Friday, August 23, 2013

నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)


నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)
పదవ బారక్ ఆడవాళ్ళ పాలిట నరక కూపం. అందులో జర్మన్ డాక్టర్లు ఆడవాళ్ళపై రక రకాల ప్రయోగాలు చేసేవారట. గర్భిణి స్త్రీలకి ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండానే లోపల పిండం ఎలా ఉందో అని కోసి చూసేవారు. ఇంకా స్త్రీల అవయవాలన్నీ కోసి వాటిపై పరిశోధనలు చేసారు. రకరకాల ఔషధాలని ప్రయోగించి అవి పనిచేస్తునాయో లేదో అని పరీక్షించేవారు. ఇవన్నీ బతికున్న మనుషులపైన ఎటువంటి మత్తు మందు లేకుండా జరిపిన పాశవిక హత్యా కాండ. ఆ బారక్ లో లోపలి వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో బయటకి వచ్చేవారు కాదు. మిగతా వారికి ఆ బారక్ లో ప్రవేశం నిషిద్ధం. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా. ఈ పని ఏ ఆటవిక ప్రజలు కూడా చేసి ఉండరు. అందుకే హిట్లర్ అనే ఒక మానవుడిని మృగం తో పోల్చినా పాపమే.ఇక ఒక నాజీ అధికారి భార్య చేసిన పని వింటే రక్తం మరిగిపోతుంది. గ్యాస్ చాంబర్లలో మరణించిన యూదుల ఆడవారి స్తనాలని కోసి ఆ చర్మంతో ఫాన్సీ పర్సులు కుట్టేది. యుద్ధం ముగిశాక ఈమె  బ్రిటన్ సైన్యానికి చిక్కి జైల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అసలు ఇక్కడ ఎం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలిసేది కాదు.ఇక్కడ ఖైదీలందరికీ ఒక యునిఫామ్ ఉంది. కాంపులోకి ప్రవేశించగానే చేతిపై వారి నంబర్ ని పచ్చ పొడిచేవారు.  చచ్చేదాకా వాడిని ఆ నెంబర్ తోనే పిలిచేవారు. కొందరికి ఆ పచ్చ పొడవటం వల్ల అయిన గాయం సెప్టిక్ అయ్యి మరణించేవారు.
మేము చూస్తున్నంత సేపు సందర్శకులలో చాలామంది ఏడుస్తూనే ఉన్నారు.యుద్ధం ముగిసాక కాని ఈ కాంపుల్లో అకృత్యాలు బయటి ప్రపంచానికి తెలియలేదు. యుద్ధంలో ఓడిపోయామని తెలియగానే ఇక్కడి అధికారులు రికార్డులన్నీ తగలబెట్టేసారు. అమెరికా, బ్రిటన్ సైన్యాలు వచ్చేటప్పటికి సగం కాలుతున్న శవాలు, ఆస్థి పంజరాలు, కుళ్ళిపోయిన వేలాది మంది శవాలు మీదుగా నడవాల్సి వచ్చిందట. 1941 నుండి 1944 వరకు ఈ కాంపుకి తీసుకొచ్చిన వారిలో ఒక్కరు కూడా యుద్ధం ముగిసే నాటికి జీవించి లేరు. 1945 లో మూడు నెలలకి ముందు తీసుకు వచ్చిన వారు మాత్రమే యుద్ధం ముగిసాక బయట పడ్డారు.ఇక యుద్ధం అయ్యాక పట్టుబడిన నాజీ అధికారులని జర్మనీ లో ఉన్న న్యురేం బర్గ్ లో న్యాయ విచారణ చేసారు. అందరికీ మరణ శిక్ష విధించారు. ఇక  కాంపులో అత్యాచారాలకి పాల్పడిన నాజీ అధికారులని ఇక్కడే తమ ముందే ఉరి తీయాలని యూదులు కోరడంతో కొంతమందిని ఇక్కడే ఉరి తీసారు. కాని ఎన్ని శిక్షలు విధించినా పోయిన 60 లక్షలమంది ప్రాణాలు, బతికుండగానే జీవచ్చవాలు గా మిగిలిన లక్షలాది మంది జీవితాలు తిరిగి రావుగా.ఎన్నో పసి మొగ్గలు నాజీల దురహంకారం కింద నలిగిపోయాయి.  ప్రపంచంలోనే జరిగిన అతి పెద్ద మానవ హననం ఈ యూదుల మారణ కాండ. దీనిని హాలో కాస్ట్ అంటారు. ఈ పేరుతొ జర్మనీ లోనూ అమెరికాలోనూ పలు మ్యుజియాలు ఉన్నాయి.
