, గ్రామ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని అధిరోహించిన వ్యక్తి శ్రీ మనోరంజన్. ఇదంతా చెప్తున్నపుడు రాకేష్ కళ్ళు వర్షించటం బాగా గుర్తు. తాను వెటర్నరీ సైన్స్ చదువుకునేటప్పుడు సెలవులకి గ్రామం వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు తన కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయని, అప్రెంటిస్ గా అయన దగ్గర పని చేసిన కొద్ది రోజుల్లోనే వృత్తి ని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నానంటాడు రాకేష్. కానీ ఆ కధ విన్నాక నా కళ్ళు చెమర్చటం కూడా నాకు తెలియలేదు....

Thursday, September 13, 2012

నేనెరిగిన 'మండలి'


రాజకీయ నాయకుల ప్రసంగాలని కేవలం ఎన్నికల ప్రచార సమయంలోనో లేక టి.వి లో స్టేట్మెంట్ల రూపం లోనో తప్ప సాహితీ చర్చల్లో, తెలుగు భాష పరిరక్షణా వేదికలపై వినటం కద్దు. మొట్ట మొదటి సారి ఆ ప్రసంగాన్ని విన్న సందర్భం గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారి జీవిత చరిత్ర నా జీవన నౌక పుస్తక ఆవిష్కరణ సమయంలో శాసన మండలి జూబ్లి హాలులో. మండలి బుద్ధ ప్రసాద్ గారిని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా లేదా ఒక రాజకీయ నాయకుడిగా నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. నాకు, ఈ సైట్ కి సంభంధించినంత వరకు అది అనవసరం, అప్రస్తుతం. మొట్ట మొదటిసారి నేను మండలిని కలిసింది 2004 ఎలక్షన్ల సమయంలో అవనిగడ్డ లోని వారి సొంత ఇంటిలో. ఆ ఎలక్షన్ల నుంచే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రక్రియ ప్రారంభం అయింది. అప్పట్లో నేను పనిచేసే సంస్థ, డమ్మీ ఓటింగ్ యంత్రాలని తయారు చేసి ప్రతి ఓటింగ్ బూత్ దగ్గరా ఆయా అభ్యర్ధులు ఓటింగ్ పై ఓటర్లకి DEMO ఇస్తారనే కాన్సెప్ట్ తో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అభ్యర్డులకి వాటిని విక్రయిస్తూ మన ప్రాంతంలో ఆ భాధ్యత ని నాకు అప్పగించారు. ఆ సందర్భంలోనే వారిని కలిసే అవకాశం కలిగింది. ఆ ఎలక్షన్లో వారు గెలవటం మంత్రిగా పనిచెయ్యటం అందరికి తెలిసిన విషయాలే. ఆ పదవీ కాలంలోనే ఆయన దివిసీమ ఉత్సవాలని ఘనంగా నిర్వహించారని వినటం తప్ప నాకు ఆ కార్యక్రమం గురించి వివరాలు తెలియదు. నేను ప్రత్యక్షంగా ఆయన్ని మళ్లీ కలిసిన సందర్భం 09.08.2010 న  శాసనమండలి జూబ్లి హాలులో ఒక ప్రేక్షకుడి గా.(ఇక్కడ క్లిక్ చెయ్యండి) ఆరోజు ఆయన ప్రసంగం నన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది. చరిత్ర మీద, సాహిత్యం మీద, ఆనాటి వ్యక్తుల పట్ల ఆయనకున్న అపరిమిత అవగాహన ఆయనొక రాజకీయ నాయకుడన్న విషయాన్నే మర్చిపోయేలా చేసింది. అత్యంత వివరణాత్మకంగా, నిండైన సమాచారంతో, సమగ్ర అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న గొప్ప సాహితీ ప్రేమికుడిగా ఆ క్షణం ఆయన నాకు కనిపించారు.
 
మన గ్రామాన్ని బౌద్ధ క్షేత్రంగా ప్రభుత్వం తరపునుంచి గుర్తించబడటానికి ఆయన చేసిన కృషి మనం మరువలేనిది. ఈ సందర్భంలో మన గ్రామం తరపునుంచి కృషి చేసిన వేమూరి విశ్వేశ్వరావు గారిని కూడా గుర్తుచేసుకోవటం మన కర్తవ్యం. మన జిల్లాలో ఉన్న ప్రతి ప్రాంతం మీద బుద్ధ ప్రసాద్ గారికున్నచారిత్రక అవగాహన అమోఘం అనిర్వచనీయం. ఘంటసాల చరిత్ర పుస్తకాన్ని పునర్ముద్రించాక ఆయనకి ఒక కాపీ ఇవ్వాలని అమీర్ పేటలో అయన ఇంటికి వెళ్ళాను. ఆయన రావటం ఆలస్యం అవ్వటంతో కొంత సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఆక్రమంలో నేను ఆ హాలులో ఉన్న ప్రతి వస్తువూ చూసినపుడు ప్రతి ఒక్కటీ ఆయన సాహిత్యాభిలాషని ప్రతిబింబించింది. అది ఒక రాజకీయ నాయకుడి ఇల్లులా అనిపించలేదు. ప్రతి వస్తువు అక్షరాలని పలికించింది. షోకేసుల్లో కొలువుదీరిన మెమెంటోలన్ని సాహితీ సదస్సుల సువాసనల్నే గుభాళిస్తున్నాయి. నేను తిరిగి వచ్చేటపుడు అయన నాకిచ్చిన అపురూపమైన బహుమతి కృష్ణాజిల్లా సర్వసం అనే అపురూప గ్రంధం. తానే సంపాదకుడిగా కొన్ని వేల ఏళ్ల జిల్లా చరిత్ర ని క్రోడీకరించి గ్రంధస్థం చేయించిన అయన కార్య దీక్ష కి ఎన్ని ప్రసంసలు కురిపించినా అవి చంద్రుడికో నూలు పోగు లాంటివే. ప్రస్తుతం తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మండలి ఆ పదవికి నూటికి వెయ్యి శాతం అర్హులని అనటంలో అతిశయోక్తి లేదు..నేనుండేది యూరప్ లో కావటంతో జులై 14 ,15 తేదిల్లో లండన్లో జరిగిన తెలుగు చరిత్ర మహా సభలకి వెళ్ళాలని ఎంతో ఆరాట పడ్డాను. కానీ అప్పటికే సమయం తక్కువగా ఉండటంతో వీసా దొరకటం కష్టం అయ్యింది. నేను వెళ్ళాలని ఆరాట పడటానికి 50 శాతం కారణం ఆ సభలకి మండలి బుద్ధప్రసాద్ గారు అధ్యక్షత వహించటం ఆయితే, మరో యాభయి శాతం బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న మన చారిత్రక సంపదని చూడాలనుకోవటం. కొంతమంది అడుగుతున్నట్లుగా తెలుగు భాషాభివృద్ది కి ప్రత్యేక అభివృద్ధి 'మండళ్ళు' ఏమీ అవసరం లేదు, ఇలాంటి 'మండలి' లు ఉంటే చాలు....

