Saturday, November 30, 2013

కమ్మవారంతా చౌదర్లేనా ???


చాలా కాలం నుండి నా మనసులో ఉన్న ప్రశ్న ఇది. నాకు సమాధానం దొరికి చాలా రోజులే అయినా ఇప్పటివరకూ ఎక్కడా చర్చించాల్సిన అవసరం రాలెదు. మొన్నామధ్య గ్రామానికి వెళ్ళినప్పుడు విజయవాడలో ఇంజినీరింగ్ చదువుకునే మా బంధువుల అబ్బాయిని ఇంటికి ఆహ్వానిస్తే, తనకి C పార్టీ ఉంది కాబట్టి అది అయ్యాక వస్తాను అని చెప్పాడు. అంటే కాలేజి లో ఉన్న కమ్మ విద్యార్ధులు మాత్రమే జరుపుకునే పార్టీ అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇటీవల గ్రామానికి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దల దగ్గర దగ్గర ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు, నాకు ఉన్న సందేహాలు పూర్తిగా నివృత్తి అయ్యాక అందరికీ కూడా ఇది తెలిస్తే బావుంటుంది అనిపించింది. మన గ్రామానికి సంభందించినంతవరకూ నేను ఎరిగిన కుటుంబాల్లో అత్యధికంగా చౌదరి అనే పేరు చివర పెట్టుకున్న కుటుంబం గొర్రెపాటి నరసింహం గారిది. గ్రామంలో వీరిని బోళ్ళపాడు మునసబు గారి కుటుంబం అంటారు. పడమట వీధి చివర్లో ఉంటుంది వీరి ఇల్లు. దాదాపు 70 సంవత్సరాల క్రితమే వీళ్ళ కుటుంబంలో వారి పేర్ల వెనుక చౌదరి అనే నామం కూడా ఉండేది. వారంతా తమ తాత ముత్తాతల పేర్లు తమ పిల్లలకి పెట్టుకునేటప్పుడు అవి మోటుగా ఉంటాయేమో (పేరయ్య చౌదరి,బసవయ్య చౌదరి) అని ఆ పేర్ల చివర చౌదరి అని తగిలించారేమో అనే ఆలోచనలోనే నేను ఉండేవాడిని.  గ్రామంలో మిగతా వాళ్ళెవరూ పెద్దగా ఆ హోదాని తగిలించుకునట్లు కనబడలేదు.

గొర్రెపాటి నరసింహం గారి ఇల్లు 
సహజంగానే కృష్ణా జిల్లాలో ఉన్న కులజాడ్యం వల్ల స్కూల్స్ లోనూ కాలేజీల్లోనూ,ఇప్పుడు బెజవాడ లో ఇంజినీరింగ్ చదివే వాళ్ళంతా తమ పేరు చివర చౌదరి అనే ఒక తోక ని తగిలించుకుంటున్నారు.( తల్లిదండ్రులు తమకి ఆ పేరు పెట్టకపోయినా,వారే సొంతగా తగిలించు కుంటున్నారు. ) అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాము జరుపుకునే కమ్మ పార్టీలకి "C" పార్టీ అని పేర్లు పెట్టుకుంటున్నారు. చౌదర్లు మాత్రమే పాల్గొనే పార్టీలన్న మాట. కాని చౌదరి అనేది కమ్మవారికి ప్రత్యామ్నాయ పదం కానే కాదు. కేవలం కృష్ణా,గుంటూరు జిల్లాల్లో తప్ప రాయలసీమలో,తెలంగాణాలో కమ్మవారు తమ పేర్ల వెనుక చౌదరి అని పెట్టుకోలేదు. అక్కడి వారంతా నాయుడు అని పెట్టుకున్నారు. కాని అక్కడ కూడా నాయుడు అని పెట్టుకున్న వాళ్ళంతా కమ్మవారు కాదు. కమ్మ నాయుడు అంటేనే వారు కమ్మవారు. భూస్వాములు జమీందార్లు తమ పేరు వెనుక చౌదరి అని పెట్టుకుంటారని