Friday, March 28, 2014

నా ఐరోపా యాత్ర - 15 (స్వీడన్)



మరుసటి రోజున శరవణన్ కి ఆఫీస్ ఉండటంతో తను పొద్దుటే లేచి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. శశి , నేను తాపీగా రెడీ అయ్యి 10 గంటలకి శరవణన్ ఆఫీస్ కి చేరుకున్నాము. వాళ్ళ ఆఫీస్ అంతా తిప్పి చూపించాడు. మా తిరుగు ఫ్లైట్ ఆ రోజు సాయంత్రం కావటంతో సిటీ అంతా చూద్దామని శశి నేను బయలుదేరాం. అక్కడికి దగ్గరలోనే ఒక షిప్ మ్యూజియం ఉందని తెలియటంతో ముందుగా అది చూద్దామని బోటు ఎక్కాము. స్వీడన్ నగరం అంతా మధ్యలో సముద్రం వాటి మీద వంతెనలతో ఎంతో అందంగా ఉంటుంది.
పార్లమెంట్ దగ్గర 
 
నేను ఇంతకుముందు చెప్పినట్లు యాక్సెస్ కార్డు తో ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయినా ప్రయాణం చెయ్యవచ్చు. అది ఉపయోగించి అక్కడున్న బోటు లో షిప్ మ్యూజియం కి చేరుకున్నాము. ఈ మ్యూజియం పేరు వాసా ముసీట్ (స్వీడిష్ భాషలో ముసీట్ అంటే మ్యూజియం). దీనికి ప్రవేశ రుసుము 200 స్వీడిష్ క్రోనాలు. ఈ నౌక వెనుక పలు ఆసక్తి కరమైన విషయాలు అక్కడున్న గైడ్ వివరించింది. 1626 లో స్వీడన్ రాజు Gaustav II Adolf పోలాండ్ మీద యుద్ధం చెయ్యటానికి ఒక యుద్ధనౌక ని నిర్మించాలని అనుకున్నాడు. దీనికోసం హెన్రీ అనే ఒక డచ్ ఇంజినీర్ ని నియమించాడు. స్టాక్ హోం షిప్ యార్డులో 1626 లో దీని నిర్మాణం ప్రారంభమై ఒక సంవత్సరం తరువాత 1627 సంవత్సరాంతానికి ఆ షిప్ నిర్మాణం పూర్తయ్యింది. దీనికిగాను టన్నుల కొద్దీ ఓక్ వృక్షాల కలపని వినియోగించారు.స్వీడన్లో విరివిగా లభించే రాగి మరియు ఇతర లోహాలని వినియోగించారు. ఈ నిర్మాణ కాలంలోనే షిప్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ అనారోగ్యంతో మరణించాడు.మొత్తం 3 డెక్ లతో ఈ షిప్ నిర్మాణం జరిగింది. 1628 ఆగస్టు 10 వ తేదీన వాసా నౌక పోలాండ్ పై యుద్ధానికి బాల్టిక్ సముద్రపు జలాల్లోకి ప్రవేశించింది. కొన్ని వేలమంది స్వీడన్లు, మిగతా దేశాల అంబాసిడర్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడటానికి విచ్చేశారు. కాని అప్పుడే జరిగింది ఓ అనుకోని దురదృష్ట సంఘటన. సముద్రంలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లోనే, అందరూ చూస్తుండగానే ఆ నౌక మునిగిపోయింది. కొన్ని వందలమంది అక్కడే జల సమాధి అయిపోయారు. ఏ లక్ష్యంతో అయితే ఆ నౌక ని వ్యయప్రయాసలకోర్చి నిర్మించారో అది నెరవేరకుండానే వాసా మునిగిపోయింది. ఇది స్వీడన్ కి కోలుకోలేని దెబ్బ.
 