Wednesday, September 12, 2012

మన తొలి ఇంజనీర్


మన గ్రామంలో తొలి ఇంజనీరింగ్ పట్టభద్రుడు శ్రీ ఉప్పల వెంకటేశ్వర్లు గారు. ఆయనతో పాటు చదువుకున్న వారు, అయనని చిన్నతనం నుంచి ఎరిగిన వారు చెప్పిన ఎన్నో విషయాలు నా మదిలో ప్రోది చేసుకుని ఉన్నాయి. నేను హైదరాబాదులో ఓ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నపుడు ఆయన అతిధిగా ఆ కంపెనీ కి వచ్చినపుడు ఆయన్ని కలుసుకునే అవకాశం కలిగింది. ఎవరి అబ్బాయివి అని అడిగి అప్యాయంగా పలకరించిన తీరు ఇప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. వర్లు గారు 16,డిసెంబర్ 1927 న మన గ్రామంలో అత్యంత పేద కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా చల్లపల్లి రాజా గారి బడిలోనే సాగింది. ఆయనతో పాటు చదువుకున్న ఎంతో మంది ఇప్పటికీ అయన వేషధారణని, అతి సామాన్యమైన ఆ మూర్తీభవిత్వాన్ని మరిచిపోలేదు. జీవితం లో ఎన్ని ఎత్తులకి ఎదిగినా ఆయన వేషధారణలో మాత్రం అత్యంత సామాన్యం గా ఉండేవారు. ఆయన వివాహానికి సంభందించిన విశేషాన్ని గ్రామస్తులు ఇప్పటికీ చెప్పుకుంటారు. మన గ్రామంలోనే ఉన్నత రైతు కుటుంబంలో జన్మించిన సక్కుబాయి గారిని వివాహం చేసుకున్నారు. సక్కుబాయమ్మ గారి తండ్రి తుమ్మల కొండ తాత పెద్ద రైతు. ఏమీ లేని వాడికి పిల్లనివ్వటం ఏమిటని గ్రామస్తులంతా ఆయన్ని వారించారు. కానీ ఆయన ఎవరి మాట వినలేదు. ఆర్ధికంగా రెండు కుటుంబాలకి ఎంతో అంతరం ఉన్నా, వర్లు విద్యాధికుడు, ఆ విద్య ముందు ఎన్ని ఎకరాలున్నా అవి దిగదుడుపే అని చెప్పి తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. ఆయన నమ్మకం వృధా పోలేదు.మన గ్రామం లో తొలిసారిగా జనరేటర్ తో లైటింగ్ ఏర్పాటు చేసి జరిగిన వివాహం వర్లు గారిదే.


  
ఇక విద్యార్ధిగా Madras Institute of Technology లో DMIT (ప్రస్తుతం ఇది B.tech) కోర్సు పూర్తి చేశారు. బొంబాయి లో అణు పరిశోధక శాఖ లో ఇంజినీర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ప్రభుత్వ రంగ సంస్థ  E.C.I.L ని స్థాపించటం లో కీలక పాత్రని పోషించారు. మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో I.T.I చదువుకున్న వాళ్ళ దగ్గర్నుంచి ఇంజినీర్ల వరకు ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొన్ని వేల మందికి ఉపాధి కలిగే మార్గాలు నిర్మించి వారి భవితకి సులువైన ప్రయాణాన్ని అందించారు. హైదరాబాదు E.C.I.L ప్రాంతంలో మన చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు ఎక్కువమంది స్థిరపడటానికి  కారణం కూడా వర్లు గారే.05.09.1957 న ప్రభుత్వం ఆయనని పరిశోధనల నిమిత్తం అమెరికా,ఇంగ్లాండ్, ఫ్రాన్సు దేశాలకు పంపింది.1963 లో ఇటలీ లో జరిగిన అణు శాస్త్ర పరిశోధకుల సమావేశం లో భారత దేశం తరపున పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ రంగం లో అయన అందించిన విశిష్ట సేవలకు గాను ఎన్నో అవార్డులు ఆయన ఇంట్లో కొలువుదీరాయి.1986 లో నాయుడమ్మ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి వర్లు గారే. పదవీ కాలం లోనూ మరియు పదవీ విరమణ తర్వాత పన్నెండు కంపెనీలకు డైరెక్టర్ గా తన సేవలను అందించారు. గ్రామీణ విద్యార్ధులకు సాంకేతిక విద్య అందుబాటు లో ఉండాలనే ఉద్దేశం తో వర్లు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించి మన గ్రామం లో ఐ టి ఐ ని స్థాపించారు. 2 అక్టోబర్ 2004 న ఆయన అస్తమించినపుడు ఆయన నివాసం, బంధువులతో కంటే ఆయన్ని ఆత్మ బంధువుగా భావించిన వేలాది మంది కన్నీటితోనే తడిచి పోయింది. ఆ దృశ్యానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. హైదరాబాద్ లో ECIL సమీపంలోని అణుపురంలో తాను ముచ్చట పడి కట్టుకున్న ఇంట్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. మంచం మీద ఉన్న స్థితి లో కూడా ఉద్యోగనిమిత్తం తన సిఫార్సులకోసం వచ్చిన వారికి తగిన మాట సాయం చేసి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఆయన నిరాడంబర జీవితం ఈ తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