చాలామంది పొరబడతారు. చల్లపల్లిని పాలించిన యార్లగడ్డ వంశీకులు, ముక్త్యాల ని పాలించిన వాసిరెడ్డి వంశస్తులు ఎవరూ తమ పేర్ల వెనుక ఈ చౌదరి ని తగిలించుకోలేదు. పేరుకి ముందు రాజా అని లేదా పేర్లకి చివర నాయుడు అనే తగిలించుకున్నారు. అంటే వారంతా చౌదర్లు కాదా? కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కమ్మవారు కూడా అందరూ చౌదరి అని పెట్టుకోలేదు. ఇటీవల కమ్మవారంతా దీనిని ఒక గౌరవ నామంగా, హోదాని సూచించే గుర్తుగా వాడటం ఎక్కువైంది. కాని కమ్మలంతా చౌదర్లు కాదు. 1579 లో కుతుబ్ షాహిలు కొండవీడుని జయించినప్పుడు, కుతుబ్ షాహిల దగ్గర పనిచేసే రాయరావు అనే మరాఠా సేనాని కృష్ణా,గుంటూరు జిల్లాల్లో ఉన్న 497 గ్రామాలకి పన్నులు వసూలు చేసేవారిగా కమ్మవారిని నియమించాడు. మహారాష్ట్రలో ఆదాయంలో పావు వంతుని పన్నుగా వసూలు చేసేవారు. మరాఠా లో ఆదాయంలో పావు వంతుని చౌత్ అంటారు. ఆ చౌత్ ని వసూలు చేసేవారు కాబట్టి ఆ కుటుంబాల వారిని చౌదరి అన్నారు. అలా ఆ పదం వాడుక లోకి వచ్చింది. ఈస్టిండియా కంపెనీ, బెంగాల్,బీహార్ లలో పన్నులు వేలం వేసి అక్కడి జమిందార్లకి అప్పగించేవారు. వాళ్ళు అక్కడి నాలుగో వంతు భూమికి హక్కుదార్లు అనే అర్ధం లో వారికి చౌధురి,రాయ్ చౌధురి అని బిరుదులు ఇచ్చేవారు. కాని ఈ చౌధుర్ల లో అన్ని కులాల వాళ్ళు కనబడతారు. వారు దానిని ఇంటిపేరుగా కూడా కొనసాగించారు. కాని మన వాళ్ళు ఇంటిపేరు కొనసాగిస్తూనే పేరుకు చివర ఇది కూడా తగిలించటం మొదలు పెట్టారు.  ఉత్తరాదిన ఉండే ఈ చౌదర్లకి మన ప్రాంతం లో ఉండే చౌదర్లకి సంభంధమే లేదు. ఇక్కడ కేవలం కమ్మవారినే పన్నులు వసూలు చెయ్యటానికి నియమించటం వల్ల చౌదరి అనేది కమ్మకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు తప్ప చౌదరి అనేది  హోదాని లేదా కులాన్ని సూచించే పేరు కాదు. తర్వాత కాలంలో ఈ పన్ను వసూలు దార్లు కొంతమంది మునసబులుగా, జిల్లాలో ఉన్న కమ్మ జమిందార్ల దగ్గర సముద్దార్లు గా పనిచేశారు. వారసత్వంగా అది వారి పిల్లలకి సంక్రమించింది. కాబట్టి చౌదర్లంటే 16 వ శతాబ్దం లో నియమించబడ్డ ఆ 497 కమ్మ కుటుంబాల వారు మాత్రమే. మీ తాత,ముత్తాతలెవరైనా ఆ 497 కుటుంబాలకి చెందినవారైతేనే మీరు చౌదరి అని పెట్టుకోవటం లో అర్ధం ఉంది . చౌదరి అంటే పదవిని సూచించే నామమే తప్ప కులాన్ని సూచించేది కాదు. నేను పైన ఉదహరించిన ఆ కుటుంబంలో వాళ్ళు తమ తాత ముత్తాతలంతా పన్నులు వసూలు చేసేవారని చెప్పటం వల్ల వారి పేర్ల చివర చౌదరి అని పెట్టుకుని ఉండవచ్చు. కాబట్టి చౌదర్లంతా  కమ్మవారే కాని ,కమ్మవారంతా చౌదర్లు కాదు.