పోలాండ్ వాసులకి జర్మనీ అంటే ఎంత కోపమో, తమని కాపాడిన రష్యా అన్నా అంతే కోపం.1945 నుండి 1989 వరకు ఇది రష్యా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాని పోలిష్ ప్రజలు ఆ కమ్యూనిస్టు విధానాలకి వ్యతిరేకం. జర్మనీ నుండి 1945 లో విముక్తి చేశామనే సాకుతో రష్యా ఈ దేశాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. సోవియట్ యూనియన్ ముక్కలయ్యాక పోలాండ్ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 2004 లో యూరోపియన్ యూనియన్ లో భాగస్వామ్య దేశం అయ్యింది. అయినప్పటికీ మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే ఆర్ధిక ప్రగతిలో ఈ దేశం ముందు ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కరెన్సీ యూరో కి మారకపోవటం వల్లే పోలాండ్ స్థిమితంగా ఉందనేది నా అభిప్రాయం. కరెన్సీ ల మధ్య వ్యత్యాసం ఉంటేనే ఒక దేశపు ప్రజలు మరొక దేశానికి విహారానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. యూరప్ దేశాల ప్రజలు ఎక్కువ విహారాన్ని ఇష్టపడతారు. సెలవలు వస్తే ఇతర దేశాలకి వెళుతూ ఉంటారు.అన్ని దేశాలకి ఉన్న ప్రధాన ఆదాయ వనరు టూరిజం. అన్ని దేశాలలో యూరో కరెన్సీ ఉంటే ఒక దేశం అవలంబించే ఆర్ధిక విధానాల వల్ల మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం యూరో మీద పడి యూరో చలామణి లో ఉన్న మిగతా దేశాల ఆర్ధిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపుతుంది. కరెన్సీ లో వ్యత్యాసం ఉంటే ఏదైనా దేశం ఆర్ధిక సంక్షోభంలో పడినప్పుడు ఆ దేశపు కరెన్సీ తో యూరో మారకం విలువ పెరుగుతుంది.యూరో చలామణిలో ఉన్న దేశస్తులు చవకలో వినోదం పొందటానికి ఆ దేశానికి వెళతారు. దాని ద్వారా ఆ దేశం సంక్షోభం నుండి సునాయాసంగా గట్టేక్కవచ్చు. ఉదాహరణకి ఇటలీలో ఒక పిజ్జా ఖరీదు 12 యూరోలు, అదే పిజ్జా పోలాండ్లో 14 జిలోటీలు. ఒక యూరోకి 4.50 జిలోటి లు వస్తాయి.అంటే ఇటలీ లో కంటే మూడో వంతులో పోలాండ్ లో వినోదం దొరుకుతుంది. ఇటాలియన్స్ వీకెండ్స్ కి , సెలవలకి పోలాండ్ వచ్చి హాయిగా గడపచ్చు. అదే ఇక్కడ కూడా యూరో ఉంటే వచ్చేవారికి అంత ఆసక్తి ఉండదు. ఇటీవల సైప్రస్, స్పెయిన్, గ్రీస్ లలో ఆర్ధిక సంక్షోభం వచ్చింది. వాటిని నిలబెట్టటానికి యూరోప్ యూనియన్ మొత్తం పూనుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ ని ఆయా దేశాల్లో యధా తధంగా ఉంచటం మంచిది.ఇక ఆశ్విత్జ్ చూసాక అత్యంత బాధా తప్త హృదయంతో అక్కడినుండి బయలుదేరాం. మా తరువాతి గమ్యం క్రాకో నగరంలో ఉన్న సాల్ట్ మైన్. ( ఉప్పుగని )