Tuesday, September 11, 2012

నందన కరువుకి 180 ఏళ్ళు



ప్రతి సంవత్సరం ఉగాది రాగానే వేపచెట్ల వెంట వేపపువ్వు కోసం పరిగెత్తే వాళ్ళం.ఆ పచ్చడి తిన్నాక కానీ ఇంకేది తినకూడదు అని,అది అయ్యేదాకా ఏమి తినకుండా ఉండేవాళ్ళం.స్కూల్లో తెలుగు మాస్టారు తెలుగు నెలల గురించి తెలుగు సంవత్సరాల గురించి వల్లె వేయిస్తుంటే,ఒకరి కంటే ఒకరు పెద్ద గొంతుతో అరిచేవాళ్ళమే కానీ వాటి అర్ధం, పరమార్ధం, బోధపడే వయసు అది కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు.అసలు తెలుగే కనుమరుగైంది ఏ మధ్య స్కూల్స్ లో.ఇక తెలుగు సంవత్సరాల గురించి పిల్లలకేం తెలుస్తుంది.శాటిలైట్ చానెల్స్ వచ్చాక ఉగాది రోజున ఏ చానెల్ పెట్టినా పంచాంగ శ్రవణం వినిపించేది.అసలు ఎందుకు ఈ సంవత్సరాలకి ఇలాంటి పేర్లు ఉంటాయ అని ఆలోచన అప్పుడు మొదలైంది. చిన్నప్పుడు మాస్టారు చెప్పిన సంవత్సరాల పేర్లు జ్ఞాపకాల పొరల్లోనుంచి చీల్చుకుని బయటకి రావటం మొదలయ్యాయి.తెలుగు సంవత్సరాలు 60 , తెలుగు నెలలు పన్నెండు ఉంటాయి అని ఇప్పటి తరం లో  చాలామందికి తెలీదు.పాతికేళ్ళు వచ్చేదాకా నాకూడా తెలియదు అనుకోండి.ఈ మధ్య అమెరికా లో వచ్చే తుఫాన్లకి హరికేన్ అని కత్రినా అని రకరకాల పేర్లు పెట్టటం చూసి మన వాళ్ళు కూడా అదే సంప్రదాయాన్ని మొదలు పెట్టారు.కానీ ఆ పేర్లు ఎవరు పెడుతున్నారో దానికి ప్రామాణికత ఏమిటో నాకు అర్ధం కాలేదు.అమెరికా ని చూసి మన వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని దిగుమతి చేసుకున్నారంటే మనం పప్పులో కాలేసినట్లే.కొన్ని వందల ఏళ్ల క్రితమే తెలుగు వారు ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.అది కూడా సరైన ప్రామాణికత తో.ఇది నందన నామ సంవత్సరం అని తెలియగానే ఏదో గుర్తు వచ్చినట్లు అయ్యి పాత పుస్తకాల్ని ఒకసారి తిరగేశాను.నందన కరువు అని ఎక్కడో చదివినట్లు గుర్తు.ఏదైనా  సంవత్సరం కరువు కాటకాలు వస్తే వాటిని ఆ సంవత్సరపు పేర్లతో పిలవటం అనే సాంప్రదాయం కొన్ని వందల ఏళ్ల కిందటే మన వాళ్ళు మొదలు పెట్టారు.
1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు భీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు . అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు.
తెలుగు సంవత్సరాలు ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి మళ్లీ చక్ర భ్రమణం పొందుతాయి.ఆ ప్రకారం చూసుకుంటే నందన కరువు కి ఈ ఉగాదితో 180 ఏళ్ళు నిండుతాయి.ఆ తరువాత 1878 లో ధాతనామ సంవత్సరం లో వచ్చిన కరువు ని దాత కరువు అని,1722 లో వచ్చిన వరదలకి చిత్రభాను సంవత్సరపు వరదలు అని నామకరణం చేశారు.
తెలుగు సంవత్సరాలు 
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాధి
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్థివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోథి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృత్తు
37. శోభకృత్తు
38. క్రోథి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృత్తు
46. పరీధావి
47. ప్రమాదిచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాళయుక్తి
53. సిద్ధార్థి
54. రౌద్రి
55. దుర్ముఖి
56. దుందుభి,
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
 
Dated : 23.03.2012

Sunday, September 9, 2012

చల్లపల్లి ఎస్టేట్ రైతాంగ పోరాటం

కమ్మ,రెడ్డి కలిస్తే కామ్రేడ్ అని ఒక కమ్మాయన చెప్పినప్పుడు, నిజమే కదా అనుకున్నా. బడుగు వర్గాల కోసం పాటుబడే కమ్యునిష్టు నాయకులు రెండు అగ్రకులాలకి చెందిన వారే అవ్వటం మన రాష్ట్రం లో ఉన్న పెద్ద వింత. వారసత్వ రాజకీయాలు లేని, వారసులు ఏ మాత్రం రాజకీయాల్లోకి రావటానికి ఆసక్తి కనబరచని ఏకైన పార్టీ ఉందంటే అది  కమ్యునిష్టు పార్టీలే. ఒకప్పుడు మన ఊరు నిడుమోలు నియోజక వర్గం లో ఉండేదనే విషయం చాలా మందికి తెలిసిందే. చిన్నప్పుడు జరిగిన రెండు మూడు ఎలక్షన్లు నాకు బాగా గుర్తు. ఎప్పుడు చూసినా మన నియోజకవర్గానికి పాటూరి రామయ్య కమ్యునిష్టు పార్టీ తరపున పోటీ చేసేవారు. అది సి.పి.ఐ లేక సి.పి.ఎమ్ పార్టీ నో గుర్తు లేదు. కత్తి, సుత్తి, కొడవలికే మీ ఓటు అంటూ ప్రచారం జరుగుతూ ఉండేది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినపుడు గుడి ముందు ఉన్న కమ్యునిష్టు దిమ్మ దగ్గర కూర్చునేవాళ్ళం.