ఇప్పుడు ఇది తెలిశాక చౌదరి అని పెట్టుకోవటం మానేస్తారని కాని, మానేయాలని కాని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పదం ఇప్పటికే కమ్మవారికి ప్రత్యామ్నాయం గా మారిపోయింది. కాని వాస్తవాలు తెలుసుకోవటం అవసరం కాబట్టి దీని వెనుక కధ ని వివరించటం జరిగింది. 

Monday, November 18, 2013

నా ఐరోపా యాత్ర - 12(పోలాండ్)


వార్సా అనేది పోలాండ్ రాజధాని నగరం. నేను మొత్తం 3 సార్లు ఈ నగరాన్ని సందర్శించటం జరిగింది. ఇప్పుడు మేము వెళుతున్నది ​అక్కడున్న ఇండియన్ ఎంబసీ నుండి జన్మదిన ధృవీకరణ పత్రం తీసుకోవటానికి. నేను మొదట్లో చెప్పినట్లుగా ఇక్కడ అన్నీ స్థానిక పరిపాలనలోనే జరుగుతాయి. మేము నివసించే మింజు జేర్జ్ నగర కార్యాలయంలోనే నివాస ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది. ఆ కార్డ్ కాల పరిమితి కూడా ఆయా స్థానిక అధికారే నిర్ణయిస్తాడు. ఆ కార్డు ఉంటే యూరప్ లో ఉన్న 24 దేశాలకి ఎటువంటి వీసా అవసరం లేదు. దానినే మన పాస్ పోర్ట్ గా పరిగణిస్తారు. ఆ కార్డ్ కావాలంటే ఇండియన్ ఎంబసీ నుండి జన్మదిన ధృవీకరణ పత్రం తీసుకుని స్థానిక ఆఫీసులో ఇస్తే మనకి రెసిడెన్స్ కార్డు జారీ చేస్తారు. ఉదయ్ అమ్మణ్ణ , నేను దాదాపు ఒకేసారి పోలాండ్ వచ్చాం. అంతకుముందు 10 సంవత్సరాలు అమ్మణ్ణ అమెరికాలో వర్జీనియాలో ఉన్న బ్రాంచ్ లో పని చేసి ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయ్యాడు. సోజో జార్జ్ అనే మలయాళీ ఇక్కడ 5 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. తన పాస్ పోర్ట్ కాలపరిమితి ముగియటంతో అది పునరుద్ధరించుకోవటానికి ఇండియన్ ఎంబసి కి వస్తున్నాడు. యూరప్ దేశాలన్నీ రైలు మార్గంతో అనుసంధానించబడ్డాయి. కొన్ని రైళ్ళ వేగం గంటకి 300 కిలోమీటర్లు కూడా ఉంటుంది. ఏ దేశానికా దేశపు రైలు వ్యవస్థ తో పాటు యూరో రైల్ అనేది అన్ని దేశాలని కలుపుకుంటూ పోయే వ్యవస్థ. పోలాండ్లో రైల్ సంస్థ ని పోల్ రైల్ అంటారు. మేము వార్సా వెళ్ళాలంటే పోజ్ నాన్ వెళ్లి అక్కడినుండి ట్రైన్ లో వెళ్ళాలి. మింజు జేర్జ్ నుండి పోజ్ నాన్ గంట ప్రయాణం. ట్రైన్ 6.30 నిమిషాలకి కావటంతో మేము 4 గంటలకల్లా మింజు జేర్జ్ లో బయలుదేరితే ఆ ట్రైన్ ని అందుకోగలం. 4 గంటలకల్లా రెడీ గా ఉండమని కంపెనీ ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ ఆడమ్ చెప్పాడు. ఇక్కడ ఆడమ్ గురించి కొంత చెప్పాలి. మా కంపెనీ పునాది వేసిన దగ్గరనుండి ఆడం మా కంపెనీకి పని చేస్తున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడటం రావటంతో కంపెనీ కి వచ్చే అతిధులని తీసుకు రావటానికి కంపెనీ అతనినే పురమాయించేది. ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరికీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడమ్ టాక్సీ లోనే వెళ్ళే వాళ్ళం. అతను కేవలం మా కంపెనీ పనులకు మాత్రమే టాక్సీ ని నడుపుతాడు. మేము టాక్సీ లో పోజ్నాన్ చేరేటప్పటికి 4.15 అయ్యింది. అక్కడున్న కౌంటర్ లో టికెట్ తీసుకుని ప్లాట్ ఫారం మీదికి వెళ్ళాం. పోలిష్ భాషలో ప్లాట్ ఫారంని పెరోన్ అంటారు. మేము ఎక్కింది పోల్ రైల్, అంటే కేవలం పోలాండ్లో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే రైల్ మాత్రమే.