 
అంత చిన్న దేశానికి ఆ ఖర్చుని తట్టుకొనే శక్తి అప్పటికి లేదు. అదీ కాకుండా మిగతా దేశాలముందు అవమానం. ఆగస్టు 27 నాటికల్లా Gaustav II Adolf ఈ ప్రమాదానికి సంభందించిన నివేదిక తెప్పించుకున్నాడు. నిర్మాణంలో లోపాలే కాకుండా, కెప్టెన్ తప్పిదము కూడా కారణమని తేల్చారు. ఈ ప్రమాదంలో బయటపడి ప్రాణాలు దక్కించుకున్న కెప్టెన్ హన్సన్ జైలు పాలయ్యాడు. ఆ నౌకలో ఉన్న కొన్ని ఫిరంగులను 1680 లో వెలికి తీసారు. అప్పటికే 50 సంవత్సరాలు అవటంతో షిప్ అంతా లోపల అంతా మట్టి పేరుకుపోయింది. ఆ తరువాత మళ్ళీ 1950 వరకు ఎవరూ దానిని పట్టించుకోలేదు. దాదాపు 333 సంవత్సరాల తరువాత ఆ నౌకని వెలికి తీయాలని స్వీడన్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా స్వీడిష్ నేవీ అధికారులు ప్రణాళిక తయారు చేసారు. అసలు అన్నేళ్ల తరువాత ఆ షిప్ యధాతధంగా ఉంటుందా అనే అనుమానాలు ఎదురయ్యాయి. మొత్తమ్మీద 18 లిఫ్ట్ ల సాయంతో 1959 సెప్టెంబర్ నాటికి సముద్రం అడుగునుండి 32 మీటర్ల ఎత్తుకి ఈ షిప్ ని లేపారు. అప్పటికే ఇనుము అంతా తుప్పు పట్టిపోయింది.ఇంకా 16 మీటర్లు పైకి లేపితే ఈ నౌక సముద్ర ఉపరితలం పైకి కనిపిస్తుంది. ఆ 16 మీటర్లు లేపటానికి మరో ఏడాది నర్ర పట్టింది. 
1961 ఏప్రిల్ 8 న మిగతా భాగాన్ని లేపటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మీడియా మొత్తం దీనిని కవర్ చేయటానికి స్టాక్ హోం చేరుకుంది. జరుగుతున్న ప్రక్రియ అంతా తమ కెమెరాల్లో బంధించారు. అంతిమంగా ఏప్రిల్ 24 న 333 ఏళ్ల తరువాత వాసా నౌక ప్రపంచానికి కనిపించింది.
 
వాసా మొదటిసారి ప్రపంచానికి కనిపించిన దృశ్యం
 
ఇక దానిని శుభ్రం చేయటానికే మరో ఏడాది పట్టింది. దీనికోసం హై ప్రెజర్ వాటర్ స్ప్రేయర్స్ ఉపయోగించారు. దాదాపు 40000 వస్తువులు ఈ నౌకలో లభించాయి. కాని విచిత్రమేమిటంటే 85 శాతం నౌక యధాతధంగా ఉంది. కలప పాడవటం కాని ముక్కలు అవటంగాని జరగలేదు. 333 ఏళ్ల క్రితం వేసిన పెయింట్ యధాతధంగా ఉంది. ఈ పెయింట్ లలో ఏమి ఉపయోగించారనే అంశం మీద ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి.
 
1961 నుండి 1988 వరకు తాత్కాలికంగా Wasavarvet అనే తాత్కాలిక మ్యూజియంలో ఈ షిప్ ని ఉంచారు. కాని సందర్శకులకి షిప్ మొత్తాన్ని ఒకేసారి చూడటం వీలయ్యేది కాదు.అలా అని ఈ షిప్ ని తరలించటం కష్ట సాధ్యమైన పని. అందుకోసమని 1981 లో స్వీడన్ ప్రభుత్వం ఈ షిప్ ఉన్న చోటునే ఉంచి దాని చుట్టూ మ్యూజియం నిర్మాణాన్ని ప్రారంభించింది.1990 నాటికి అది పూర్తయ్యి సందర్శకులకి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక మినీ ధియేటర్ ఉంది. ఈ షిప్ వెలికి తీసిన 1968 నాటి దృశ్యాలు మరియు ఈ నౌక సమగ్ర చరిత్ర అంతా 20 నిమిషాల పాటు ప్రదర్శిస్తారు.కాని నిజంగా అన్నేళ్ల తరువాత కూడా ఆ షిప్ ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. 2011 లో అత్యధికంగా టూరిస్టులు దీనిని దర్శించారు.అక్కడినుండి బయటకి రాగానే ఎదురుగా నోర్డికా ముసీట్ అనే మరో మ్యూజియం ఉంది. మాకు సమయం లేకపోవటంతో అక్కడినుండి ట్రాము ఎక్కి స్వీడన్ పార్లమెంట్ భవనం చేరుకున్నాం. ఇది చాలా పెద్దది, అక్కడినుండి అన్నీ చూసుకుంటూ శరవణన్ ఆఫీసుకి వెళ్లి పక్కనే ఉన్న ఇటాలియన్ రెస్టారెంటులో పిజ్జా తిని అందరం నడుచుకుంటూ స్వీడన్ సిటీ హాలుకి వెళ్ళాము.నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేసే హాలులో ఉన్నామన్న ఊహే అద్భుతంగా అనిపించింది.
 