మన గ్రామం లో ఒకప్పుడు కరడు గట్టిన కమ్యునిష్టులుగా ఉన్నఅగ్రకులాల వారంతా ఎన్.టి.ఆర్ పార్టీ పెట్టగానే తెలుగు దేశం లో చేరిపోయారు. మిగతా సామాజిక వర్గాల వారు మాత్రం కమ్యునిష్టులు గానే చెలామణి అవుతూ ఉండేవారు. సోవియట్ భూమి అని రష్యా లో రెపరెపలాడుతున్న ఎర్ర సామ్రాజ్యపు విశేషాలతో 1989 వరకు దళసరి కాగితంతో, రంగుల్లో వచ్చే కమ్యునిష్టు పత్రిక పిల్లల నోటు పుస్తకాలకి అట్టలు వేసుకునే కాగితంగా మారిపోయింది. నేను కూడా ఆ పత్రిక ని అట్టలు వేసుకోవటానికి ఉపయోగించిన గురుతులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1999 వరకు ఎప్పుడూ కమ్యునిష్టుల తో పొత్తు పెట్టుకోవటంతో మన నియోజక వర్గంలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశం రాలేదు. అదీ కాక రిజర్వుడు కావటంతో అగ్రకులాధిపత్యం ఉన్న ప్రాంతం అయినా ఆ కులాల వారికి పోటీ చేసే అవకాశం లేకపోయింది. అందుకే పసుపు రంగు లోకి మారిన కమ్యునిష్టులంతా ఎరుపు రంగు పార్టీ సానుభూతి పరులుగానే ఉండేవారు. నాకు ఊహ తెలిసే నాటికే కమ్యునిజం దాదాపు కనుమరుగవుతున్న దశ లో ఉంది. కానీ అనుకోకుండానే ఆ చరిత్ర కి సంభందించిన పుస్తకాలు ఎక్కువ చదివే అవకాశం కలిగింది. అలా అని విధానాల పట్ల ఆసక్తి మాత్రం కాదు. ఆ సాహిత్యం,చరిత్ర ఆసక్తి కరంగా ఉండటంతో కనపడ్డ ప్రతి పుస్తకం చదివేవాడిని. మలి తెలంగాణా ఉద్యమ ప్రారంభం,నేను హైదరాబాదుకి మకాం మారటం ఒక్కసారే జరిగాయి. తెలంగాణా సాయుధ పోరాటం,స్వతంత్రం వచ్చాక ఆ ప్రాంతం లో జరిగిన పోలీసు చర్య,నిజాం కి వ్యతిరేకం గా కామ్రేడ్లు సాగించిన అలుపెరగని పోరాటం, విప్లవ రచయితలు కాళోజీ నారాయణ రావు, రావి నారాయణ్ రెడ్డి ల గురించి తెలుసుకున్నచిన్న చిన్న సంగతులు ఆసక్తి కరంగా ఉండటంతో వాటికి సంభందించిన పుస్తకాల కోసం అబిడ్స్ లో ఉన్న విశాలాంధ్ర బుక్ హౌస్ కి వెళ్లి మరీ ఆ పుస్తకాలు కొనుక్కుని చదివే వాడిని. ఆ క్రమంలోనే  తెలంగాణా రాలిన రత్నాలు వంటి పలు రచనలు చదివే అవకాశం కలిగింది. కేవలం నల్లగొండ,వరంగల్ జిల్లాలోనే అత్యంత ప్రాబల్యం ఉన్న పార్టీ గా తెలిసిన నాకు మన ప్రాంతంలో ఉన్న కమ్యునిష్టుల చరిత్ర గురించి తెలిసింది చాలా తక్కువ. వృత్తి రిత్యా ముద్రణ రంగంలో పని చేస్తుండటంతో ఒక రోజు మిత్రుడిని కలవటానికి ఓ ప్రెస్ కి వెళ్ళినపుడు వారొక పుస్తకం అచ్చు వేస్తున్నారు. దాని పేరు చల్లపల్లి ఎస్టేట్ రైతాంగ పోరాటం. ఇదెప్పుడు జరిగింది అసలు, ఎవరు రాసారు ఇది అని ఆశ్చర్యంగా అడగటంతో ఆఫీసు లో కూర్చున్న ఒక ఎనభై పైబడిన పెద్దాయన్ని చూపించారు. ఆయనే కావూరి కుటుంబరావు గారు. హైదరాబాదులో మాదాపూర్ వెళ్ళేటప్పుడు వాటర్ ట్యాంక్ పైన కనిపించే కావూరి హిల్స్ అనే పదాల్లో మొదటి మూడక్షరాలు ఆయన మీద గౌరవంతో పెట్టుకున్నవే అని చాలామందికి తెలియకపోవచ్చు.ఆ పుస్తకాన్ని ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు.ఈ వెబ్ సైట్ లో e-books విభాగం లో మొట్ట మొదట పెట్టిన పుస్తకం కూడా అదే.
చల్లపల్లి లో ఉన్న కోట ని చాలా సార్లు చూసినా,ఆ కోట మాటున దాగిన ఈ చారిత్రక ఉద్యమం గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిది కరెక్ట్ అనేది బేరీజు వేయకుండా ఆనాటి చారిత్రక నేపధ్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత తోనే ఈ పుస్తకాన్ని చదవటం మొదపెడితే ఆ ప్రాంతంతో అనుభంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం తప్పక నచ్చి తీరుతుంది. చరిత్ర యావత్తు పోరాటం కాకపోవచ్చు. కానీ పోరాటం మాత్రం చరిత్రే అంటూ రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలు నిజంగా అలరిస్తాయి.