ఒక అరగంట నిరీక్షించాక ట్రైన్ బయలు దేరింది. దాదాపు 3 గంటలు ప్రయాణించాక వార్సా చేరుకున్నాం. అప్పటిదాకా జనాలు పెద్దగా కనిపించని రూరల్ ఏరియాలు మాత్రమే చూసిన నాకు పెద్ద నగరాన్ని చూడటం కొత్తగా అనిపించింది. యూరప్ లో పెద్దగా స్కై స్క్రాపర్స్ కనిపించవు. అన్నీ వందల ఏళ్ళ నాటి భవంతులే ఉంటాయి. వార్సా అతి పురాతన నగరం. రెండవ ప్రపంచ యుద్ధ పతనం ప్రారంభమైంది ఇక్కడే. నాజీలు ఈ నగరాన్ని బాంబులతో నేల మట్టం చేశారు. యూదులు అందరినీ ఇక్కడ ఘెట్టో లో ( యూదులు నివసించే ప్రాంతాన్ని ఘెట్టో అంటారు ) బంధించి హింసిస్తుంటే కొంతమంది యువకులు ప్రతిఘటించి నాజీలని ఎదిరించి పోరాడారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పతనానికి నాంది ఇక్కడే మొదలైంది. అప్పటిదాకా యుదులంతా తమపై జరుగుతున్న దాడులని ఎక్కడా ప్రతిఘటించలేక పోయారు. వార్సా ఘెట్టో ఆ ప్రతిఘటనకి వేదికైంది. రైల్వే స్టేషన్ నుండి ఇండియన్ ఎంబసీకి టాక్సీలో వెళ్ళాలి. సోజో ఇంతకుముందు వెళ్ళిన అనుభవం ఉండటంతో తనే టాక్సీ ని పిలిచి అడ్రెస్ చెప్పాడు.10 నిమిషాల తర్వాత టాక్సీ ఒక పదంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది. ఆ బిల్డింగ్ ఎనిమిదో ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ లో ఇండియన్ ఎంబసీ ఉంది. నేను ఇంతకుముందు పోలాండ్ వీసా కోసం నేను మన దేశంలో ఉన్న పోలాండ్ ఎంబసీ కి వెళ్ళాను. డిల్లీ లో చాణక్య పురి లో అన్ని దేశాల ఎంబసీలు కొలువై ఉంటాయి. ఒక్కోటి 2 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో విశాలంగా ఉండటం చూశాను. కాని ఇక్కడ మన ఎంబసీని చూశాక చాలా ఆశ్చర్య పోయాను. అగ్గిపెట్టె లాంటి చిన్న లిఫ్ట్ లో 8 వ అంతస్తుకి వెళితే కనీసం విజిటర్స్ కూర్చోవటానికి సరైన కుర్చీలు కూడా లేవు. దేశం కాని దేశంలో కూడా వచ్చిన వారితో అక్కడి ఉద్యోగులు కనీస మర్యాదలు కూడా పాటించటం లేదు. మేము వచ్చిన పని చెప్పి మా పాస్ పోర్ట్ ఇచ్చి నిలబడ్డాం. దాదాపు గంట నిరీక్షణ తరువాత లోపలికి పిలిచి మాకు కావాల్సిన లెటర్స్ ఇచ్చారు. సోజో జార్జ్ కి కూడా రెన్యువల్ అయిన పాస్ పోర్ట్ ఇచ్చారు. మళ్లీ తిరుగు ప్రయాణానికి చాలా సమయం ఉంది. సిటీ చూద్దామని బయటకి వచ్చాము. అక్కడికి కొద్ది దూరంలోనే పెద్ద పార్క్ ఉంది. ఆ పార్క్ లో రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి గుర్తుగా కట్టిన ఒక స్థూపం దగ్గర నిలబడి చూస్తున్నాం. మమ్మల్ని చూసిన ఒక 70 ఏళ్ల