Friday, August 16, 2013

నా ఐరోపా యాత్ర - 7 (పోలాండ్)

      

అక్కడ ఉన్న టూరిస్టులు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి వదనాల్లో విచారమే తప్ప ఉత్సాహం లేదు. రుస్కి ఎంట్రన్స్ అంటే రష్యా యుద్ధ ఖైదీలని తీసికెళ్ళే ద్వారం అది. ఇప్పుడు కాంపులోకి వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. వెళ్ళే దారిలో ఆ ప్రాంతాన్ని దర్శించి నివాళులర్పించిన వివిధ దేశాల అధ్యక్షుల వివరాలన్నీ ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టారు.వాటిని దాటుకుంటూ టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. ఇంగ్లీష్ గైడ్ కావాలంటే మనిషికి 25 జిలోటీ లు పోలిష్ భాష అయితే 15 జిలోటీలు ప్రవేశ రుసుము. 20 మందికి ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ చెప్పేది వినటానికి ఒక ఎలెక్ట్రానిక్ రేడియో మరియు హెడ్ ఫోన్స్ ఇస్తారు. మనం గుంపులో ఉన్నా ఆ గైడ్ చెప్పేది స్పష్టంగా వినపడుతుంది. ఈ కాంపు మూడు భాగాలుగా నిర్మించారు. ఆష్విత్జ్ - 1 లోకి మేము ఇప్పుడు వెళ్ళబోయేది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ఖైదీలని, యూదులని ఉంచటానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ప్రాంతాన్ని ప్రతిపాదించాడు. రైలు మార్గం అనువుగా ఉండటంతో అన్ని దేశాలనుండి యూదులని ఇక్కడికి తరలించటానికి అనువుగా ఉంటుందని జర్మన్ నాజీ ఆఫీసర్ హిమ్లర్ ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ గ్రామంలో అప్పటికే ఉన్న 1200 మందిని ఖాళీ చేయించి 40 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని నాజీ సైన్యం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 300 మంది యూదుల చేత దీనికి పునాది రాళ్ళు వేయించి, తరువాతి కాలంలో ఇక్కడి ఖైదీల చేతనే మిగతా 2 బ్లాకులు కట్టించారు.
ఇక్కడికి రైళ్ళలో ఒక్కో పెట్టెలో 200 మందిని కుక్కి 3 రోజుల పాటు ప్రయాణించాక రైళ్ళు ఇక్కడికి చేరుకునేవి. అవి ఇక్కడికి చేరుకునేలోపే ఆ పెట్టెల్లో సగం మంది చనిపోయేవారు. మిగిలిన వారిని ఇక్కడ చంపేసేవారు.కేవలం ఈ ఆశ్విత్జ్ కాంపుల్లో చంపబడ్డ మనుషుల సంఖ్య దాదాపు 12 లక్షలు. మనుషుల్ని తీసుకురావటానికి నేరుగా రైలు మార్గాన్ని కాంప్ లోపలికే నిర్మించారు. యూరప్ లో అన్ని దేశాలనుండి యూదులని, యుద్ధఖైదీలని రైళ్ళలో ఈ కాంపుకి తరలించేవారు. రైలు దిగగానే నాజీ డాక్టర్లు, కమాండర్లు వారిని పరీక్షించేవారు. కొంచెం శారీరకంగా ధృడంగా ఉన్నవారిని ఒక పక్కకి, మిగతా వారిని నేరుగా చంపటానికి వేరు చేసేవారు. ఆరోగ్యం గా ఉన్నవారిని కొంతకాలం పని చేయించుకుని వారిలో సత్తువ అయిపోగానే చంపేసేవారు. కొత్త బాచ్ మనుషులు వచ్చినపుడు గదులు ఖాళీ లేకపోతే వెంటనే వచ్చిన వారిని చంపేయటమో లేక అప్పటికే కాంపులో బలహీనంగా ఉన్న వారిని ఆఘమేఘాల మీద కాల్చేసి, కొత్తవారిని ఆ గదుల్లో ఉంచేవారు. మా గైడ్ తో పాటు ఉన్న 20 మందిలో మేము నలుగురం ఇండియన్స్ ,మార్చిన్ కూడా మాతోనే ఉన్నాడు. గైడ్ ని అనుసరిస్తూ ఆ సువిశాల ప్రాంగణంలోకి ప్రవేశించాం. అప్పటికే అక్కడ చాలామంది టూరిస్టులు ఉన్నారు.అక్కడ నిర్మించిన బ్లాకులన్నీ దేశాల వారిగా పేర్లు పెట్టారు. అంటే ఆక్రమిత దేశాలనుండి తీసుకు వచ్చే యూదులందరినీ ఆయా దేశాల పేరుతో నిర్మించిన బ్లాకులో ఉంచేవారు. మేము ప్రవేశించిన బ్లాకు కి పేరు ఏమీ లేదు. అక్కడి యుద్ధ ఖైదీలు వాడిన దుస్తులు, బూట్లు, వారి వస్తువులు, వికలాంగులు వాడే చేతి కర్రలు అక్కడ కుప్పలుగా పోసి ఉన్నాయి. వచ్చిన ఖైదీలకి బంగారు దంతాలు ఉంటే వాళ్ళు బతికుండగానే నాజీలు అవి పీకేసేవారట. మొదటి బ్లాకు చూడటం పూర్తవగానే శశి బయటకి వచ్చి అక్కడ ఒక మెట్టు దగ్గర కూలబడిపోయాడు. అసలేం జరిగింది ఇక్కడ ? అసలు మనుషుల్ని ఇలా చంపటం ఏంటి అంటూ ఇక నేను చూడలేను మీరు వెళ్ళండి అని అక్కడే ఉండిపోయాడు. ఉదయ అమ్మణ్ణ నాతో పాటే వచ్చాడు. మార్చిన్, నేను, చోటు రామ్ కలిసి తరువాతి బ్లాకు కి వెళ్ళాం. మార్చిన్ కి అన్నీ తెలిసి ఉండటంతో మేము మా గ్రూపు నుండి విడిపోయి సొంతంగా తిరగటం మొదలు పెట్టాం. తరువాతి బ్లాకులో ఆ కాంపులో చంపబడ్డ మనుషుల ఫోటోలు వారు వాడిన తిండి పాత్రలు ఉన్నాయి. హిట్లర్ యుద్ధాన్ని ఒక సంస్థ ని నడిపినట్టే నడిపాడు. బతికున్న ముడి పదార్ధాలని నిర్జీవంగా చెయ్యటం ఈ ఫాక్టరీ యొక్క పని.  