పరిమళించని పాట



వేటూరి పాటంటే నాకు చాలా ఇష్టం, మబ్బుల్లో నీళ్ళకోసం ఉన్న ముంతలో నీళ్ళు వంపేస్తారు అని మధ్య తరగతి మనస్తత్వాలని గేలి చేస్తూ నిరాశ వాదం వైపు నడిపిస్తున్న సాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లోనే, నింగి నైనా కిందకి దించగల సత్తా ఉన్నపుడు, మన చేతిలో ఉన్ననీళ్ళు వంపేసినా తప్పులేదు ....అనే ప్రతివాదం తో ఆశావాదాన్ని, స్ఫూర్తిని రగిలించిన సాహితీ మూర్తి వేటూరి. అయన సాహిత్యంలో ఆ  మాట నా జీవితానికి టాగ్ లైన్. ఆ ఒక్క మాటని అనుసరించటమే నా జీవితంలో ప్రతి మెట్టుకి సోపానంగా నిలిచింది. అది అనుసరిస్తున్నపుడు, నేను దుబారా గా ఖర్చుపెడతానని, రేపటి గురించి దాచుకోనని కుటుంబ సభ్యులు,బంధువులు నా మీద స్టాంప్ వేసేసినా, నేను నమ్మిన వేటూరి తత్వాన్ని వదులుకోలేదు. చివరికి నా ఆలోచనే కరెక్ట్ అని నన్ను అన్నవాళ్ళకి అర్ధం అయ్యింది.
తలంబ్రాలతో దోసిళ్ళు, తనువందాల దోపిళ్ళు. కందిన అందపు తావిళ్ళు, కన్నె బుగ్గలో క్రావిళ్ళు.
దోసిళ్ళు ఎత్తిన చేతుల చాటున దోచక తప్పని దోరసొగసులు. దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేతసిగ్గులు.... పెళ్ళంటే ఆసక్తి లేని నమ్మకం లేని బ్రహ్మచారులేవరైనా ఈ పాట వింటే పెళ్లి చేసుకోవాలి ఆ ముచ్చట ఎలా ఉంటుందో చూడాలి అని మాత్రం ఖచ్చితం గా అనుకుంటారు. నేను సినిమా రంగం లో పని చేసేటప్పుడు ఒక్క సారి చూడాలనుకున్న మొట్ట మొదటి వ్యక్తి శ్రీ వేటూరి సుందరరామమూర్తి. ఒక రోజు అన్నపూర్ణా స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చేతి కర్ర తో నడుస్తూ వస్తున్న ఆయన్ని ఒక్కసారిగా చూడగానే నేను పరుగున వెళ్లి చెప్పిన మాట నా పేరు వేటూరి అండీ నేను మీ అభిమానిని అని. ఆయన నవ్వారు. మళ్లీ నాలుక కరచుకుని, సారీ అండీ మిమ్మల్ని చూసిన ఆనందం లో ఏం మాట్లాడాలో తెలియట్లేదు నా పేరు రాజేష్ నేను మీ అభిమానిని అని చెప్పాను. అంతకుమించి ఒక్క మాట కూడా నాకు గొంతు పెగల్లేదు కొన్ని వందల సార్లు విన్న ఆయన పాటలేవీ ఆ క్షణం లో గుర్తు రాలేదు. ఏదో ఉద్విగ్నత,తెలీని ఉత్సుకత. ఈలోపు కార్ రావటం తో ఎక్కి వెళ్ళిపోయారు. కనీసం ఫోటో దిగాలన్న విషయం కూడా నాకు తట్టలేదు. ఎన్నో సాయంత్రాలని డబ్బులు లేకపోయినా రిచ్ గానూ, గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా రొమాంటిక్ గా ఫీల్ అయ్యేట్లు చేసింది వేటూరి పాట. వాక్ మెన్ కాలం నుంచి నేటి ఐపాడ్ దాకా సాంకేతికత మారింది కానీ అందులో వినిపించే పాటల చాయిస్ మాత్రం ఒకటే. ఆ అంటే అమలాపురం అని కుర్రాళ్ళని తమకి  తెలియకుండానే స్టెప్పులు వేయించింది, అందం గా లేనా అసలేం బాలేనా అంటూ కన్నెపిల్ల భావాల్ని పలికించింది 70 ఏళ్ల వృద్ధ కలం అంటే మిగతా భాషల వాళ్ళెవరు నమ్మరు.అంత్య ప్రాస అనేది తెలుగు భాష కి మాత్రమే ఉన్న అరుదైన సాహితీ ప్రక్రియ. వేటూరి పాట విన్నాకే అంత్య ప్రాస అనేది ఒకటి ఉంటుందని తెలిసింది. తకిట తథిమి తకిట తథిమి తందాన” పాటలో ”నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన ఇక్కడ న అనేది అంత్య ప్రాస. హైస్కూల్ లో చదువుకునేటప్పుడు తెలుగు పాఠాలు నేర్పిన పదాల కంటే వేటూరి పదాల్లోనే ఎక్కువ వ్యాకరణాన్ని శబ్ద ప్రయోగాన్ని గ్రహించానేమో.
వేటూరికి మన గ్రామానికి ఉన్న సంభంధం అనుభంధం చాలామందికి తెలీదు. మన గ్రామానికి దగ్గరలోనే ఉన్న పెదకళ్ళేపల్లి లో 1936 జనవరి 6 న జన్మించిన వేటూరి,కొత్త నుడికారంతో సరికొత్త పద ప్రయోగాలతో సినీ పాటల పూదోట కి వనమాలి అయ్యారు. వారి బాబాయి సుప్రసిద్ధ పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఘంటసాల చరిత్ర రచన లో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారికి తోడ్పడిన వ్యక్తి. ఈ విషయం స్వయం గా వెంకట సుబ్బయ్య గారే రాసారు. పెదకళ్ళేపల్లి ,మొవ్వ,ఘంటసాల పరిసర గ్రామాలంటే వేటూరికి అమితమైన అభిమానం. ఇక శ్రీకాకుళం గురించి అయితే ఆయన రాసిన సిరికాకొలను చిన్నది అనే రేడియో సంగీత నాటిక ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపింది. శ్రీకాకుళే మహా క్షేత్రే అని మూడు తరాలు జరిగిన అజ్జ్ఞాత కధ ని రాయటం ద్వారా ఆయనకి ఆ గ్రామం మీద ఉన్న అవగాహన ని తెలియచేస్తుంది. ఆ కధ లో సాని వాడలో మిగిలిపోయిన సామెతని కొంచెం వెటకారంగానే అయన వర్ణించిన తీరు అద్భుతం.
శ్రీకాకుళే మహాక్షేత్రే ,
గుండెరే మహానది ,
ఈతముల్లే ప్రాణ హాని,
అంకినీడే అధోగతి. 
శంకరా నాద శరీరాపరా అంటూ శంకరుడిని కీర్తించిన ఆ కలం తోనే మన జలధీశ్వర స్వామి పై  పాట రాయించే ప్రయత్నమూ జరిగింది. దీనికోసం ప్రయత్నించిన వ్యక్తి వేమూరి విశ్వేశ్వర రావు గారు. ఆయన పరమ పదించటానికి కొద్ది రోజులముందే ఆయన్ని కలిసే ప్రయత్నమూ జరిగింది. ప్రయత్న లోపం లేకపోయినా అది కార్య రూపం దాల్చలేదు. సమయా భావం వల్ల ఇక లోకం లో నేను ఉండలేను అని వేటూరి నిష్క్రమించారు. ఒక వేళ ఆయన పాట రాసి ఉంటే జలధీశ్వరస్వామి కి ఉన్న నగలలో అత్యంత విలువైన హారం గా ఆ పాట ఒదిగిపోయేది.

Saturday, September 8, 2012

రుద్ర భూమి అభివృద్ధి


అభివృద్ధి కాముకులైన ఘంటసాల గ్రామ ప్రజలకు,జన్మ భూమి అభివృద్ధి ని కాంక్షించే ప్రవాస గ్రామస్తులకి వినయ పూర్వక విజ్ఞప్తి.
 