 
​నోబెల్ బహుమతి ప్రదానం చేసే సిటీ హాల్ 
 
అక్కడినుండి మెట్రోలో బయలుదేరి బస్సు స్టేషన్ కి చేరుకున్నాము.మా పర్యటనలో శరవణన్, అన్బు మరియు వారి మిత్రులు చూపించిన ఆదరణ మరువలేనిది. స్వీడన్ జ్ఞాపకాలన్నీ పదిలంగా దాచుకుంటూ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము. 6.30 నిమిషాలకి స్కవస్తా ఎయిర్ పోర్ట్ నుండి పోజ్ నాన్ కి బయలుదేరాము. 

ఇప్పటిదాకా నా ఐరోపా యాత్ర అంతా నేను బ్రహ్మచారిగా ఉన్న సమయంలోనే సాగింది. తరువాత నేను పర్యటించిన ఇటలీ, లిచెన్ స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, జర్మనీ దేశాలన్నీ 2013 ఫిబ్రవరిలో నాకు వివాహం అయ్యాక నా శ్రీమతి భార్గవితోనే ప్రయాణించాను.

వచ్చేవారం -  బాద్షా సినిమా కోసం మా బెర్లిన్ ప్రయాణం.

Friday, March 21, 2014

నా ఐరోపా యాత్ర - 14 (స్వీడన్)


మరుసటి రోజు సెలవు కావటంతో శరవణన్ నాకు, శశి కి నగరాన్ని చూపించటానికి బయలుదేరాడు. ఆ రోజు బాగా చలిగా ఉంది , ఉష్ణోగ్రత - 2 డిగ్రీలు గా చూపిస్తోంది. నవంబర్ నెల కావటంతో అప్పుడప్పుడే చలికాలం మొదలవుతోంది. స్వీడన్ లో కార్ల కంటే వాటిని మెయిన్ టైన్ చెయ్యటం చాలా ఖరీదు. ఫ్రీ పార్కింగ్ అనేది ఎక్కడా ఉండదు. పని చేసే ఆఫీసుల్లో సైతం పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే. కాలుష్యాన్ని అరికట్టటానికి , అలాగే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎక్కువ వినియోగించేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యల్ని తీసుకుంది. ఎక్కడ చూసినా బోర్డులు అన్నీ స్వీడిష్ భాషలోనే ఉన్నాయి. కాని స్వీడన్ వాళ్ళకి ఇంగ్లీష్ బాగానే వచ్చు. బస్సు డ్రైవర్స్ కూడా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐరోపా దేశాల వారికి తమ భాష అంటే ప్రాణం. ఇతర భాషలన్నీ అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తారు. కంప్యూటర్స్ అన్నీ స్థానిక భాషలోనే ఉంటాయి. మిగతా దేశాల విద్యార్ధులు, ఉద్యోగస్తులు మాత్రమే ఇంగ్లీష్ కంప్యుటర్ని వాడతారు. స్వీడన్ జనాభా మొత్తం 9 మిలియన్లు. అంటే మన రాష్ట్ర జనాభాలో 10 వ వంతు కంటే తక్కువే.మేము యూనివర్సిటీ మెట్రో స్టేషన్లో ఎక్కి 6 స్టేషన్ల తర్వాత దిగి బస్సు ఎక్కాము. ఆరోజు సన్నగా చిరుజల్లులు కూడా పడుతున్నాయి. సినిమా సాయంత్రం 6 గంటలకి కావటంతో కొంచెం సేపు టైం పాస్ చేద్దామని ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళాము. అందరూ ఉండటంతో సరదాగా బౌలింగ్ ఆడాము.
 
​శశి తమ్ముడు శరవణన్ తో పాలస్ దగ్గర 
 
స్టాక్ హోం చాలా ఖరీదైన నగరం. ఆహార పదార్ధాలు, వస్తువుల రేట్లన్నీ పోలాండ్ తో పోలిస్తే రెండింతలు ఉన్నాయి. చిన్న పాప ని ట్రాలీ లో తీసుకు వెళుతూ ఒక తెలుగు ఫామిలీ కనిపించారు. ఏదో సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ నిమిత్తం ఆయన అక్కడికి వచ్చారట.ఇక సాయంత్రం కాగానే అక్కడికి కొద్ది దూరంలో ఉన్న సినిమా థియేటర్ కి వెళ్ళాము. టికెట్ ధర 50 స్వీడిష్ క్రోనాలు ( 1 క్రోనా = 9 రూపాయలు.) ఎటు చూసినా తమిళ వాసనే. కాని ఎందుకో ఆ జనాలేవరూ మన దేశపు తమిళుల్లా అనిపించలేదు. కాని శరవణన్ చెప్పాడు, వాళ్ళంతా శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తమిళులు అని. ఎక్కడున్నా తమిళులు అంతా ఒక్కటే. ఆ దేశం ఈ దేశం అనే బేధ భావాలు వారికి ఉండవు. కలిసున్నా మనమే ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతున్నాం. ఎక్కడో వేరే దేశంలో ఉన్న వారి కోసం కూడా మన దేశ తమిళులు పోరాడుతున్నారు. ఎల్ టి టి ఈ ని సమర్ధిస్తూ థియేటర్ లో పోస్టర్లు కనిపించాయి. ఎల్ టి టి ఈ కి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చేది నార్వే, స్వీడన్లలో స్థిరపడ్డ తమిళులే. సినిమా చూస్తునంత సేపు తమిళనాడులో ఏదో మారుమూల టూరింగ్ టాకీస్ లో చూస్తున్న అనుభూతి కలిగింది.
 