మనుషుల్ని చంపటానికి నాజీలు ఉపయోగించిన పద్ధతులు వింటే మన హృదయం ద్రవించక మానదు. రోజుకి 4000 మంది నుండి 6000 మందిని చంపాలనేది టార్గెట్. గాస్ చాంబర్లు, శవాలని కాల్చే ఫర్నేస్ లు 24 గంటలు పని చేస్తూ ఉండేవి. వారానికొకసారి స్నానం అనే నెపంతో టాయ్లెట్ అని రాసున్న గదుల్లోకి ఖైదీలని పంపేవారు. ఒక్కో బాత్రూంలోకి 50 మందిని పంపి పైన ఉన్న షవర్ ఆన్ చెయ్యగానే గ్యాస్ విడుదలయ్యి లోపల ఉన్న వాళ్ళంతా శవాలుగా మారేవాళ్ళు. ఆ తరువాత పక్కనే ఉన్న ఫర్నేస్ లో వారిని తగలబెట్టేసేవాళ్ళు ఇదంతా 20 నిముషాల్లో పూర్తయ్యేది. రోజూ కొన్ని వేల శవాలు కాలుతుండటంతో ఈ ప్రాంతం అంతా పొగ, దుర్వాసనతో నిండి ఉండేది.
వాటి మధ్యే మిగిలిన ఖైదీలు ఉండేవారు. నాజీలు ఎంత కర్కోటకులంటే ఏదైనా బారక్ లో ఖైదీ కనపడకపోతే ఆ బారక్ లో ఉన్న మిగతా పదిమందిని చంపేసే వాళ్ళు. ఆ భయంతో తోటి వాళ్ళు తప్పించుకోకుండా సహా ఖైదీలే కాపలా కాసేవాళ్ళు. ఆ కాంపులోకి తీసుకు వచ్చిన ప్రతి ఖైదీ వివరాలు రికార్డ్ చేశారు. వాళ్ళు పట్టుబడిన ప్రాంతం,కాంపులోకి తీసుకు వచ్చిన తేదీ,వారిని చంపిన తేదీ, అందుకు వాడిన పద్ధతులు కూడా రికార్డ్ చేశారు. అంతే కాక ప్రతి వ్యక్తినీ ఫోటో తీశారు. కాంపుకి వచ్చినపుడు తీసిన ఫోటోకి తరువాతి మూడునెలల తర్వాత అదే మనిషి ఫోటోకి అసలు పోలికలే లేవు. ఆ ఫోటోలన్నీ ఇక్కడ ప్రదర్శనలో చూడచ్చు.మగ వాళ్ళకి ఆడవాళ్ళకి విడి విడిగా బారక్ లు ఉన్నయి.ఇక్కడికి వచ్చిన వాళ్ళ సగటు జీవితం మూడు నెలల కంటే ఎక్కువ ఉండేది కాదట.ఒక్కో గదిలో 400 మందిని ఉంచేవారు. ఆ మంచాలు ఇప్పటికీ యధాతధంగా ఉన్నాయి. ఎలుకలు, చలి తో సహవాసం. ఎవరికీ అక్కడినుంచి తప్పించుకునే ఆలోచన కూడా వచ్చేది కాదట.ఇన్ని లక్షలమందిలో తప్పించుకోవటానికి చూసిన 802 మందిలో 700 మంది తిరిగి పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారంతా కొద్ది గంటల్లోనే చంపబడ్డారు. పట్టుబడగానే ఒక గోడ ముందు నిలబెట్టి తుపాకీతో కాల్చేసే వారు. ఇప్పుడు ఆ గోడ లేదు కాని అదే నమూనాతో గోడని నిర్మించారు. అక్కడ చనిపోయిన వారి స్మారకార్ధం సందర్శకులు కొవ్వొత్తులు పెడతారు. మేము ఆ గోడ దగ్గర నిలబడి కాసేపు శ్రద్ధాంజలి ఘటించాం.
ఈ కాంపు కి ఖైదీల తాకిడి ఎక్కువవటంతో సామర్ధ్యం సరిపోక అస్విత్జ్ - 2 ఆస్విత్జ్ -3 కాంపులని 1942 - 43 ప్రాంతాల్లో నిర్మించారు. కొంచెం బలిష్టంగా ఉన్న యూదులని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాక్తరీల్లో పని చెయ్యటానికి తీసుకు వెళ్ళేవాళ్ళు. ఒక ఎండిపోయిన బ్రెడ్ మరియు సూప్ ఆహారంగా ఇచ్చి రోజంతా పని చేయించేవాళ్ళు. రెండు మూడు నెలల్లోనే వారు నీరసించి మరణించే వాళ్ళు. ఒకసారి గ్యాస్ కొరత ఏర్పడి జనాలని చంపటానికి ఇబ్బంది ఏర్పడటంతో, కొన్ని వేల మందిని మంచులో నడిపించుకుంటూ కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్ళారు. నడక పూర్తయ్యేలోపు సగం మంది ఆ చలికి దారిలోనే ప్రాణాలు వదిలారు. నడవలేని వారిని నాజీలు ఎక్కడికక్కడ కాల్చి చంపారు. చరిత్రలో దీనిని డెత్ వాక్ గా పిలిచారు. 22 వ బారక్ లో అతిచిన్న డార్క్ రూము చూశాం. ఒక మనిషి నిలబడగల రూం అది. అందులో 4గురు మనుషుల్ని పెట్టేవారు, వారు నిలబడే ఉండాలి గాలి వెలుతురూ లేదు,ఒక రోజులోనే ఆ నలుగురూ శవాలయ్యేవారు. యూదుల రక్తంతో వారి హాహాకారాలతో ఈ నేల ఎంతటి పాపాలకి వేదిక అయ్యిందో తలచుకోగానే కళ్ళ వెంట అప్రయత్నంగానే జల జలా నీళ్ళు కారాయి. నాతో పాటు ఉన్న మార్చిన్ కూడా ఒక్కో చోట నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎందుకంటే 30 లక్షలమంది పోలాండ్ వాసులే ఈ యుద్ధంలో చనిపోయారు. అది కూడా తమ దేశంలో నిర్మించిన ఈ మృత్యు సౌధంలో 12 లక్షలమంది చంపబడ్డారు.10 వ నంబర్ బారక్ వైపు చూపిస్తూ మార్చిన్ చెప్పిన విషయం వింటే కడుపులో దేవినట్లైంది.....