" జాతస్య హి  ధ్రువో మృత్యుహు " జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు.జననము లాగే మరణాన్ని కూడా ఒక పవిత్ర కార్యక్రమము గా భావించి కార్యము నిర్వహించే ఏకైక జాతి మానవ జాతి.అందుకే మనిషి చేసే సంస్కారములలో "అంత్యేష్టి " కూడా చేర్చారు.ఈ అంతిమ సంస్కారానికి మాత్రం వేదిక స్మశానం మాత్రమే.ఈ పవిత్ర ప్రదేశం లోనే పంచ భౌతికమైన మనిషి శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది.

మనిషి జీవితం లో ఆఖరి మజిలీ స్మశానం.అప్పటిదాకా సర్వ సౌఖ్యాలతో బతికిన మనిషి చివరి మజిలీ మాత్రం మురికి గుంటలతో, దుర్ఘంధంతో, పాముల పుట్టలతో, ముళ్ళ తుప్పలతో నిండిన స్మశానం లో చేయాల్సి వస్తోంది. అతి పవిత్రంగా,శుచిగా,శుభ్రత తో ఉండాల్సిన దహన వాటిక నేడు తన రూపునే కోల్పోయి కనీసం కాలు కూడా పెట్టలేని దుస్థితికి చేరుకుంది. వర్షం వస్తే దహన కాండలు జరపలేని పరిస్థితి.మొత్తం 8.32 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న మన ఊరి స్మశానాన్ని పవిత్ర రుద్రభూమి గా మార్చేయటానికి మన గ్రామానికే చెందిన శ్రీ  వీరపనేని సుబ్రహ్మణ్యం, శ్రీ వీరపనేని ఆనంద్ సోదరులు తమ మాతా మహులు శ్రీ గొర్రెపాటి సుబ్రహ్మణ్యం,లక్ష్మీ కాంతమ్మ మరియు శ్రీ గొర్రెపాటి వెంకట రామయ్య,విశాలక్ష్మమ్మ గార్ల జ్ఞాపకార్ధం వారి తల్లి గారైన సరోజినీ గారి ఆధ్వర్యం లో మొత్తం వ్యయం లో 50 % సమకూర్చటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అంటే విరాళంగా వచ్చే ప్రతి రూపాయికి మరొక రూపాయి వారు జత చేస్తూ నిర్మాణాన్ని కొనసాగిస్తారు.
 

 

దాదాపు 50 లక్షల అంచనా వ్యయం తో ప్రారంభం కానున్న ఈ బృహత్కార్యానికి మీ అందరి సహకారం ఉంటే, గ్రామం లో సకల సౌకర్యాలతో కూడిన రుద్రభూమి నిర్మాణం సులువుగా పూర్తి అవుతుంది. ప్రస్దిద్ధ శైవ క్షేత్రమైన మన గ్రామానికి శివుడికి ఇష్టమైన స్మశానం ముఖ ద్వారంగా ఉండటం దైవికమే. కానీ ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది గ్రామానికి మహా ముఖద్వారంగా మలచాల్సిన భాధ్యత మనందరిది.

1) మహా ముఖ ద్వారాన్ని నిర్మించటం
2) అధునాతన కాస్టింగ్ విధానం లో దహన వాటిక
3) దహన మందిరం
4) విశ్రాంతి గదులు 
5) అంతర్గత రహదారులు 
6) స్నానపు గదులు 
7) ఉద్యాన వనాల ఏర్పాటు.
8) అస్థికల ముంతలని భద్రపరిచే గదులు
9) శీతల శవ పేటిక సౌకర్యం
10) శవ వాహనాన్ని ఏర్పాటు చెయ్యటం.
11) కార్యాలయం మరియు కాటికాపరి నివాస భవనం.

మీ విరాళాలని చెక్కు రూపం లో కానీ డిడి రూపం లో కానీ కమిటీ కి అందచేయగలరు.

ఇట్లు 
రుద్ర భూమి (స్మశాన వాటిక) అభివృద్ధి కమిటీ 
వీరపనేని సుబ్రహ్మణ్యం - మొబైల్ : 9849011189
గొర్రెపాటి వెంకట రామకృష్ణ - మొబైల్ : 9985463899



 గౌరవ సలహాదారు మరియు సమన్వయ కర్త
శ్రీ మూల్పూరి చెన్నారావు గారు (విశ్రాంత ఉపాధ్యాయులు)
 

Friday, September 7, 2012

సుమనోహరుడివని, సుమనస్కుడివని..

ఎందుకో పొద్దుట్నుంచీ తెలియని బాధ గా ఉంది. నేను ఈ టీవీ సుమన్ కి ఫాన్ ని మాత్రం కాదు. ఒకరకంగా నాకు ఆయన సీరియల్స్ నాకు నచ్చవు కూడా.ఆయన రాసిన శ్రీహరి స్వరాలు మాత్రం చాలా ఇష్టం. కానీ ఎందుకో ఆయన మరణం,ఆ అంత్యక్రియల్లో రామోజీ ని చూసాక గుండె బరువెక్కింది. వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థ ని మార్చగలడు లేదా తానే ఒక వ్యవస్థగా మారగలడు అని నిరూపించి రాష్ట్రానికి లక్ష్మీ పుత్రుడుగా భావించే రామోజీరావు ని ఆ స్థితిలో చూడటం మాత్రం చాలా బాధ గా ఉంది.







సుమనోహరుడివని, సుమనస్కుడివని ఎరిగి నీ కమ్మని కౌగిట కరిగి కళ కళ లాడాలని సుమబాలలెన్నో నీ ముంగిట నిలిచేరా సుందర సుకుమార స్వామీ...అందాల నిలువలు, వెన్నెల వలువలు, కల్మషమెరుగని తెల్లని విలువలు, వెన్న లాంటి మనసులున్న ఈ కన్నె కలువలు, ఆశల అంబరాలై నిన్ను చేరాలని, సంబరాన ఆకాశమే తాకాలని నిలువెల్లా కళ్ళు చేసుకుని నీ రూపు పై చూపు నిలుపుకుని, నీ మానస సరోవరాన విహరించే వరానికై విరహంతో వేచెనురా. ధవళ నగల ధారివై ధగ ధగల తేలి నగవులు చిందించరా నగముల రేడా.. ..మా మంచి వాడా... 