మహిళ మా దగ్గరకి వచ్చి ఆవేశంగా ఆ స్థూపాన్ని చూపిస్తూ ఏదో చెప్పింది. మేమిద్దరం కొత్త కావటంతో మాకు ఆ పోలిష్ భాషలో ఏమి చెప్తుందో అర్ధం కాలేదు. సోజో కి పోలిష్ భాష రావటంతో ఆమె చెప్పేది విని మాకు వివరించాడు. యుద్ధం జరిగినపుడు నాజీలు ఎన్ని అకృత్యాలకి పాల్పడ్డారో చెపుతూ ఆ పార్క్ లో నే జరిగిన నర మేధం గురించి చెప్పింది.
అక్కడ కాసేపు గడిపాక బయటకి వచ్చాం. రోడ్డు మధ్యలో ట్రాములు తిరుగుతున్నాయి,నేను ట్రాము చూడటం అదే మొదటి సారి. రోడ్ల మధ్యన ట్రాఫిక్ కి , నడిచేవాళ్ళకి ఇబ్బంది లేకుండా నడుస్తున్న వాటిని చూస్తే కొంచెం ఆశ్చర్యం వేసింది. సిగ్నలింగ్ వ్యవస్థ అంతా రోడ్లకి, ట్రాము మార్గానికి సమకాలీకరించి ఉంది. జూన్ 8 నుండి యూరో ఫుట్ బాల్ క్రీడలు జరుగుతున్నాయి. మేము వెళ్ళిన రోజు వార్సా లో మాచ్ ఉంది. ఆ రోజు వార్సా అంతా ఎటు చూసినా పోలాండ్ జండాలతో పట్టుకుని ఫుట్ బాల్ ఫీవర్ తో జనాలంతా ఉత్సాహంగా ఉన్నారు.మనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో ఇక్కడ వాళ్ళకి ఫుట్ బాల్ అంటే అంత పిచ్చి.కాసేపు ఆ హడావుడి అంతా చూశాక పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్ళాము. ప్రపంచీకరణ మొదలయ్యాక కొన్ని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా ఒకేరకంగా అన్పిస్తాయి. నేను హైదరాబాదు లో చూసిన షాపింగ్ మాల్స్ కి ఇతర దేశాలన్నిటిలో చూసిన షాపింగ్ మాల్స్ కి ఎక్కడా తేడా లేదు. షాపింగ్ మాల్ ఫార్మాట్ అంతా అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటుంది. భారత దేశంలో ఉన్న పేరొందిన మౌలిక సదుపాయాల కల్పన కంపెనీలన్నీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులని నిర్మిస్తుండటంతో, ఆధునిక నిర్మాణాలలో మిగతా దేశాలలో నిర్మాణాలకి, మన వాటికి పెద్ద తేడా కనిపించదు. అందుకే ఆ మాల్ చూస్తున్నంత సేపు నాకు ఏ జివికె లోనో, ఇనార్బిట్ మాల్ లోనో ఉన్నట్లే ఉంది. చాన్నాళ్ళకి కే ఎఫ్ సి కనపడటంతో లంచ్ అక్కడే కానిచ్చేసి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము. ఇప్పుడు మేము వెళ్లబోయేది యూరో రైల్. వార్సా నుండి బెర్లిన్ వెళ్ళే రైలు అది. మేమున్న ప్రాంతానికి వెళ్ళటానికి బోశినేక్ అనే స్టేషన్లో దిగాలి. పోల్ రైల్ కంటే యూరో రైల్ స్పీడ్ ఎక్కువ,అలాగే టికెట్ రేట్ కూడా ఎక్కువే.ప్రతి ఆరుగురికి ఒక కాబిన్ ఉంటుంది. ట్రైన్ లో పెద్దగా జనాలు లేకపోవటంతో ఒక కాబిన్ లో ముగ్గురం కూర్చున్నాం. ఒక గంట తరువాత ఒక అమ్మాయి మేమున్న కాబిన్ లోకి వచ్చి కూర్చుంది. ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఆ అమ్మాయిని మీరేం చేస్తుంటారని అడిగాను.తను ఒక బస్సుల తయారీ కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నానని చెప్పింది. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతోంది. కాసేపు ఇండియా కల్చర్ మీద పోలాండ్ కల్చర్ మీద కొంత ఆసక్తి కరమైన విషయాలు చర్చించాము. తనకి ఒక హిందీ పదం వచ్చు అని చెప్పింది. ఏంటో చెప్పమని అడిగాం, మైనే ప్యార్ కియా అని నవ్వింది. ఇంతకుముందు పోలాండ్ లో జరిగిన ఒక ఎక్స్ పో లో ఇండియన్ స్టాల్ లో పని చేసినపుడు ఒకతను ఆ పదం నేర్పించాడట. దాని అర్ధం కూడా తనకి తెలుసు అని చెప్పింది. కాసేపటికి పోజ్ నాన్ స్టేషన్ రావటంతో ఆమె ఆ స్టేషన్లో దిగిపోయింది.
మేము ఇప్పడు పోజ్ నాన్ లో దిగకుండా తర్వాతి స్టేషన్ లో దిగాలి. మేము దిగగానే ఆడం మాకోసం స్టేషన్ బయట సిద్ధంగా ఉన్నాడు. వార్సా కాకుండా మేము తరచుగా సులేచిన్, పోజ్ నాన్, గోజుఫ్, జెలన గోర నగరాలకి తరచుగా వెళ్తుండే వాళ్ళం. సులేచిన్ లో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. పోజ్ నాన్ లో కూడా 2 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కాని మేము ఒక్కటే చూసాము. మధ్య ప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి దీనిని నడుపుతున్నాడు. జెలన గోర కొంచెం పెద్ద నగరం, అక్కడ నమస్తే ఇండియా అనే ఒక రెస్టారెంట్ ఉంది. హర్యానా కి చెందిన వ్యక్తి ఇక్కడ స్థానిక యువతిని వివాహమాడి ఇక్కడే స్థిర పడ్డాడు. సులేచిన్ లో తాజ్ మహల్ అనే రెస్టారెంట్ ఉంది, కాని ఇక్కడ వంట వాడు బంగ్లాదేశ్ కి చెందినవాడు. యూరోపియన్ దేశాలలో అత్యంత చవకగా నివసించగలిగిన దేశం పోలాండ్.మిగతా దేశాలలో నివసించే ఖర్చులో 50 శాతంలోనే ఇక్కడ జీవించవచ్చు. ఇప్పుడిప్పుడే భారత విద్యార్ధులు పోలాండ్ వైపు చూస్తున్నారు. వార్సా లో ఉన్న పలు యూనివర్సిటీలు ఇంగ్లీష్ భోధనా మాధ్యమంలో మన వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఒక్క భాషా సమస్యని మినహాయిస్తే ఇక్కడి ప్రజలు చాలా మంచి వారు. వర్ణ వివక్ష, అసూయా ద్వేషాలనేవి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. సహాయ పడటంలోనూ స్నేహం చేయటంలోనూ వారి తరువాతే ఎవరైనా. ఇప్పటికీ అక్కడి కుటుంబాలతో మా స్నేహం అవిచ్చిన్నంగా కొనసాగుతోంది. పోలాండ్ తరువాత నేను చూసిన దేశం స్వీడన్.