Friday, August 9, 2013

నా ఐరోపా యాత్ర - 6 (పోలాండ్)


యూదులు పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు. క్రీస్తు పూర్వం ఈ మతం ఉంది. వీరి దేవుడు మెసయ్య ఎప్పటికైనా వస్తాడని నమ్ముతారు . వీరి ప్రార్ధనా మందిరాలని సినగోగాస్ అంటారు. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. అక్కడ  ఏసుక్రీస్తును శిలువ చేసి చంపిన తరువాత యూదులు భయకంపితులై ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి చెల్లాచెదురుగా ఐరోపా, అమెరికాలకు వలస పోయి అక్కడ స్థిరపడ్డారు.మరి కొంతమంది అమెరికా కి వెళ్లారు. ఇలా వెళ్ళిన వారంతా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఆ దేశపు పౌరులుగానే ఉండిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ తరపున ఎంతో మంది యూదులు పోరాడారు. మెడల్స్ సంపాదించారు. కాని హిట్లర్ కి ఎందుకో యూదుల వల్లే కుట్ర జరిగి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని నమ్మాడు. వారి నిర్మూలనే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. మనుషుల్లో ఉండే జెనెటిక్ లక్షణాల ఆధారంగా వారిని వేర్వేరు జాతులుగా పేర్కొన్నాడు. జర్మనీ వాసుల లక్షణాలు ఎలా ఉంటాయో వివరించి వారిని మిగతా జాతుల వారితో కలవకూడదని ఆజ్ఞాపించాడు. తాను 1934 లో అధికారంలోకి రాగానే ఈ యూదు విద్వేష  చర్యల్ని చేపట్టాడు. యూదులని అధమజాతి పౌరులుగా ప్రకటించి వారిని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు. 1938 లో ఒక యూదు ఈ పరిణామాలకి ఎదురు తిరగటంతో దానికి ప్రతీకారంగా నవంబర్ 9 రాత్రి నాజీ సైన్యం ఒక్కసారిగా యూదులపై విరుచుకు పడింది. 91 మందిని కాల్చి చంపారు. 30000 మందికి ఒకేసారి అరెస్ట్ చేసి concentration camp కి తరలించారు. యూదుల ప్రార్ధనా మందిరాలు తగులబెట్టారు. వారి షాపుల అద్దాలన్నీ పగలగొట్టారు. బెర్లిన్ అంతా గాజుముక్కలతో నిండిపోయింది. అందుకే దీనికి జర్మన్ భాషలో  Crystal Nacht అని పేరు వచ్చింది. అంటే "అద్దాలు పగిలిన రాత్రి".
 