ఆయన రాసిన శ్రీహరి స్వరాలలో సాహిత్యం

"భూ" కైలాస్



మీ అంచనా ప్రకారం మన ఊరిలో గజం స్థలం ఎంత ఉంటుందనుకుంటున్నారు? మీ మనసులో అంకె వందల్లో ఉంటే మీరు తప్పులో కాలేసినట్లే..ఇక మీకు ఊర్లో ఇంటి స్థలం వందల్లో దొరకదు.ఈ మధ్య మన గ్రామం లో ఇళ్ళ స్థలాలకి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది.ఒకప్పుడు గజం మూడు వందలకి మించని స్థలాలు ఇప్పుడు వెయ్యి పెడితే కానీ దొరకటం లేదు.అత్యంత ఖరీదైన ప్రాంతంగా పడమట బజారు మొదటి స్థానం లో నిలిస్తే,ఒకప్పుడు వైభవం గా వెలిగిన తూర్పు వీధి ఆఖరు స్థానం లో ఉంది. రోడ్డుకి దగ్గరగా ఇల్లు ఉండాలనే కోరిక ప్రజల్లో బలీయంగా ఉండటంతో సెంటర్ కి దగ్గరగా ఉండే స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఇక మ్యూజియం చుట్టుపక్కల రెండు వందల మీటర్ల లోపు పురావస్తు శాఖ అనుమతి లేకుండా నిర్మాణాలు చేయకూడదు అనే నిభందన ఉండటంతో స్థలాలకి డిమాండ్ ఉన్నా పర్మిషన్ తెచ్చుకోగలిగిన వాళ్ళు మాత్రమే ధైర్యంగా కొంటున్నారు.ఇప్పటిదాకా మన ఊర్లో పలికిన అత్యంత ఖరీదైన ప్రదేశం ధర, గజం 2000 రూపాయలు.ఇది హైదరాబాదు ,విజయవాడ నగరాల శివారు ప్రాంతాల ధరతో సమానం. అత్యంత కనిష్ట ధర, గజం 400 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న 170 గజాల స్థలాన్ని తుమ్మల వెంకటేశ్వరరావు గజం వెయ్యి చొప్పున కొనుగోలు చేసి సంచలనం సృష్టించటంతో ప్రారంభమైన ఈ భూ కైలాస్, భూముల ధరలు కైలాసం కి చేరుకున్నాయని చెప్పకనే చెప్పింది.
గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ధరలు చదరపు గజానికి ఈ విధంగా ఉన్నాయి.
 
పడమట వీధి  - 1000 to 2000
తూర్పు వీధి    - 400 t0 550
మ్యూజియం పరిసర ప్రాంతాలు - 600 to 1000
సత్రం సెంటర్ - 1500 to 2000
రామయ్య కొట్టు సెంటర్ - 1500 t0 1800
రామా నగరం రోడ్ - 600 to 1000
(పైన ఇవ్వబడిన ధరలు కేవలం అంచనా మరియు ఇంతకుముందు ముందు జరిగిన లావాదేవిల ననుసరించి ప్రకటించటం జరిగింది. వీటిల్లో కొన్ని ఆ స్థలంలో ఉన్న పాత ఇంటితో సహా కూడా లభిస్తాయి.)
 
స్వాతి బలరాం కొనుగోలు చేసిన స్థలం 
వడ్లమూడి వారి రామాలయం పక్కనున్న బసవకోటిలింగం గారి 500 గజాల స్థలం అత్యధిక ధర రెండు వేల రూపాయలు గజం చొప్పున చెల్లించి స్వాతి పత్రిక బలరాం కొనుగోలు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు కోటి రూపాయల వ్యయం తో నిర్మించనున్నఆయన కలల సౌధం మన ఊరికే తలమానికం కానుంది. సినిమా హాలు ఎప్పట్నుంచో రంగనాధ బాబు గారు కొంటారనే వార్తలు నిజం అయ్యాయి. 2500 చదరపు గజాల ఆ స్థలంలో ఆయన కూడా ఇంటి నిర్మాణాన్ని చేపట్టనున్నారనేది వినవచ్చిన వార్త. ఇప్పటికే సినిమా హాల్ బిల్డింగ్ ని కూల్చి వేసి స్థలం చదును చేయటం మొదలు పెట్టారు.ఇప్పటికే పూర్తైన అయినపూడి విజయకుమార్ గారి ఇల్లు,గ్రామం లో కెల్లా అత్యంత ఖరీదైన భవనం.నిర్మాణం లో ఉన్న వేమూరి చెన్నారావు గారి ఇల్లు ఇంకా నిర్మాణం మొదలు కానీ "స్వాతి" బలరాం గారి ఇల్లు,ఖరీదైన ఇళ్ళ జాబితా లో స్థానం పొందేందుకు  పోటీ పడుతున్నాయి.
 
ఊరికి దూరంగా సెటిల్ అయిన వాళ్ళకి సొంత ఊర్లో ఇల్లు కట్టాలనే బలీయమైన కోరిక ప్రబలటంతో ఒక్కసారిగా ఈ డిమాండ్ ఏర్పడిందని విశ్లేషకుల అంచనా. ఒకరకంగా తెలంగాణా అంశం కూడా దీనికి దోహదం చేసినట్లే. ఎప్పటికైనా మన ఊరు మనదే అనే భావన ఈ తరం యువకుల్లో బాగా పెరిగింది, రిటైర్మెంట్ వరకు ఉద్యోగరీత్యా పలు ఊర్లలో పని చేసిన ఉద్యోగస్తులు అంతా విరమణ అనంతరం ఊర్లోనే ప్రశాంతంగా జీవనం గడపాలని ఉద్దేశ్యం తో సకల సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకుంటున్నారు. సొంత ఊరికి వచ్చినప్పుడు కూడా సిటిలో లానే సౌకర్యంగా నివసించటానికి అవసరమైన అన్నీ హంగులతో బిల్డింగులు వెలుస్తున్నాయి.ఊర్లో ఉండే తమ తల్లిదండ్రులకి ఇల్లు సౌకర్యంగా ఉండాలి, అలాగే తాము వచ్చినప్పుడు పిల్లలతో సౌకర్యంగా ఉండేలా ఇల్లు కట్టించుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు మేడల్లో కానీ కన్పించని AC ఇప్పుడు చిన్న డాబాల్లో కూడా కనిపిస్తుంది.
 కనుమరుగవనున్న మండువా లోగిలి
 ఇంకొన్నాళ్ళకి పూరిల్లు అసలు మన ఊర్లో కన్పించకపోవచ్చు. తాటాకు కొట్టించి వాటిని ఇంటికి చేర్చి కూలి ఇచ్చి పైకప్పు కుట్టించే సరికి ఖర్చు తడిసి మోపెడవటంతో దానికి బదులు సిమెంట్ రేకులు ఒక్కసారి వేస్తే సరిపోతుంది. మండువా ఇళ్ళు ఇప్పుడు వేళ్ళ మీద లేక్కపెట్టచ్చు.వాటన్నిటి స్థానంలో ఎవరి స్థాయికి తగ్గట్లు వారు డాబాలు నిర్మించుకుంటున్నారు.మన ఊరు మ్యూజియంలో పూరిల్లు, మండువా ఇల్లు, బంగాళా పెంకుటిల్లు, నమూనాలని తయారు చేసి పెడితే బావుంటుందేమో అని నా ఆలోచన.ఎప్పుడైనా మన ఊరు వచ్చిన వాళ్ళకి ఒకప్పుడు ఊర్లో ఇలాంటి ఇళ్ళు ఉండేవి అని ముందు తరాలకి చెప్పవచ్చు...