సినిమా ముగిశాక ఆ రోజుకి మా ప్రోగ్రాం ముగించుకుని ఇంటికి చేరుకున్నాము. మేము ఇంటికి వెళ్ళగానే నాగార్జున వచ్చి కలుసుకున్నాడు.చాలా కాలం తరువాత ఒక తెలుగు వ్యక్తి తో నేరుగా మాట్లాడాను. నాగార్జునది  గన్నవరం. ఇంజినీరింగ్ మదురైలో చదివి ఎం ఎస్ కోసం ఇక్కడికి వచ్చాడు. 
వోల్వో, ఎరిక్ సన్, స్వాన్ స్కా, స్కైప్, ఐకియా, హె అండ్ ఎం, ఎలక్ట్రోలక్స్, భోఫోర్స్ లాంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకి పుట్టిల్లు స్వీడన్. మేము బస్సు లో వెళుతుండగా ఎరిక్సన్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ కనిపించాయి.  ​డైనమైట్‌ను కనుగొని మానవాళికి ఎంతో మేలు  ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ జన్మించింది ఈ నగరం లోనే. ఒక పాత స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు.  బోఫోర్స్ అనగానే మనకి కోట్ల కుంభకోణం గుర్తుకు వస్తుంది. ​మన నాయకుల అవినీతి, ఇప్పటికీ బయటపడని కోట్ల దోపిడీ గుర్తొస్తుంది. కానీ బోఫోర్స్ శతఘ్నులు లేకపోతే అలనాడు కార్గిల్ యుద్దాన్ని మనం జయించలేకపోయేవారమన్న నిజం చాలామందికి తెలియదు. 90 డిగ్రీల వాలులో పేలే శతఘ్ని ప్రపంచంలో అదొక్కటే.ఈయన పేరు మీదే నోబెల్ శాంతి బహుమతి ప్రతి ఏటా ఇస్తారు. మన దేశం నుండి మొట్టమొదటి సారి ఈ బహుమతి అందుకున్న వ్యక్తి  ​విశ్వకవి రవీంద్రనాధ్ ఠాకూర్. 1913 లో ఆయనకి ఈ పురస్కారం లభించింది.  నిజానికి యూరోపియన్ దేశాలకి చెందని రచయిత మొదటిసారిగా సాహిత్యపు బహుమతిని అందుకున్న మొదటి సందర్భం ఇదే. కాని అది అందుకోవటానికి ఆయన ఇక్కడికి రాలేదట. మరుసటి రోజున శశి , నేను, శరవణన్ కలిసి Drottningholm పాలస్ కి వెళ్ళాము. ఇది ఒకప్పుడు స్వీడన్ రాజులు నివసించిన భవంతి. ఇప్పుడు అక్కడ  లేదు. కేవలం సందర్శనీయ స్థలం మాత్రమే.
 
 
ఆ కట్టడాల్లో భారీతనం,యూరోపియన్ శైలి లో ఉన్న నిర్మాణాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆరోజు దీపావళి కావటంతో అక్కడున్న శ్రీ కృష్ణ టెంపుల్ లో ఇండియన్స్ అంతా కలిసి దీపావళి సెలెబ్రేట్ చేస్తున్నారని తెలిసింది. అక్కడినుండి మెట్రోలో మరో గంట ప్రయాణించి ఆ టెంపుల్ కి చేరుకున్నాం. టెంపుల్ అంటే మన దేశంలో లాగా కాదు. ఒక చిన్న ఇంటిలో దేవుడి విగ్రహాలని పెట్టి పూజిస్తూ ఉంటారు. కొంచెం సేపు అక్కడ గడిపి చీకటి పడటంతో తిరిగి మళ్ళీ రూముకి బయలుదేరాము.