ఇక అక్కడినుండి యూదుల నిర్భందం ప్రారంభమైంది. జైళ్ళు చాలక  concentration camp లు నిర్మించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కాంపుల్లో కుక్కారు. ఇక హిట్లర్ జర్మనీ విస్తరణ దిశగా దృష్టి సారించాడు. పశ్చిమాన  ఉన్న పోలాండ్ ని జర్మనీ తో కలిపేయాలని భావించాడు.అసలు ప్రపంచ పటంలో పోలాండ్ అనే దేశం ఉండరాదు అనేది హిట్లర్ ఆలోచన. అప్పటికి అత్యధికంగా 30 లక్షలమంది యూదులు ఉన్న దేశం పోలాండ్. అయితే పోల్స్ ఈ ప్రతిపాదన కి అంగీకరించలేదు. ఈలోగా రష్యా అధ్యక్షుడు స్టాలిన్ తో హిట్లర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలాండ్ ని తూర్పునుండి రష్యా, పశ్చిమం నుండి జర్మనీ ఆక్రమించుకోవాలని ఆ ఒప్పంద సారాంశం. దీనికి ప్రతిగా రష్యా జర్మన్ ఇతర ఆక్రమిత దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 1939 న జర్మన్ బాంబర్లు ఎటువంటి హెచ్చరికా లేకుండానే పోలాండ్ ఆర్మీ పై విరుచుకు పడ్డాయి. మొదట్లో తీవ్రంగా ప్రతిఘటించినా జర్మన్ నాజీల ధాటికి తట్టుకోలేక పోలాండ్ లొంగిపోయింది. సెప్టెంబర్ 17 న రష్యా తూర్పునుండి పోలాండ్ ని ఆక్రమించింది. ఈ విధంగా పోలాండ్ దేశం 1945 వరకు అస్తిత్వం లేకుండా ఇరు దేశాల ఆక్రమణలో ఉండిపోయింది. 30 లక్షలమంది యూదులు మరియు ఇతర పోల్స్ లక్షలాది మంది ఈ కాలంలో చంపబడ్డారు. వీళ్ళందరినీ చంపటానికి మొత్తం 48 డెత్ ఫాక్టరీ లు concentration camp ల పేరుతో పోలాండ్ మరియు జర్మనీ లలో నిర్మించారు. అత్యంత పెద్ద డెత్ ఫాక్టరీ పోలాండ్ లో auschwitz అనే ప్రాంతంలో నిర్మించారు. పోలాండ్లో నేను చూసిన తరువాతి ప్రదేశం ఇదే. చాలామంది మిత్రులు అది చూడవద్దని వారించారు. వారెందుకు అలా అన్నారో నాకు అర్ధం కాలేదు. కాని నేను ఈ ప్రదేశం చూశాక ఒక మనిషిగా చలించిపోయాను. చెలియల కట్ట కూడా ఆపలేని అశ్రువులు ధారగా కారుతుంటే అంతకుమించిన ఆవేదన నా మనసుని చిద్రం చేసింది. అసలు ఈ ప్రాంతం చూడకుండా ఉంటే బావుండేది అనిపించింది. ఇప్పటికీ,ఎప్పటికీ  ఆ డెత్ కాంప్ నేను మరువలేని మరణ సౌధం. సాటి మనుషుల్ని చంపటానికి మనుషులే నిర్మించిన ఆ సువిశాల మరణ ప్రాంగణం ఎన్ని రోదనలని భరించిందో, ఎంతమంది పసి వాళ్ళ ప్రాణాలు గ్యాస్ చాంబర్ల ఆకలికి బలై పోయాయో తలుచుకునప్పుడల్లా గుండె చెమ్మగిల్లిపోతుంది. 

Auschwitz అనే ప్రదేశం మేము ఉన్న మింజు జెర్జ్ కి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబర్లో వరుసగా వారం రోజులు సెలవు కావటంతో అక్కడి మాతోపాటు పనిచేసే స్థానిక మిత్రుడు మార్చిన్ క్రదోహా ( Marcin Krajdoha) ని అడిగితే తను తీసుకువెళ్తా అని చెప్పాడు. తరువాతి కాలంలో నేను చూసిన అన్ని ప్రదేశాలకి తానే గైడ్ గా వ్యవహరించాడు. మా స్నేహ బంధం ఇప్పటికీ అంతే ఆత్మీయంగా కొనసాగుతోంది.మింజు జేర్జ్ నుండి నవంబర్ న తోటి భారతీయ మిత్రులు ముగ్గురు ఉదయ్ అమ్మణ్ణ , శశి కుమార్, చోటురాం లతో కలిసి మార్చిన్ కారులో బయలుదేరాం. Auschwitz చూసి అక్కడినుంచి పోలాండ్ ఒకప్పటి రాజధాని అయిన క్రాకో పట్టణం మరియు జాకోపానా అనే పర్వతాలు చూడాలి అనేది మా ప్లాన్. పోలాండ్ కి దక్షిణంగా 5 గంటలు ప్రయాణించాక Auschwitz చేరుకున్నాం. దానిని ఇప్పుడు ఆష్విత్జ్ మ్యూజియం గా పిలుస్తున్నారు. మేము వెళ్ళే దారిలో ఉన్న పాడుబడిన రైలు పట్టాలని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు, ఈ పట్టాలమీదుగానే రైలు ఆ డెత్ కాంపులోకి వివిధ దేశాలనుంచి మనుషుల్ని తీసుకు వచ్చేది అని. పార్కింగ్ లో కార్ పార్క్ చేసి రుస్కి ఎంట్రన్స్ అనే గేటు గుండా టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. బయట 50 కి పైగా టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. అంతమంది జనాలు అక్కడ ఉన్నా కాని ఆ ప్రాంతం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది.