Thursday, September 6, 2012

పట్టాభి చెడుగుడు

చల్లపల్లి జమిందారు నే చెడుగుడు లో ఓడించిన మన ఊరు యోధుడు వేమూరి పట్టాభి రాముడి కధ. చెడుగుడు తెలుగు వారి జాతీయ క్రీడ. 



Tuesday, September 4, 2012

మాది కొడాలి



అవి నేను మొవ్వ గ్రామంలో ఇంటర్ చదువుతున్న రోజులు. మన గ్రామం నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్ధులు అక్కడ చదువుకోవటానికి వచ్చేవారు. అప్పటిదాకా సొంత గ్రామం లోని స్నేహితులతో చదువుకున్న మాలాంటి వాళ్లకి వేరే గ్రామాల విధ్యార్ధులతో కలిసి చదువుకోవటం అదే మొదటి సారి. స్కూల్ దశ నుంచి కాలేజి జీవితం లోకి వేసిన తొలి అడుగు ఇంటర్ కాలేజికే. ఒక రోజు మాథ్స్ క్లాస్ జరుగుతుంటే వెనక ఏదో చిన్నగా ఇద్దరు విద్యార్ధుల మధ్య గొడవ అయింది. లెక్చరర్ కోపంగా ఆ ఇద్దరు  విద్యార్ధులని లేపి, ఏమిటిరా గొడవ అనగానే అందులో ఒకడు, వీడు నన్ను బెదిరిస్తున్నాడు సార్ " మాది కొడాలి, ఎక్కువ మాట్లాడావంటే మెడకాయ మీద తలకాయ ఉండదు అని " చెప్పాడు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఆ లెక్చరర్ కి ఏం మాట్లాడాలో తెలియలేదు. మామూలుగా అయితే ఏదో ఒక యాక్షన్ తీసుకునేవాడేమో. కానీ ఆ లెక్చరర్ కూడా ఆ మాటకి వెనక్కి తగ్గాడు. ఈ సంఘటన నాకు కొడాలి మీదుగా వెళ్తునప్పుడు, అలా అన్న వ్యక్తి కొడాలి సెంటర్ లో కనిపించినప్పుడల్లా గుర్తొస్తుంది..

నేను చిన్నపట్నుంచి వింటున్న సంఘటన ఈ సందర్భం లో చెప్పాలనిపిస్తుంది. 1970 వ దశకం లో కొడాలి లో ఇరువర్గాల మధ్యన జరిగిన ఘర్షణల్లో కొంతమంది చనిపోయారు.ఈ కేసులో ఎదుటి వర్గం లో కొంతమందికి జీవిత ఖైదు విధించారట. 1977 లో దివిసీమ కి అతి పెద్ద ఉప్పెన వచ్చి కొన్ని వేల మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే. ఇప్పటికి మన ప్రాంతం లో వచ్చిన అతి పెద్ద ఉప్పెన ఇదే. అయితే ఆ శవాలని తీయటానికి మనుషులు కూడా దొరకని పరిస్థితులలో జైలులో ఉన్న ఖైదీలని విడుదల చేసి వారి సాయంతో దహన సంస్కారాలు నిర్వహించారు. వారు చేసిన ఆ సేవలకి ప్రభుత్వం వారి శిక్షా కాలాన్ని తగ్గించి అప్పటికప్పుడే భేషరతు గా వారిని విడుదల చేసింది. ఒక రకంగా ఆ ఉప్పెన వారికి మేలు చేసినట్లే.
 
 
మన మండలంలో ఘంటసాల తో పాటు అత్యంత రాజకీయ చైతన్యం కల ఊరు కొడాలి. కొడాలి పేరు చెప్తేనే ఆ చుట్టుపక్కల గ్రామాలలో కొంచెం భయం ఉండేది. ఆ ఊర్లో జరిగిన గొడవలు, సంఘటనలు ఆ భయానికి కారణం కావచ్చు. రెండు సంవత్సరాల పాటు కొడాలి మీదుగా కాలేజికి వెళ్తున్నపుడు ప్రతి రోజు ఆ సెంటర్ కి రాగానే అక్కడ తిరిగే మనుషుల్ని చూస్తూ ఉండేవాళ్ళం. అందరు ఎంతో ఉత్సాహం గా సౌమ్యం గా కనిపించేవాళ్ళు. కానీ ఇదేమిటి అందరూ ఇలా చెప్తారు వీళ్ళంతా ఇలా ఉంటే అనే ఆలోచన నా మదిని తొలుస్తూ ఉండేది. కానీ సంఘటనలు జరిగినప్పుడల్లా మాత్రం ఇదేమిటి ఇలా ఇంత చిన్న కారణానికే ప్రాణాలు తీసేంత కోపం ఎలా వస్తుందో అనిపించేది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న కొడాలి, బండి వెంకటేశ్వర   రావు హత్యతో  మళ్లీ ఉలిక్కి పడింది. తప్పెవరిది అని విశ్లేషించే సాహసం నేను చేయలేను గాని, జరిగిన ఘటన మాత్రం భవిష్యత్తులో యువకులను ప్రభావితం చేస్తే ఈ హత్యల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.ఇప్పటిదాకా కేవలం రాయలసీమ ఫాక్షనిజాన్ని సినిమాల్లో చూసిన మనం, కోస్తా లో కత్తుల విన్యాసాలని లైవ్ లో చూడచ్చు...