Friday, August 2, 2013

నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)

నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)


నేను ఎంతోమంది గొప్పవాళ్ళ ఆటో బయోగ్రఫీలని చదివాను. జీవితంలో వారి ప్రతి లక్ష్యం వెనుక ఒక ఆశయం కనపడింది. అది వారికైనా మేలు చేసేది,లేక సమాజానికైనా మేలు చేసేదిగా ఉండేది. నాకు అర్ధం కానిది, నాకు ఇప్పటికీ అంతు చిక్కనిది హిట్లర్ జీవితం, అతని ఆశయం. నియంతృత్వంతో ప్రపంచాధిపత్యం సాధించాలనే కోరికతో ఎంతోమంది యుద్ధ పిపాసులు నియంతలుగా అవతరించారు. తన సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని మట్టు బెడుతూ మాత్రమే వారు నియంతృత్వంతో వ్యవహరించారు. కాని ఎవరూ లక్ష్యాన్ని చేరుకోకుండానే మరణించారు. కాని అలాంటి వారికి భిన్నమైన మనస్తత్వం హిట్లర్ ది. తనతో ఏకీభవించని వారిని మాత్రమే కాకుండా, అసలు తనకు ఏమాత్రం సంభంధం లేని యూదులు, జెర్మనీ అభివృద్ధి కి ఆటంకాలుగా ఉన్నారనే అసత్య ఆరోపణలతో, జర్మనీ నుండి యూదుల నిర్మూలనే నా లక్ష్యం అనే నినాదంతో పార్టీని స్థాపించి, ప్రజల మధ్య జాతి విద్వేషాలని రెచ్చగొట్టి తాను అధికారంలోకి వచ్చాక 60 లక్షలమంది యూదులని అత్యంత కిరాతంగా మట్టుబెట్టాడు. చాలామందికి హిట్లర్ అంటే నియంతగా మాత్రమే తెలుసు. కాని తెలియని మరో కోణం ఈ యూదు విద్వేషం, జాత్యహంకారం.

మొదటి ప్రపంచ యుద్ధం 
 
యూరప్ లో ఉన్న సెర్బియా దేశస్థుడు తమ దేశపు వ్యక్తిని హత్య చేయటంతో ఆస్ట్రియా, హంగరీ ఆ దేశంపై యుద్ధం ప్రకటించాయి. ఆ యుద్ధం పెరిగి సెర్బియాకి మద్దతుగా ప్రపంచంలో 28 దేశాలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అమెరికా,బ్రిటన్ ,ఫ్రాన్స్ . వాటికి ప్రత్యర్ధులుగా జర్మనీ, ఆస్ట్రియా ,హంగరీ, బల్గేరియా అక్షరాజ్యాలుగా అవతరించాయి. ఈ మిత్ర రాజ్యాలు,అక్ష రాజ్యాల మధ్య జరిగిన యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం. 1918 వరకు యుద్ధం జరిగింది. ఎంతో ప్రాణ నష్టం , ధన నష్టం జరిగింది. జర్మనీ ఆర్ధికంగా చితికిపోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెయిమర్ రిపబ్లిక్ ప్రభుత్వం యూదులకి స్వేచ్చనిచ్చింది. వారు ఆర్ధికంగా సంక్షోభంలో ఉన్న జర్మనీ ని గాడిలో పెడతారని నమ్మింది. యూదులు మంచి వ్యాపార దక్షత కలవారు. వీరు అంతర్జాతీయ బాంకర్లుగా కూడా పిలవబడ్డారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ యూదు మేధావి. ఈ కాలంలోనే థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆవిష్కరించాడు. జర్మనీకి గర్వకారణం అంటూ వెయిమర్ ప్రభుత్వం ఆయన్ని కీర్తించింది. కాని జర్మనీ కి కాలం కలిసి రాలేదు. యుద్ధంలో ఓడిపోవటంతో గెలిచిన దేశాలు తమకు జరిగిన నష్టానికి పరిహారం కట్టమన్నాయి. దీనిని వేర్సైల్స్ సంధి అంటారు. ఫ్రాన్సు లో ఉన్న వేర్సైల్స్ రాజ ప్రాసాదంలో ఈ ఒడంబడిక జరిగింది. ఈ దెబ్బతో జర్మనీ ఆర్ధికంగా కుదేలయింది.డబ్బు కట్టటం కోసం కరెన్సీ అధికంగా ముద్రించారు. దీని వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారింది. ఇక డబ్బు కట్టలేమని జర్మనీ చేతులెత్తేయటంతో ఫ్రాన్సు ఆ దేశపు బొగ్గు పరిశ్రమ ని స్వాధీనం చేసుకుంది. 1929 నాటికి దేశంలో The great Depression మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో జర్మన్స్ కి దేవుడిలా కనపడ్డాడు అడాల్ఫ్ హిట్లర్.
 
                                              అడాల్ఫ్ హిట్లర్ ఏప్రిల్ 20, 1889 న బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా, జర్మనీ దేశ సరిహద్దులలో ఉంది. ఆరుగురు పిల్లలలో హిట్లర్ నాలుగోవవాడు మరియు మూడవ మగ బిడ్డ. హిట్లర్ తండ్రి అలోఇస్ హిట్లర్ (అసలు పేరు శ్చిక్క్ల్ గ్రుబర్) వాణిజ్య శాఖలో గుమాస్తా. హిట్లర్ తల్లి క్లారా పోల్జ్ (1860–1907), అలోఇస్ కు రెండవ మరదలు మరియు మూడవ భార్య. వీరికి కలిగిన ఆరుగురు సంతనంలో హిట్లర్ మరియు అతని చెల్లెలు పౌలా మాత్రమే బతికారు. అలోఇస్ జూనియర్, ఏంజెలా, ఈ ఇద్దరు అలోఇస్ కు రెండవ భార్య వలన కలిగిన సంతానం. అలోఇస్ మొదటి భార్యకు పిల్లలు లేరు. అలోఇస్ హిట్లర్ (హిట్లర్ తండ్రి) ఆక్రమ సంతానం. తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు. 1876 లో జనాభా లెక్కల ప్రకారం ఒక గుమస్తా ఇతని సవతి తండ్రి 'జోహాన్న్ గెఒర్గ్ హైడ్లార్' ను అలోఇస్ తండ్రిగా పేర్కొన్నాడు. ఆ పేరు రకరకాలుగా పిలవబడి చివరకు 'హిట్లర్' గా స్థిరపడింది. పురాతన జర్మన్ భాషలో 'హిట్లర్' అంటే గుడిశె లో నివసించే వాడని అర్థం. యుక్త వయసు వచ్చేనాటికి సరిహద్దు అధికారుల కళ్లుగప్పి జర్మనీ లోకి ప్రవేశించాడు. హిట్లర్ గొప్ప చిత్రకారుడు,కొన్నాళ్ళు  రోడ్డు మీద రక రకాల ;బొమ్మలు వేసి పొట్ట పోసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యం లో చేరాడు. యుద్ధ మెళకువల్ని రాజకీయాలని అక్కడే వంటబట్టిన్చుకున్నాడు. 1918 లో జర్మనీ యుద్ధంలో ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక పోయాడు.ఆ ఓటమికి యూదులే కారణం అని వారి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు.1920 లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలో చేరి దానికి నాయకుడయ్యాడు. దాని పేరుని నేషనల్ సోషలిస్ట్ పార్టీ గా మార్చాడు.దీనినే క్లుప్తంగా నాజీ పార్టీ అన్నారు.దీనికి పనిచేసిన సైన్యం నాజీలుగా పిలవబడ్డారు.  పార్టీ గుర్తుగా స్వస్తిక్ ని హిట్లర్ రూపొందించాడు.పార్టీ అన్నీ తానై వ్యవహరించాడు.జర్మన్స్ అంటే ఆర్య జాతికి చెందిన వారని, వారికి మాత్రమె ప్రపంచాన్ని ఏలగల సత్తా ఉందని ప్రజలలో ప్రచారం చేశాడు.జర్మన్స్  మాత్రమే జర్మనీ లో ఉండాలని పిలుపునిచ్చాడు. 1923 లో అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని కవాతు చేయించాడు. ఇది ఒక బీర్ హాల్ దగ్గర జరగటంతో చరిత్ర లో ఇది బీర్ హాల్ పుష్ గా పిలిచారు.
 
ఇందుకుగాను అప్పటి ప్రభుత్వం హిట్లర్ ని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఆ సమయాన్ని హిట్లర్ వృధా చేసుకోలేదు. ది మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని రాసాడు. జర్మనీ ఎలా ఉండాలో తాను ఎలాంటి జర్మనీ ని చూడాలనుకుంటున్నాడో అందులో రాసాడు. జర్మనీ వాసులు ఆర్యజాతి అని మిగతా వాళ్ళంతా సెమిటిక్ జాతులు గా వర్ణించాడు. ఆర్యులు మాత్రమే గొప్పజాతిగా ఉండాలని,ప్రపంచాన్ని ఏలాలని ఉద్బొదించాడు. ఆ పుస్తకం 1925 నాటికి  240000 కాపీలు అమ్ముడు పోయింది.యుద్ధం ముగిసే నాటికి 10 లక్షల కాపీలు అమ్ముడు పోయిందని ఒక అంచనా.1924 లో జైలు నుండి విడుదలయ్యాక నాజీ పార్టీని మరింత బలోపేతం చెయ్యటం మొదలు పెట్టాడు. 1929 మొదలైన సంక్షోభం 1933 నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో హిట్లర్ ఆవేశ పూరిత ప్రసంగాలు జర్మనీ ప్రజలని ఆకట్టుకున్నాయి. యూదులు లేని జర్మనీ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని నాజీల చేత చేయించిన ప్రతిజ్ఞలు జర్మనీ వాసుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. హిట్లర్ జర్మనీ రక్షకుడుగా వారికి కనిపించాడు. 1933 ఎన్నికలలో మెజారిటీ కూడగట్టుకున్న హిట్లర్,1934 నాటికి దేశాధ్యక్షుడు హిండెన్ బర్గ్ మరణించటంతో పూర్తి స్థాయి జర్మనీ అధ్యక్షుడుగా అవతరించాడు.ఇక అక్కడ్నుంచే యూదులకి, జర్మనేతర జాతులకి కష్టాలు మొదలయ్యాయి. యూదుల వ్యాపారాల్ని నిషేదించారు. వారు నగరాల మధ్యలో ఉండకూడదని ఆంక్షలు విధించారు. అసలు ఈ యూదులంటే ఎవరు? ఎందుకు జర్మనీలో ఉన్నారు ? హిట్లర్ కి వాళ్ళంటే ఎందుకు అంత కోపం? 
 
Date : 30.07.2013